Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుక్కిదున్నడం, కలుపు తీయడం తెలిసిన రైతులే సమాజాన్ని సరిదిద్దే చైతన్యాన్ని ప్రదర్శించడం వర్తమాన వాస్తవం. అనాది నుంచి నేటి అత్యాధునిక కాలం వరకు రైతే ఈ ధరణికి నేత, సృజనకు భూమిక. సమాజానికీ, సాహిత్యానికీ దీపధారి. సకల జనులు మరోసారి రైతుపక్షం నిలచి మాట్లాడాల్సిన సందర్భమిది. పొలాలన్నీ హలాల దున్నిన రైతుల పక్షాన కలాలన్నీ పదునెక్కాల్సిన సమయమిది. శతాబ్దాలెన్ని గడిచినా నేలని నమ్ముకున్న రైతుల వెతలు తీరలేదు. భూమిని చదును చేసి పాడిపంటలతో సారవంతమొనర్చిన రైతుల స్వేదానికి తగిన ఫలితం దక్కలేదు. దేశానికి వెన్నెముక అని మాటలెన్నో చెబుతారు. చేతల్లో ఆ వెన్నెముకకు బలాన్నిచ్చే విధివిధానాల తీరు కనిపించదు. రాజులు, రాజరికాలు పోయినా, సరికొత్త రాజ్యాలు ఎన్ని అవతరించినా రైతు శ్రమని అప్పనంగా దోచిపెట్టే పాలకుల దౌష్ట్యం సమసిపోలేదు.
శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంత పురోగమించినా అన్నం పెట్టే రైతులు లేకుండా పూట గడవదు. అభివృద్ధి పేరుతో అష్టవంకర్లెన్ని పోయినా వ్యవసాయం లేకుండా మానవాళికి బతుకు లేదు. పూరిగుడిసెలో వున్న వారికే కాదు, పంచనక్షత్రాల భవంతుల్లో ఉన్నవారికి సైతం బుక్కెడు బువ్వ తప్పనిసరి. ఆ బువ్వ పెట్టే రైతులపై కనికరం లేని రాజ్యమొక రాజ్యమా అని ప్రశ్నించక తప్పదు. రైతు ఏడిస్తే దేశానికి అరిష్టం అనే మాట సరిపోదు, ఏడిపించే దాష్టీకాన్ని నిలదీసే చేతన ప్రధానం.
రైతుకు వ్యవసాయం వృత్తి కాదు, జీవన విధానం. దుక్కిదున్నే నేల లాభసాటి వనరు కాదు, జీవితంలో అంతర్భాగం. తన బతుకునీ, తన నేలనీ మరెవరికో కట్టబెట్టే కాంట్రాక్ట్ ఒప్పందాల కుటిల వ్యూహాలపై ప్రతిఘటన ఇవాళ్టి రైతుల సమరం. ఇది కేవలం గిట్టుబాటు ధరలకు పరిమితిమైంది కాదు, తనదైన బతుకు కోసం చేసే ఆత్మగౌరవ పోరాటం. తన నేలని కబళించే కార్పోరేట్ల దుర్మార్గంపై ఎలుగెత్తిన నిరసనరావం. తన భూమ్మీద తనని వెట్టికూలీలుగా మార్చే నయా బానిసత్వంపై చెలరేగిన తిరుగుబాటు చైతన్యం.
ఈ చైతన్యానికి దివిటీలు పట్టి నేల నలుచెరుగులా ఆ పోరాటదీప్తిని ప్రసరింపజేయాల్సిన కర్తవ్యం కవులు, కళాకారులది. పారిశ్రామికాభివృద్ధి కొత్త పుంతలు తొక్కిన ఈ కాలంలోనూ వ్యవసాయమే వృత్తిగా జీవించడం నగుబాటు కాదు, ఈ దేశ చారిత్రక వారసత్వం. మరో మాటలో చెప్పాలంటే నేలని నమ్మిన కోట్లాది ప్రజల జీవన తాత్వికత ఇక్కడి వ్యవసాయం. అందుకే అనేక ప్రక్రియల్లో వ్యావసాయిక జీవనం ప్రధాన ఇతివృత్తం. ప్రాచీన కవిత్వం నుంచి ఇవాళ్టి నానీల వరకు కవుల సృజనకు రైతు సూత్రధారి. నేలకీ, రైతుకీ ఉన్న బంధం విడదీయరానిది. ఈ బంధంలోని వైశిష్ట్యాన్ని చెబుతూ మేరెడ్డి యాదగిరిరెడ్డి రైతు నానీలు సృజించారు. కొందరు - ''ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం?'' అంటే ''నేలను రైతన్న దున్నినంత కాలం/ మెతుకు మీద మనిషి బతికినంత కాలం'' అని దర్భశయనం శ్రీనివాసాచార్య విస్పష్టంగా పలికారు. కనుక అలనాడు కవిత్వం రాస్తూనే వ్యవసాయం చేసిన పోతన నుంచి 'వరికల్లాన్ని' సృజించిన ఇవాళ్టి ముత్యం నాగవర్మ వరకు రైతుల ఆత్మారావాన్ని వినిపిస్తున్నారు.
