Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాభివృద్ధి వాస్తవానికి గతుకుల రోడ్డుమీద సాగుతున్నది. సాధారణ పేదలు, మధ్యతరగతి ప్రజలు కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు, మధ్యాహ్నాం భోజనం కార్మికులు, ఆశాలు తదితర స్కీంవర్కర్లు తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోయారు. వారి పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. టీఆర్ఎస్ సర్కారు మాత్రం తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం అద్భుతమంటూ ఊదరగొడుతున్నది. ఒక్క హైదరాబాద్ అభివృద్ధికే రూ.67 వేల కోట్లు ఖర్చుపెట్టామంటూ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చింది. రోడ్లేయడం, ప్లైఓవర్లు కట్టడం, మెట్రో నిర్మించడం అభివృద్ధిగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నది. తద్వారా చంద్రబాబు హయాం ప్రపంచబ్యాంకు విధానాలనే కొనసాగిస్తున్నది. అలాగే కొన్ని తరగతులకు పింఛన్లు ఇవ్వడం, సాగుకు సహకరించడం కూడా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పుకుంటున్నది. మిషన్ కాకతీయ కింద నాలుగుదశల్లో రాష్ట్రంలో చేపట్టిన చెరువుల అభివృద్ధి కార్యక్రమం నత్తను తలపిస్తున్నది. మూడో దశ పనులే ఇంకా కాలేదు. రూ. 20 వేల కోట్లతో చేపట్టిన 46 వేలకుపైగా చెరువుల పనులు 70శాతం పూర్తయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, ఆ మేరకు అది జరగలేదని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇదిలా వుండగా రాష్ట్ర ఖజానాకి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ భౌతిక పరిస్థితిని ఇటీవల వచ్చిన భారీ వర్షాలు తేటతెల్లం చేశాయి. గత వందేండ్ల కాలంలో ఎన్నడూలేనివిధంగా బురదమయమైంది ఈ నగరం. మాస్టర్ప్లాన్కు చెదలుపట్టింది. రాష్ట్ర రాజధానిలో దాదాపు 185 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. నగరంలోని 321 ప్రధాన నాలాల్లో 12వేల చోట్ల కబ్జాకు గురైనట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి తొలగింపు, మరమ్మత్తుల కోసం రూ.298కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆక్రమణలు, కబ్జాల నుంచి కాపాడలేని పరిస్థితుల్లో సర్కారు ఉండటం దురదృష్టకరం. సుందరీకరణ పేరిట వేల కోట్లు ఖర్చుపెడుతున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు సరికదా, వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. హూస్సేన్సాగర్ పరిదీ తగ్గింది. ఒకనాడు మింట్కాంపౌండ్ దాకా ఉన్న సాగర్, ఇప్పుడు కుదించుకుపోవడం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో కనీస వేతనాలు దుర్లభమయ్యాయి. దాదాపు పదేండ్ల క్రితం నిర్ణయించిన బేసిక్ వేతనాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. 2016లో నెలకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ధారించారు. ఏడో పే రివిజన్ కమిషన్ సైతం దాన్నే ధృవపరిచింది. తాజాగా పెరిగిన ధరల కారణంగా కనీస వేతనం రూ. 21 వేలు ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రముఖ డాక్టర్ అక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం మనిషికి రోజువారిగా ఆహారం 2700 క్యాలరీలు అవసరం. ఈ మేరకే కనీస వేతనాన్ని నిర్ణయించాలి. సుప్రీంకోర్టు సైతం కొన్ని మార్గదర్శకాలిచ్చింది. కాగా సంబంధిత జీవోలను సవరించి, కొత్తవి ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో 75 రంగాల్లోని దాదాపు 17.5 లక్షల మందికి కనీస వేతనాల్లేవు. వామపక్షాల చొరవతో యూపీఏ హయాంలో అమల్లోకి వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులనూ పూర్తిస్థాయిలో పేదలకు ఇవ్వడం లేదు. దీంతో అక్కడా వేతనాలు సరిగ్గా లేవు. మన రాష్ట్ర జీడీపీ 2018-19లో 14.3శాతం కాగా, 2019-21కి వచ్చేసరికి 12.6శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగంలో 18.1శాతం కాగా, 2019-20లో 18.6శాతంగా ఉంది. ఇవే సంవత్సరాల్లో పారిశ్రామిక ఉత్పత్తి 5.8శాతం ఉంచి 1.7శాతానికి పడిపోయింది. సేవారంగం సైతం 9.9శాతం నుంచి 9.6శాతానికి తగ్గింది. ప్రభుత్వం ఇచ్చిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఒకవైపు ఉత్పత్తి తగ్గిందని చెబుతుంటే, మరోవైపు ఆ రేటు పెరుగుతున్నదనీ, లక్షలాది మందికి ఉపాధి కల్పించామని సర్కారు చెప్పడం హాస్యాస్పదం. కరోనా కారణంగా 1.5కోట్ల మంది అసంఘటిత కార్మికులు వలస కార్మికులుగా పట్టణాలను వదిలేశారు. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ 2020-21లో రూ.1,82,702 కోట్ల ఆదాయం కాగా, ఇందులో రూ.53 వేల కోట్లు తగ్గుతున్నట్టు భారత అకౌంటెంట్ జనరల్(ఏజీఐ) లెక్కలు చెబుతున్నాయి. గతంలో 2014-15 నుంచి 2019-20 వరకు ప్రకటించిన బడ్జెట్కు ఏటా సగటున రూ. 32 వేల కోట్లు ఆదాయం తగ్గింది. కరోనా దెబ్బతో రూ. 53 వేల కోట్లకు లోటు పెరిగింది. ఈ లోటు దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళా శిశు, సంక్షేమం, పాఠశాల విద్యపై ఎక్కువ ప్రభావం చూపింది. 2018 నుంచి ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనేలేదు. గత ఆరేండ్లుగా ఇండ్ల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉండటం తెలిసిందే. రుణ, మార్కెట్ సౌకర్యాల్లేక ప్రతియేటా 648 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే చెప్పగా, అందులో కౌలు రైతులు 180 మంది కావడం గమనార్హం. టీఎస్ఐపాస్ తెచ్చినా సర్కారు ఆశించిన విధంగా పరిశ్రమలు రావట్లేదు. ఉపాధి అవకాశాలూ పెరగట్లేదు. కాగా నిజామ్ షుగర్స్ తోపాటు అనేక భారీ పరిశ్రమలు, వందలాది చిన్నతరహా పరిశ్రమలు గత ఐదేండ్ల కాలంలో మూతపడ్డాయి. దీంతో ప్రజలు, కార్మికుల కొనుగోలు శక్తి మరింత పడిపోయింది .ఈనేపథ్యంలో ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, వారి జీవన ప్రమాణాలు పెరిగేలా కచ్చితమైన, చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.