Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 కల్లోలం చెలరేగిన తొలిరోజులలో జీవిత నమూనాలు మారిపోతాయని కొందరు ఊహించారు. ప్రకృతిపైన, ప్రపంచంపైన మన దృక్పథాలు సరికొత్త రూపుదాలుస్తాయని భావించారు. విజ్ఞత, వివేచనతో లోకం సరికొత్తగా ఆవిష్కృతమవుతుందని తలపోశారు. అవన్నీ వట్టిమాటలేనని గత తొమ్మిది నెలల అనుభవం చెబుతున్నది. ఈ ఉపద్రవాన్ని వృథాగా పోనివ్వరాదన్న మార్కెట్ మాంత్రికుల కుతంత్రం లోకానికి వెల్లడయింది. కరోనా సంక్షోభకాలం సైతం లాభసాటి సమయంగా భావించిన బేహారుల కౌటిల్యం ఎంత పాశవికమైనదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మానవాళిని వినియోగదారీ సమూహంగా చూసే వాణిజ్య వ్యూహకర్తల యోచనలు ఇందుకు భిన్నంగా ఉండవు. బూర్జువా ప్రపంచం ప్రతిదాన్నీ మార్కెట్ చేసి సొమ్ము చేసుకోవాలనుకోడం వింత కాదు, దాని స్వభావమే అంత.
కరోనా ఓ కరోనా అంటూ కవిత్వం రాసుకునేవారు, కథలు అల్లేవారు, రచ్చబండ మీద ముచ్చట్లాడేవారు మార్కెట్ల మహాక్రౌర్యాన్ని గురించి అర్థం చేసుకోకపోతే కరోనా రెండో ఉపద్రవమనే, మూడో ఉపద్రవమనే వదంతులనే వార్తలుగా వండి వడ్డిస్తుంది మీడియా. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కోటిమందికిపైగా కరోనా బారిన పడ్డారు. లక్షా 45 వేలమంది మరణించారు. అయితే కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగంతో, అర్థాకలితో అల్లాడుతున్నారు. దారిద్య్రరేఖ దిగువన వున్నవారు, ఎగువ, దిగువ మధ్యతరగతి వారే కాదు, చిన్నచిన్న వ్యాపారస్థులు, చేతివృత్తులవారు కూడా కరోనా ఉత్పాతంతో కల్లోలానికి లోనయ్యారు. వీరికి ఏది భరోసా? ఏది ఆసరా? ఏది భద్రత? తొమ్మిది నెలల అనంతరమూ ఏ ఆశా లేక రుణ వలయాల్లో చిక్కువడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేకులు.
ఈ మహా విపత్కర పరిస్థితిలోనే ఎనిమిది పనిగంటల పనిదినపు హక్కును సంస్కరణల పేరుతో కాలరాసింది కాషాయ ప్రభుత్వం. ఈ దేశంలో అరవై శాతంగా ఉన్న రైతులపై మూడు వ్యవసాయచట్టాలతో విరుచుకుపడింది. ఈ దాడిని సహించలేని రైతులు రాజధాని నగరంలో మూడువారాలుగా ఆందోళన చేస్తున్నా అబద్ధాలతోనే గడిపేస్తున్నది. రైతుల ప్రయోజనాలకే ఈ చట్టాలంటూ సాక్షాత్తూ ప్రధానే అసత్యాలు వల్లించడం కార్పోరేట్ల లాభం కొరకే అన్నది జగమెరిగిన వాస్తవం.
చూస్తుండగానే మరో పదిరోజులలో 2020 గడిచిపోతుంది. కానీ కరోనా అధికారంలో ఉన్నవారికి ఎలాంటి విజ్ఞతని ప్రసాదించలేదని తేలిపోయింది. ప్రజల శ్రమని కొల్లగొట్టి మార్కెట్శక్తులకు దోచిపెట్టే పన్నాగాలతోనే కాలం గడుపుతుందని ధృవపడింది. కరోనా వ్యాక్సిన్ గురించి మాటలెన్నో చెబుతున్నారే తప్ప, మన దేశంలో కరోనా వ్యాప్తి, నివారణ, చికిత్సా పద్ధతులకు సంబంధించిన వాస్తవాలు చెప్పడం లేదు. కరోనా పెరగడానికయినా, తగ్గడానికయినా గల కారణాల్ని సశాస్త్రీయంగా పరిశీలించి, నిజానిజాల్ని నివేదించే పరిశోధనలు ప్రభుత్వం చేపట్టిన దాఖలాల్లేవు. కోటిమందికి పైగా కరోనా బారిన పడిన దేశంలో ఆ వ్యాధి స్థితికి సంబంధించి కచ్చితమైన నిర్థారణలు లేకపోవడం వైచిత్రి.
