Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బహుశా ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ తన పౌరులపై మోడీ ప్రభుత్వంలా యుద్ధం చేసుండదు. దీనికి కారణం తెలియాలంటే.. రాజు, ఏడు చేపల కథలో ''నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?!'' అన్న చీమ మాటలు అర్థం కావాలి.
పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలతో మొదలై నేడు ఉత్తర భారతదేశమంతా అట్టుడుకుతున్నది. ఆ రైతాంగ ఉద్యమంపై నీటి ఫిరంగులు, భాష్పవాయు గోళాలే కాదు నీతిమాలిన నిందారోపణలనూ ప్రయోగిస్తోంది ప్రభుత్వం. వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాదులున్నారని చెప్పటం మొదలు, చైనా పాకిస్థాన్లే ఆ ఉద్యమం వెనుకున్నారనే దాకా కేంద్ర పెద్దలు దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారు. భౌతికదాడి కంటే ఇవే మనసుల్ని గాయపరిచాయి. అందుకే శౌర్య పురస్కారాలు నుంచి పద్మ భూషణ్ వరకు, ఖేల్రత్న, అర్జున అవార్డులన్నింటినీ ఈ ప్రభుత్వం మొకాన కొట్టేందుకు వేలాదిగా సిద్ధమవుతున్నారు.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ దాడి దేశమంతటికీ ఒకే తీరుగా అర్థమైనట్టు లేదు. అర్థాంతరంగా లాక్డౌన్ ప్రకటిస్తే అది పదకొండు లక్షల మంది వలస కార్మికుల గోసగానే మిగిలింది. జేఎన్యూ, జామియా మిలియా విశ్వవిద్యాలయాలపై లాఠీలు కరాళనృత్యం చేసినప్పుడు అది పోరగాండ్లను దార్లో పెట్టడానికే అని ఏలిన వారు ప్రవచిస్తే నిజమని నమ్మిన ప్రజలూ ఉన్నారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఆస్మా ఖతూన్ (90), బిల్కిస్ బానో (82) వంటి అమ్మమ్మలు, నానమ్మల వెనక పాకిస్థాన్ హస్తముందని బొంకితే అదీ నిజమేమో అనుకున్న ప్రజలూ ఉన్నారు. ప్రజలపై సాగిన ఈ యుద్ధకాండ ఒక పార్శ్వమే చూసి, ఒక పార్శ్వాన్నే అర్థం చేసుకున్న ప్రజలకు ఇప్పుడు రైతులపై విరుచుకుపడుతుంటే సరళీకృత ఆర్థిక విధానాల విశ్వరూపం అర్థమవుతోంది. ఈ సర్జికల్ స్ట్రైక్కు మోడీ సర్కార్ ఎందుకు ఒడికట్టిందో, దానికి ఏ కమిట్మెంట్ కారణమో ఇప్పుడిప్పుడే గ్రహణం విడిచిన సూర్యుడిలా స్పష్టమవుతోంది. కాంగ్రెస్లా భయం, భయంగా కాకుండా కర్కశంగా, నిష్కర్షగా అమలు చేయగలడని గుజరాత్లో పదేండ్లకు పైగా రుజువు చేసుకున్న వ్యక్తిని కార్పొరేట్లంతా కలిసి వేల కోట్ల రూపాయలు పోసి ఎందుకు ప్రతిష్టించుకున్నారో తేటతెల్లమవుతోంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందంలో వ్యవసాయ రంగం షరతుల అమలే నేటి రైతాంగ ఉద్యమానికి కారణం. మొదటి తరం సంస్కరణలు - నీటి సంఘాలు, వన సంరక్షణ సమితులు, మదర్స్ కమిటీలు, వాటర్షెడ్ కమిటీల ఏర్పాటు వంటివి వాజ్పారు ప్రభుత్వ కాలంలోనే అమలైనాయి.
