Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''హత్రాస్లో జరిగింది అత్యాచారమే.. అక్కడ పోలీసులది నిర్లక్ష్యమే..'' తాజాగా సీబీఐ విచారణలో నిగ్గుతేలిన నిజమిది. దీనితో ఇప్పటి వరకూ ఖాకీల వాఖ్యలన్నీ దోషుల్ని కాపాడే ప్రయత్నంలో చేసిన అసత్యాలేనని రుజువైంది. అంతేకాదు, ఊరుచుట్టూ కంచెలు కట్టి, బాధితుల్ని బెదిరించీ హింసించడమే గాక, ఘటన పట్ల వెల్లువెత్తిన నిరసనంతా తమను అప్రతిష్టపాలు చేసేందుకేనన్న ఏలినవారి ''కుట్ర'' సిద్ధాంతం గుట్టూ రట్టయ్యింది. మరిప్పుడు ఏలినవారు తలలెక్కడ పెట్టుకుంటారూ? పోలీసులు టోపీలెక్కడ పెట్టుకుంటారు? నెత్తురూ కన్నీరు ఏకమై, బాధితత్వానికి నిలువెత్తు రూపమై న్యాయం కోసం వేడుకున్న ఓ ఆడపిల్లను బూడిద చేయడం ప్రతిష్టా? జరిగిన దారుణాన్నీ, ప్రభుత్వ వైఫల్యాన్నీ లోకం వేలెత్తి చూపితే మాత్రం అప్రతిష్టా? అధికారం అండతో ఇన్నాళ్లూ ఎదురుదాడితో అందరినోళ్లూ మూయించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు సీబీఐ నివేదికకు ఏమని బదులిస్తారు..?
ఆటవిక రాజ్యంలోనైనా కొన్ని నియమాలుంటాయేమో గానీ, యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లో మాత్రం ఏ నియమాలూ ఉండవని నిరూపిస్తోంది ఈ ఘటన. వారి ఏలుబడిలో దళితులకు గౌరవంతో కూడిన జీవితం ఎలాగూ ఉండదు.. సరికదా చివరికి మరణంలో కూడా వారికి కనీస మర్యాద లభించదని తేల్చి చెపుతోంది యూపీలో బీజేపీ పాలన. హత్రాస్లో కులదురహంకారం ఓ అమాయక దళిత యువతిపై లైంగికదాడికి తెగబడటమే కాదు, పైశాచికంగా హింసించి ఆమెను నెత్తురు ముద్దను చేసింది. వెన్నెముక విరిచి, నాలుక కొరికి ఆ అభాగ్యురాలిని చిత్రవధ చేసింది. ఆ స్థితిలోనూ ఆ 19ఏండ్ల పసి ప్రాణం తననీ స్థితికి తెచ్చిన వ్యక్తులను గుర్తించింది. వారిని శిక్షించి ఇలాంటి దారుణం మరే ఆడపిల్లకూ దాపురించకుండా చూడాలని వేడుకుంటూ ప్రాణాలు విడిచింది.
కానీ ఘనతవహించిన యూపీ పోలీసులేం చేశారు. ముక్కలైన ఆమె శరీరాన్ని కన్నవారి కడసారి చూపుకు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి కాటికి చేర్చారు. ఆ చీకట్లోనే చితికి నిప్పంటించి కాల్చి బూడిద చేశారు.వారు ఆనాడు కాల్చి బూడిద చేసింది బాధితురాలి శరీరాన్ని మాత్రమే కాదు, అందుకు కారకులెవరో చెప్పే నిజాలనని నేడు సీబీఐ నివేదిక నిగ్గు తేల్చింది. ఈ నివేదిక పోలీసుల తీరునే కాదు, ఏలికల బండారాన్నీ బద్దలు కొడుతోంది.
అమానవీయమైన ఈ ఘటన పట్ల నాడు పెల్లుబుకుతున్న ప్రజాందోళనలను చూసి ఈ పోలీసులూ, ఏలికలూ ఏమన్నారు? అసలు అత్యాచారమే జరగలేదన్నారు పోలీసులు..! ఇదంతా తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర అన్నారు ఏలినవారు..!! మరి ఇప్పుడేమంటారు..?! కండ్లముందు నిజం నెత్తురోడుతూ నిల్చున్నా.. ఆ నిజాన్ని తొక్కిపట్టి అబద్దాన్నే నెత్తికెత్తుకున్నారు. నిందితులకే వంత పాడారు. బాధితులనే హింసించారు. నేడు సీబీఐ విచారణలో నిజం వెలుగులోకొచ్చింది. సెప్టెంబర్ 14న జొన్నచేనులో ఒంటరిగా ఉన్న తనపై నిందితులు నలుగురూ సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారని పేర్లతో సహా వెల్లడించిన బాధితురాలి మరణవాంగ్మూలం నిజమని తేటతెల్లమయింది. భౌతికదాడి జరిగిందనీ, కానీ అత్యాచారం జరిగిందనడానికి ఏ ఆధారాలూ లభించలేదని చెప్పిన ఫొరెన్సిక్ నివేదికకు వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించకపోవడమే కారణమని కూడా తేలింది. ఘటన జరిగిన ఐదు రోజుల వరకూ ఎఫ్ఐఆరే నమోదు చేయని పోలీసులు.. వైద్య పరీక్షలనూ ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేశారని స్పష్టమైంది. అంతేకాదు, జరిగిన దారుణాన్ని గ్రామస్థులంతా ముక్తకంఠంతో ధృవీకరిస్తున్నారు. మరి ఇందులో కుట్ర ఎవరిదంటే ఏలినవారు ఏం సమాధానమిస్తారు? పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది సీబీఐ. ఏమని బదులిస్తారు?
నిందితులు అగ్రవర్ణాలు గనుక, స్వయాన ముఖ్యమంత్రి కులస్థులుగనుక, భూస్వాములు గనుక ఏం చేసినా చెల్లుతుందని చెపుతారా? అది గుర్తించి లొంగిపోకుండా ఎదురుతిరగడమే బాధితురాలి నేరమని శెలవిస్తారా? వీరి ఘనమైన పాలనలో ఈ దేశంలో ఇదే న్యాయమైతే అసంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలకు భద్రత ఏముంటుంది? ఆడపిల్లలపై ఈ అఘాయిత్యాలు సహజాతాలుగా వ్యవస్థీకృతమైతే ఈ అనాగరిక చర్యలకు అడ్డేముంటుంది? దేశమంతటా పదే పదే పునరా వృతమవుతున్న ఇలాంటి సంఘటనలన్నీ లేవనెత్తుతున్న ప్రశ్నలివి. కాగా 'హత్రాస్' సాక్షిగా సీబీఐ నివేదిక లేవనెత్తే ప్రశ్న ఒక్కటే.. ఈ ఏలికలు ఎవరి పక్షం? బాధితుల పక్షమా? నిందితుల పక్షమా?