ఆలోచిస్తే ఇలాంటి అంశాలు అనేకం కనిపిస్తాయి. ప్రజల్ని ఏమార్చి, కల్లబొల్లి మాటలతో కాలాన్ని గడిపేసే ప్రభుత్వ నేతలు ప్రజల పట్ల ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో బోధపడుతుంది. కార్పొరేట్ల సేవలో తరించడమే ధ్యేయమన్నట్టుగా వ్యవహరించే పాలకుల తీరు ప్రశ్నార్థకం. 2020 ముగిసిపోనుండగా విభిన్నరంగాలకు సంబంధించిన విశ్లేషణలు వెలువడుతున్నాయి. కరోనా ముగిసిపోయిందని, కొత్త సంవత్సరం కొంగ్రొత్త ఆశలతో మొదలవుతుందని ఆశించడానికి వీల్లేదు. క్యాలెండర్ మారుతుందే తప్ప జనం బతుకుల్లో మార్పు వస్తుందనే ఆశల్లేవు. చుట్టూ ఏ ఆశా కానరాని ఈ విషాద బీభత్సకాలాన్ని ఇప్పటివరకు కవులు, రచయితలు సరిగ్గా రికార్డు చేయలేదు. తెలుగునాట జూమ్ మీటింగులతో పొద్దు పుచ్చడమే తప్ప ఒక మహా కదలిక కనిపించడం లేదు. నిస్త్రాణమైన ఈ స్థితి సాహిత్య, కళారంగాలలో నెలకొన్న నిస్తేజాన్ని, క్రియారాహిత్యాన్ని సూచిస్తున్నది.
ఏవో కొన్ని పాటలు, ఏదో కొంత కవిత్వం వచ్చిందే తప్ప కవుల, రచయితల, కళాకారుల క్రియాశీలత విరాట్రూపం ధరించి సమాజాన్ని కదిలించిన జాడల్లేవు. మార్కెట్శక్తుల పన్నాగాల్ని అర్థం చేసుకోగలిగే సామాజిక, ఆర్థిక అవగాహన అత్యంత తక్కువస్థాయిలో వుంది. అధ్యయనలోపం, స్పందనా రాహిత్యం, స్వోత్కర్షల పోకడలు సాహిత్య, సాంస్కృతిక రంగాలకు శోభనివ్వవు. ఉద్యమశీలతని ప్రోది చేయవు. సకల రంగాల్ని కదిపి కుదిపే ఈ పెను సంక్షోభాన్ని గురించి సద్వివేచనతో కూడిన ఆలోచనలు వ్యక్తం కావాలి. పాఠకలోకాన్ని ప్రభావితం చేయగల శక్తివంతమైన రచనలు అభివ్యక్తమవ్వాలి. ఎవరి సొదని వారు పుస్తకాలుగా తీసుకువస్తే ఏం ఫాయిదా? సారం, సారాంశం ఉన్న రచనలు వెలుగుచూడాలి. తమ కాలాన్ని సంక్షుభితం చేసిన మహౌపద్రవం పట్ల తాము తగినంతగా చలించామా, స్పందించామా అని సృజనశీలురు యోచించాలి. వివేచనతో ఆత్మావలోకనం చేసుకోవాలి. కరోనా ఉపద్రవాన్ని వృధాగా పోనివ్వకూడదని కుబేరులయిన అంబానీలు, మార్క్జుబెర్గ్లు ఆలోచిస్తుంటే, నిరంతరం ప్రజల గురించి స్వప్నించే సృజనశీలురు మరెంతగా అప్రమత్తం కావాలి. ఎల్లలులేని తిరుగుబాట్లకు, ధిక్కార స్వరాలకు ప్రేరణనిచ్చేవిధంగా అక్షరాలకు పదును పెట్టడం, ఆలోచనల్ని రగిలించడమే వారు బతికిన క్షణాలకు ధన్యత.