ఇప్పుడు రెండవ దశ సంస్కరణలు - వ్యవసాయ రుణాల తగ్గింపు, కాంట్రాక్టు వ్యవసాయం అమలు, యంత్రాల విస్తరణ, ఎగుమతి కోసం ఉత్పత్తి, పంటల మార్పిడి, కార్పొరేట్ వ్యవసాయం, సాంప్రదాయక ఎరువులు, విత్తనాల స్థానంలో మోన్శాంటో, డ్యూపాంట్ల రసాయనాలు వినియోగించడం, రైతుల సంఖ్య కుదింపు వంటివన్నీ ఉన్నాయి. దిగుమతులకు మన దేశాన్ని కేరాఫ్ అడ్రస్గా మార్చాలన్నది డబ్ల్యూటీవో నిబంధనల సారాంశం. మన రాష్ట్రంలోని ప్రతి (ఉమ్మడి) జిల్లా కేంద్రంలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉండేది గతంలో. నేడు అన్నీ జంగు పట్టిపోయాయి. నేడు నాలుగు బహుళ జాతి కంపెనీలు - మోన్శాంటో, డ్యూ పాంట్, కార్గిల్, సిన్గెన్టాల చేతిలో 80శాతం సీడ్ మార్కెట్ చేరిపోయింది. 1985 వరకు ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధించిన మనదేశం 1985-95 మధ్య స్తబ్దుగా ఉండి నేడు ఖాద్య తైలాలు, పప్పులు, చక్కెర, పత్తి, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలు, ముడిజ్యూట్, ముడి ఉన్ని, రకరకాల పళ్ళు దిగుమతి చేసుకునే దేశంగా మారిపోయింది. నేడు మనం మొజాంబిక్, మయన్మార్ వంటి దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం. అదీ మన దౌర్భగ్యం.
టాటా, బిర్లా, అంబానీ, అదానీ, బేయర్, ఐటీసీలు ఎగుమతి దిగుమతి వ్యాపారం నియంత్రించే దశలో ఉన్నాయి. ఈ దశలో అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాల్ని కాలదన్ని మూడు వ్యవసాయ చట్టాలను ''పాస్ చేసుకుంది'' మోడీ సర్కార్. రైతుల సంపద పెంచడానికే వారి సంక్షేమానికే తన ప్రభుత్వం కట్టుబడి ఉందని 'యస్' మీడియాలో ఫుల్పేజి ప్రకటనలిచ్చింది మోడీ సర్కార్. ఏ మార్కెట్లోనైనా తన ఉత్పత్తులను అమ్ముకోవచ్చని మోడీ చెపుతుంటే, మధ్యప్రదేశ్లోకి ఎవరైనా వచ్చి సరుకు అమ్మితే కాళ్ళు విరగ్గొట్తామని శివరాజ్సింగ్ చౌహాన్ చెపుతున్నాడు. మీడియా ప్రకటనలతో రైతాంగ ఉద్యమాన్ని బద్నామ్ చేసేపనిలో దేశ ప్రధాని ఉండటం దారుణం.
వంది మాగధులు ఆయన్ని ''ఉక్కు మనిషి'' అని కీర్తించినా అది అంబానీ, అదానీల కోసం, మోన్శాంటో, డ్యూపాంట్ కోసం గట్టిపడిన ఉక్కు. ప్రపంచ వాణిజ్య సంస్థలో పోత పోయబడ్డ మౌల్డ్ అది. అందుకే మనదేశ రైతాంగం డబ్ల్యూటీవో బంగారు పుట్టలో వేలుపెట్టడమే కాదు, దాన్ని చిందరవందర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఉక్కును కరిగించగలిగే శక్తి ఈ దేశ రైతాంగానికుంది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి వెన్నుముక రైతు. నైజాం నవాబు కాలంలో ఫ్యూడల్ దొరలపై తిరగబడ్డది రైతు.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికన్ ట్రేడ్ యూనియన్ నాయకుడు యూజీన్ డెబ్బ్ ''ప్రతి కాలంలోనూ ఒక నియంత ఉంటాడు. ఒక అణిచివేత దారుడుంటాడు. ఆ వ్యక్తి మతం పేరు మీద, దేశభక్తి పేరు మీద ప్రజల్ని మోసం చేస్తూండవచ్చు'' అని 1918లో చేసిన హెచ్చరిక వందేండ్లకి మనదేశంలో నిజం కావడం ఆశ్చర్యమేం కాదు.