Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశుప్రవృత్తి ప్రకోపించిన నేపథ్యంలో లాభాలు దండుకోవడం కార్పొరేట్ల పరమావధి. వారిని ఆ బాట పట్టించడం, అందుకు దారులు పరవడం మోడీ బృందం దిన చర్య. ఒక దశాబ్ద కాలంపైగా ఈ పెద్దమనిషి పాలనను, దాని తీరు తెన్నులను కూలంకషంగా దగ్గరుండి పరిశీలించిన ఇద్దరు గుజరాతీ దిగ్గజాలు సర్టిఫై చేసి 2014లో ఢిల్లీలో ప్రతిష్టించు కున్నదందుకే! కార్మికుల శ్రమశక్తి దోపిడీ తీవ్రతరం చేయడం వల్లనే కార్పొరేట్లకు లాభాలు సాధ్యమని తనమహత్తర గ్రంథం 'క్యాపిటల్' ద్వారా కార్ల్మార్క్స్ తిరుగులేని విధంగా రుజువు చేశారు. పనిగంటలుపెంచడం ఒక పద్ధతైతే, పని తీవ్రత పెంచడం రెండవది. మొదటిది అమలు కావాలంటే పాలకులు పచ్చజెండా ఊపడం తప్పనిసరి. ఈ రెండూ కాకుండా ఆశ్రిత పెట్టుబడిదారులు లాభాల మీద లాభాలు సంపాదించడం, శత, సహస్ర కోటీశ్వరులవడం మోడీపాలన ప్రత్యేకత.
తాజాగా అమెరికన్ బహుళజాతి సంస్థ యాపిల్ సప్లైయర్ తైవాన్కు చెందిన వెస్ట్రాన్ (కర్నాటక) ఘటన చూద్దాం. యాపిల్తో తన కాంట్రాక్టు నిలబెట్టుకోవడానికి మొత్తం తన కార్మికుల్లో 80శాతం పైగా కాంట్రాక్టు కార్మికులతో నింపుకుంది. అప్పుడే దానికి లాభాలొస్తాయి. లాభాల రుచిమరిగిన మ్యానీటర్లు పెట్టుబడిదారులు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచారు. ఆ 12 గంటల్లో అన్నం తినకుండా, చాయినీళ్ళు కూడా తాగకుండా పనిచేసిన వారికి అదనంగా రోజుకి రూ.350లు ఇస్తామన్నారు. దసరా, దీపావళి రోజుల్లో యంత్రంలో యంత్రమై పనిచేస్తే మరో మూడున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు. గత ఆరునెలలుగా జీతాలే సరిగా ఇవ్వడంలేదు. ఇవన్నీ లాభాల రేటు పెంచుకునేందుకేననేది స్పష్టం. ఈ చర్యలు ప్రతి బహుళజాతి సంస్థా చేసేవే. అనేక దేశాల పాలకులు సై అన్నవే!
