Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నకు అణచివేతే సమాధానమవుతున్న వేళ... బిగిసిన పిడికిళ్లు, ఎగిసిన నాగళ్లు కలిసి కవాతు చేస్తుంటే ఇనుప కంచెలు, ముళ్లతీగలు పక్కకు తొలగిపోతున్నాయి. లాఠీలు, తూటాలు పారిపోతున్నాయి. రాజధానిలో రైతులు ఆవిష్కరిస్తున్న ఈ అపూర్వ పోరాట ఘట్టానికి సంఘీభావంగా దేశం ఎరుపెక్కింది. నిరంకుశత్వాన్ని సవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే యోధుల్ని చరిత్ర కంటూనే ఉంటుందని రుజువు చేసింది. మన అన్నదాతల న్యాయపోరాటం దేశంలో రాజకీయ పునరేకీకరణకు దారితీయడమే కాదు, అంతర్జాతీయ సమాజాన్నీ ఆకర్షించి ఆలోచింపజేస్తోంది. నిన్నటి ''భారత్ బంద్''కు దేశమే కాదు, ప్రపంచమే జేజేలు పలికింది. ఈ పోరాట స్ఫూర్తి వర్తమానానికే కాదు, భవిష్యత్తుకూ గొప్ప భరోసానిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..?
దేశమంతా కరోనా వలయంలో విలవిలలాడుతున్న సమయాన్ని అదునుగా తీసుకుని, రైతులను దొంగదెబ్బ తీస్తూ కేంద్రం తెచ్చిన ఈ నల్ల చట్టాలకు ఇంతటి ప్రతిఘటన వెల్లువెత్తుతుందని బహుశా ఏలినవారు ఊహించి ఉండకపోవచ్చు. తమ మందబలంతో పార్లమెంటులో అప్రజాస్వామికంగా అనైతికంగా బిల్లులను ఆమోదించుకుని సంబురపడుతున్న సర్కార్కు ప్రజాక్షేత్రంలో ఇది తిరుగులేని ఎదురుదెబ్బ. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే రైతులకు ఇప్పుడు వచ్చిందని చెపుతున్న మోడీ సర్కార్ మోసపూరిత మాటలను భారత రైతాంగం వివ్వసించలేదు. ఆ ఫలితమే పంటల సాగు అనేది కేవలం ప్రకృతి వైపరీత్యాలకే కాదు, ప్రభుత్వాలకూ వ్యతిరేకంగా పోరాడాల్సిన అంశంగా మారింది. ఇంతటి మహౌద్యమానికి దారితీసింది.
దీంతో బెంబేలెత్తిన బీజేపీ ప్రభుత్వం ఈ ఉద్యమంపట్ల ముందు అణచివేతకూ, అది సాధ్యం కాక ఆపైన అసత్య ప్రచారానికీ పూనుకున్నది. శాంతియుత నిరసనల కోసం ఢిల్లీకి తరలివస్తున్న రైతాంగాన్ని సరిహద్దుల్లోనే నిలిపి యుద్ధం ప్రకటించింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. నీటిఫిరంగులను, బాష్పవాయుగోళాలను ప్రయోగించింది. లాఠీలు ఝళిపించింది. దేనికీ తలవంచని రైతాంగం లక్షల నుంచి కోట్లకు చేరి ఢిల్లీ చుట్టూరా సరిహద్దుల్లో మోహరించింది. దేశ చరిత్రలో దేశ రాజధానిని ఇంతగా దిగ్బంధనం చేసిన ఘటన మరొకటి లేదు. నవంబర్ 26న మొదలైన రైతుల ''ఛలో ఢిల్లీ'' కార్యక్రమం 13 రోజులుగా కొనసాగుతూనే ఉండటం వారి వీరోచిత పోరాట పటిమకు అద్దం పడుతోంది. వీరిని అడ్డుకోవడం సాధ్యం కాదనీ, అరెస్టులు చేసినా దేశంలోని జైళ్ళు సరిపోవనీ పోలీసు బలగాలు చేతులెత్తేసాయి. బల ప్రయోగంతో అణచలేమని గ్రహించిన ఏలికలు విష ప్రచారానికి తెరలేపారు. రైతుల్ని ఉగ్రవాదులన్నారు. ఆందోళన చేస్తున్నవారిలో అంతా కిరాయి మూకలే తప్ప రైతులే లేరన్నారు. చైనా, పాకిస్థాన్ ఏజెంట్లు వీరిని రెచ్చగొడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నా యన్నారు. చివరికి రైతులతో చర్చలకు దిగొచ్చారు!
