Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతోపాటు సత్సంబంధాలూ అవసరమే. ఎవరూ కాదనరు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆ మేరకే ఏ వ్యవహారమైనా చేస్తాయి. కానీ, బీజేపీ, టీఆర్ఎస్ సర్కార్లు ప్రజాకోణంలో కాకుండా ఫక్తు స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యతను ఇస్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావు. సమన్వయం చేసుకోవడంలో, ప్రజా సమస్యలను చర్చించుకుని పరిష్కరించడంలో ఈ ధోరణి నష్టం చేస్తుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని పర్యటన ఇందుకు సాక్ష్యం. సరైన ప్రాథమ్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగినట్టులేదు. నువ్వు కొట్టినట్టు చేయి.. నేను ఏడ్చినట్టు చేస్తా అనే రీతిలో మోడీ, కేసీఆర్ వైఖరి కనిపిస్తున్నది. రాష్ట్రంలో అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. వీటిని పట్టించుకోని కేసీఆర్ సామాన్యులకు అక్కర్లేని ఎయిర్పోర్టుల ప్రస్తావన చేయడం గమనార్హం. ఇప్పటికే అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు శంషాబాద్లో ఉంది. దానికి దగ్గరలో మరోకదానికి తావులేదు. ఆ మేరకు ప్రభుత్వంతో జీఎంఆర్ సంస్థ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అయినా త్వరలో జరగనున్న సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్రంలో రెండున్నరేండ్ల క్రితం పంపిన ఆరు విమానాశ్రయాల నిర్మాణ ప్రతిపాదనలను ఇప్పుడు తెరపైకి తెచ్చారు. కాగా ఎప్పటిలాగే ఈమారూ ''చూద్దాం'' అనే జవాబే కేంద్రం చెప్పింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవి, గత ఆరేండ్లుగా ప్రధాని మోడీ, ఆయన మంత్రుల చెవిలో చెప్పుకుంటూ వస్తున్నవి చాలానే ఉన్నాయి. వాటి పరిష్కారంలో గులాబీ నేత పట్టుదలగా లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత సొమ్ము కట్టారు, అక్కడి నుంచి రాష్ట్రానికి ఎంత వచ్చింది అనే లెక్కలు చెబుతున్నారేగానీ, ఆ నిధుల సాధనలో కేసీఆర్ సర్కారుకు చిత్తశుద్ధి కరువైంది. ఇది ప్రజలకు అన్యాయం చేయడమే. నిటిఅయోగ్ సిఫారసు చేసినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు మోడీ ఇప్పటికీ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాను పట్టించుకోలేదు. రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకరించలేదు. జీఎస్టీ నిధులపై ఏడాదిగా నెత్తినోరు మొత్తుకుంటున్నా కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదు. పునర్విభజన చట్టంలోని పలు సమస్యలు నేటికీ పరిష్కారం చేయకుండా బీజేపీ తొక్కిపెడుతున్న సంగతి కేసీఆర్కు తెలియనిదా? హార్టీకల్చర్, ట్రైబల్ యూనివర్సిటీలు, ఐఐఎం ఎటుపోయాయి? బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీల హామీలు కొండెక్కాయా? ఐటీఐఆర్ను మింగేశారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రత్యేక రైలు సౌకర్యం, బడ్జెట్లోటు పూడ్చడం, కృష్ణా, గోదావరి నదుల వివాదాలకు రాష్ట్రంలో రివర్ బోర్డుల ఏర్పాటు, నీటి జలాల పంపిణీ అలాగే ఉండటం బీజేపీ నిర్లక్ష్యానికి, వివక్షకు కొలబద్ద. ముస్లింలకు 14శాతం, బీసీలకు 37శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 15శాతం రిజర్వేషన్ల సంగతి ఇంకా తేల్చనేలేదు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అమలు మాటలకే పరిమితం. హైదరాబాద్-నాగ్పూర్, వరంగల్-హైదరాబాద్ ఇండిస్టీయల్ కారిడార్ల అడ్రస్సేలేదు. వరంగల్ టెక్స్టైల్ పార్క్కు రూ.1000 కోట్ల గ్రాంట్ పత్తాలేదు. అభివృద్ధి కోసం రాజీపడేది లేదంటూ పదే పదే కబుర్లు చెప్పే కారు సర్కారు, కేంద్రంతో లాలూచీ కుస్తీ పడుతున్నది. నికరంగా నిలబడటం లేదు. పదే పదే మీడియాలో విమర్శలు చేయడం తప్ప, ఫలితాల సాధనకు కలిసొచ్చే రాష్ట్రాలు, పార్టీలతో చేయికలపకపోవడం పెద్ద బలహీనత. ఒకవైపు కరోనా పేదలపై పంజా విసరగా, మరోవైపు వరదలు వారిని నిలువునా ముంచాయి. వీరిని ఆదుకోకుండా బీజేపీ రిక్తహస్తాన్నే చూపించింది. రైతువ్యతిరేక చట్టాలను నిరసిస్తూ తలపెట్టిన భారత్బంద్కు మద్దతిచ్చిన టీఆర్ఎస్, ఢిల్లీలో మాత్రం పల్లెత్తుమాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. ఈ దోరణులే సమస్యల పరిష్కారం పట్ల టీఆర్ఎస్ చిత్తశుద్ధిపై అనుమానాలు రేకిత్తుస్తున్నాయి. పథకాలు, కార్యక్రమాలు ఆర్భాటంగా ప్రకటించడం, అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయనే సంగతిని పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ సర్కారు బాధ్యతారాహిత్యం కాదా? నిరుద్యోగ భృతిని మరిచేపోయారు. రాష్ట్రంలో సుమారు 18లక్షల మంది నిరుద్యోగులుగా నమోదైతే వారిని పూర్తిగా వదిలేశారు. పరిశ్రమల్లో స్థానికులకే 95శాతం ఉద్యోగాల హామీ అటకెక్కింది. సుమారు 10విశ్వవిద్యాలయాలకు వైస్ఛాన్స్లర్లు లేకపోవడం, వాటి పాలన అస్తవ్యస్తం కావడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసీ జరుగుతున్న తప్పులే. వీఆర్వోల పరిస్థితి త్రిశంకు స్వర్గమే. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు పీఆర్సీ ఎప్పుడిస్తారనే సంగతీ అయోమయమే. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై వస్తున్న విమర్శలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై నికరంగా నిలబడి పోరాటం చేయాల్సిన సీఎం కేసీఆర్ తడబడుతున్నారు. అందరిని కలుపుకుని ఉద్యమించాల్సిన తరుణమిది. కానీ, ఆయన వ్యవహారం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కిలా ఉండటం ఆందోళనకరం.