వేలాది మంది రైతులు దేశ రాజధానికి తరలివచ్చి తమ ఆవేదననీ, ఆగ్రహాన్నీ ప్రదర్శిస్తున్నా ప్రధాన స్రవంతి మీడియాకు పట్టలేదు. సోషల్మీడియాలో వెల్లువెత్తే స్పందన దేశప్రజల దృష్టి రైతుల మీద మళ్ళేందుకు ప్రేరణయ్యింది. నాగళ్ళు నగరాలకు తరలి వచ్చిన దృశ్యం సాక్షాత్కారమయింది. దేశభక్తి మంత్రజపం చేసే పాలకుల దళారీ బుద్ధుల్ని లోకం కళ్ళకు గట్టింది. 'దున్నేవాడిదే భూమి' అనే నినాదానికి గల స్ఫూర్తిని గుర్తు చేసింది. పల్లెలు పట్టణాల్ని చుట్టుముట్టి విముక్తి చేయడం అన్న మాటలోని సారం, సారాంశం తెలుసుకోమని చెప్పింది. నెలకు ఏడు వేల రూపాయల కనీస ఆదాయం లేని రైతుల్ని బిచ్చగాళ్ళుగా దిగజార్చే రాజ్యం హంతక స్వభావాన్ని దుయ్యబట్టింది.
విభజించే పాలించే అధికారపు అహంకారాల మీద నాగలికర్రు దెబ్బ రొడ్డెక్కిన రైతు ఆగ్రహనినాదం. ఈ నినాదాన్ని అందిపుచ్చుకోవాల్సిన కర్తవ్యం కార్మికలోకం మీద, ఇతరేతర వృత్తుల మీద బతికేవారిపైన వుంది. ఎనిమిది గంటల పని దినం కోసం శతాబ్దాలుగా పోరాడి సాధించుకున్న శ్రామికుల హక్కును సంస్కరణల పేరిట హరించే దురాగతానికి తెగబడింది కాషాయ ప్రభుత్వం. సరళీకృత ఆర్థిక విధానాల పేరిట విభిన్న వృత్తుల వారి బతుకుని ఛిద్రం చేసే అమెజాన్ల, వాల్మార్ట్ల నిలువుదోపిడీకి అనుమతించింది. చిన్నచిన్న హౌటళ్ళ, చిల్లర దుకాణాల వారి పొట్ట కొట్టే జాయింట్ చైన్ల ఇష్టారాజ్యానికి తెర లేపింది. వృత్తులు నమ్ముకొని బతికే వారి నోటికాడి బువ్వను లాగేసే కార్పొరేట్ బ్యూటీ వెంచర్ల తాకిడి పెట్రేగిపోయింది. పట్టణంలో బతుకుదామని తరలివచ్చిన పల్లె యువకులు బహుళజాతి కంపెనీల గుప్పిటలో విలవిలలాడు తున్నారు. వీరందరికీ దారీతెన్నూ చూపిస్తుందీ రైతుల ఉద్యమ చైతన్యం. పోరాడితే పోయేదేమీ లేదు బానిస బంధనాలు తప్ప అనే సత్యాన్ని సరికొత్తగా రుజువు చేస్తున్నది.
రైతుల పోరాటానికి మనం సంఘీభావం ప్రకటించడం సరే, మనల్ని అప్రమత్తుల్ని చేసిన, మన బాధ్యతని గుర్తు చేసిన రైతులోకానికి మన చేతుల్ని పిడికిళ్ళుగా మార్చి జేజేలు పలకాలి. ఎలుగెత్తిన ఆ పిడికిళ్ళతోనే అధికార పీఠాల్ని వణికింపజేసే రణన్నినాదాలు చేయాలి. చెమట చిందించే వారి బతుకుని బర్బాజ్ చేసే మతం-మార్కెట్ మిలాఖత్ని దెబ్బతీయాలి. కనాకష్టం చేస్తూ సంపదల్ని పెంచే వ్యవసాయదారుల, కార్మికుల శ్రమని ఎవరూ కొల్లగొట్టలేరని చెప్పితీరాలి. ఈ దిశగా ప్రజానుకూల శక్తుల ఆలో చన, ఆచరణ పరిణమించడమే పదునెక్కిన రైతు చైతన్యానికి సాఫల్యం.