మరిప్పుడు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది ఉగ్రవాదులతోనా..?! చైనా, పాకిస్థాన్ ఏజెంట్లతోనా..?! లేక కిరాయి మూకలతోనా..?! రైతులను సైతం నిందించగలిగిన ఏలినవారి కుట్రలూ, కుతంత్రాల సారాన్ని గ్రహించడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కేంద్రం ఈ చట్టాలను ఎందుకు తెచ్చిందో, ఈ చట్టాల పట్ల రైతుల ధర్మాగ్రహానికి కారణమేమిటో అర్థం చేసుకోవడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏంకావాలి? నిజానికి తాము అధికారంలోకి వస్తే... రైతులకు ఉత్పత్తి వ్యయానికి రెండు రెట్లు అధిక ఆదాయాన్ని అందిస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కింది బీజేపీ. తీరా గద్దెనెక్కాక అందుకు విరుద్ధమైన చర్యలు చేపట్టింది. వాటికి పరాకాష్టే ఈ వ్యవసాయ చట్టాలు. మొత్తం వ్యవసాయ రంగాన్నీ, ప్రత్యేకించి రూ.62లక్షల కోట్ల భారత ఆహార మార్కెట్నూ రైతుల నుంచి గుంజుకుని కార్పొరేట్లకు అప్పగించడమే ఈ మూడు చట్టాల ధ్యేయం. భారత వాణిజ్యంలో వ్యవసాయం వాటా 30 నుంచి 32శాతం వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని గంపగుత్తగా పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే మోడీ సర్కార్ లక్ష్యం. నిజానికి ఈ దేశంలో రైతుకు వ్యవసాయం అనేది ఓ జీవన విధానం. దాన్ని వ్యాపారంగా మార్చి పెట్టుబడికి ధారపోయడం, రైతు ఉనికినే ప్రశ్నార్థం చేయడం ఎవరికోసం? అని అడుగుతున్నారు రైతులు. జవాబులేని సర్కారు చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్లు రైతు నేతలతో ఐదు విడతలుగా చర్చలు జరిపినా ప్రతిష్టంబన ఏమాత్రం తొలగలేదు. చట్టాలను రద్దు చేసేవరకు వెనక్కు తగ్గేది లేదు అంటొంది రైతాంగం. ఈ ఆందోళనలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఎత్తులూ జిత్తులకు పాల్పడుతోంది ప్రభుత్వం. ఈ ప్రయత్నాల కొనసాగింపులో ఈరోజు మరో విడత చర్చలు జరగాల్సి వుండగా అమిత్షా నిన్న రాత్రే చర్చలకు ఆహ్వానించారు. మరోవైపు నేడు ప్రతిపక్ష నేతలంతా రాష్ట్రపతిని కలువబోతున్నారు. ఏం జరుగుతుందో వేచిచూడాలి. ఏది ఏమైనా ''కొందరిని ఎల్లకాలం, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయడం సాధ్యం కాదు'' అన్న అబ్రహం లింకన్ వాఖ్యలను నిజం చేస్తూ పురోగమిస్తున్నారు రైతులు. వారి తెగువకు ఈనేల యావత్తూ ప్రణమిల్లుతోంది. అందుకు ప్రతీకే ఈ ''భారత్ బంద్'' విజయం. నాటి భగత్సింగ్ విప్లవ స్ఫూర్తి నేటి వర్తమానానికే కాదు, రేపటి భవిష్యత్తుకూ ప్రాణవాయువులు ఊదుతుందనడంలో సందేహం లేదని ఈ 'బంద్' నిరూపించింది.