డిసెంబర్ 12న వెస్ట్రాన్లో విధ్వంసం జరిగింది. సరిగ్గా వారానికి యాపిల్ స్పందించింది. కార్మికుల్ని సరిగా చూసుకునే దాకా వెస్ట్రాన్కి తదుపరి ఆర్డర్లు నిలిపివేస్తామంది. వెస్ట్రాన్ తన వైస్ప్రెసిడెంట్ని తొలగించింది. కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించలేదనే విషయాన్ని అంగీకరించి క్షమాపణలు కోరింది. కార్మికులు ఆ సంస్థ బట్టలూడదీశారు. ''అవును, నిజమే నేను దిశ మొలతో నిలబడ్డమాట వాస్తవమేనని అంగీకరించడం నంగనాచి తనం కాక మరేంటి?! ఈ నంగనాచి కబుర్లు ఇక్కడితో ఆగవు. ఇంతటితో ఆగవు కదా! 2010లో కోయంబత్తూర్లో మరో బహుళాతి సంస్థ ప్రీకాల్లో దాదాపు ఇవే పరిస్థితులు. 2012లో యానాంలో రీజెన్సీ సిరామిక్స్లో యూనియన్లు లేవు. కార్మికుల గోడు వెళ్ళబోసుకునే 'కవాటా''ల్లేవు. ప్రెషర్కుక్కర్ బద్దలైంది. ఒక చోట జనరల్ మేనేజర్, మరోచోట వైస్ప్రెసిడెంట్ హత్యకు గురయ్యారు. వీటికి తలమానికంగా మారుతి సుజికి కర్మాగారం ఘటన. మళ్ళీ హర్యానా, మానేసర్. అంతకు ఒక సంవత్సరం ముందు హౌండా మోటర్ సైకిల్ ఫ్యాక్టరీలో ఇలాగే యూనియన్లను అనుమతించలేదు. పెట్టుబడులను ఆహ్వానించేటప్పుడు మనదేశ చట్టాలను అమలు చేయాలనే షరతు పెట్టలేని వెన్నెముకలేనివారు పాలకులు. కాంట్రాక్టు కార్మికుల యూనిఫారాలేసుకున్న గూండాలు మారుతి ఫ్యాక్టరీలో మారణ హౌమం సృష్టించారు. రెండు వందల మందికి పైగా కార్మికులపై హత్యానేరం మోపి గత నాలుగేండ్లుగా ఊచల్లెక్క పెట్టిస్తున్నారు. చట్టాలున్నప్పుడే అమలు చేయించని పాలకులు ''కార్మికుల గూండాయిజం'' అని నంగనాచి ఏడ్పులు ఏడిస్తే చట్టాలు రద్దయిన తర్వాత కార్మికులకు దిక్కెవరు?
మొన్న అసోచామ్ మీటింగులో భారత ప్రధాని మనసులో మాటల్ని వెళ్ళబోసుకున్నాడు. తన ప్రభుత్వ మెందుకుందో, ఎవరి కోసముందో ఖుల్లాగా చెప్పాడు. 1500 పాత చట్టాలను మార్చి కొత్త చట్టాలు రూపొందించారట! పెట్టుబడిదారుల ధోరణిలో మార్పు తెచ్చారట! దీన్నే''క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ బ్యాగ్'' అంటారు. (అసలు విషయం బయటి కొచ్చిందని అర్థం) వెంటనే పెట్టుబడిదారులు 'వాయినం' తిరిగిచ్చేశారు. రతన్ టాటా ''కరోనా సంక్షోభ సమయంలో దేశాన్ని ముందుండి నడిపిస్తున్నం''దుకు మోడీని ప్రశంసల్లో ముంచెత్తారు. అంటే వలస కూలీల అగచాట్లు, ప్రజలెదుర్కొన్న ఇబ్బందులు పట్టించుకోకుండా కేవలం పెట్టుబడిదారులను మాత్రమే ''కాచుకున్నందు''కా ప్రశంస. ఇటీవల బిజినెస్ స్టాండర్డ్ పత్రిక 2016 నవంబర్ 8న మోడీ టీవీలో ప్రసంగించే సమయానికి పేటీఎం ప్రారంభకుడు విజరుశేఖర్ శర్మ తన సంస్థకు నిధుల సేకరణ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. నోట్ల రద్దు ప్రకటనతో రాత్రికి రాత్రే ఆ సంస్థ తన కష్టమర్లను ఆరుకోట్ల మందిని పెంచుకుందని ప్రకటించాడు. అంటే పెట్టుబడి సేవలో మోడీ సర్కార్ పునీతమవుతున్నదనడానికి ఇటువంటి వందల ఉదాహరణలున్నాయి.
పాలు, నీళ్ళు విడిపోతున్నాయి. తమ వర్గాలకు మద్దతుగా పాలకులు స్వచ్ఛందంగా రంగంలో దిగిపోతున్నారు. రేఖలు గీసేస్తున్నారు. ''రేఖ చెది రితే గొల్లుమని పోతారు. రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు. రేఖను రక్షించ డానికే న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరి కొయ్యలు, రేఖను కాపాడక తీరదు'' అని శ్రీశ్రీ 1937లోనే రాసింది ఎంత సరైందో!