Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దేశంలోని పేదలకు ఎంతో కొంత ఉపయోగకరమైంది. ఆ చట్టం లక్ష్యం వ్యవసాయపనులు లేని సమయంలో గ్రామీణ పేదల ఉపాధికి ఉపయోగపడటం. వామపక్షాల చొరవతో యూపీఏ-1 ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం అమలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో నిర్వీర్యమవుతున్నది. చట్టం లక్ష్యాలను దెబ్బతీస్తూ పేదల నోటికాడి కూడును దూరం చేసే ప్రయత్నాలకు మోడీ సర్కారు తెరలేపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో నిరుపేదల కొరకు 2005లో తీసుకొచ్చిన ఉపాధి హామీ ప్రస్తుతం నీరుగారిపోతున్నది. ఎడారిలో ఒయాసిస్సులా ఉన్న ఈ పథకం, ఏటేటా నిధుల కుదింపు, రాష్ట్రాల అలక్ష్యం మూలంగా వట్టిపోతున్నది. సాధారణంగా కేంద్రం తన బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతియేటా కనీసం 10 శాతం నిధులు ఉపాధి హామీకి ఇవ్వాలనే నిబంధన చట్టంలోనే ఉంది. రాష్ట్రాలు సైతం మ్యాచింగ్ గ్రాంట్ కింద నిధులు సమకూర్చాల్సిందే. మోడీ సర్కార్ వచ్చాక ఉపాధి హామీకి తూట్లు పొడుస్తూ పేదల పొట్టకొడుతున్నది. అధికంగా నిధులు ఇచ్చే సంగతి పక్కనబెడితే, పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో గ్రామీణ పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ పోని పరిస్థితి. ఇటీవల రాష్ట్ర పరిణామాలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. పేదలకు ఉపయోగపడే ఉపాధిహామీకి ఒకవైపు బీజేపీ ప్రభుత్వం నిధులు తగ్గిస్తే, మరోవైపు కరోనా కాటేసింది. ఉపాధి పనుల కోసం నగరాలు, పట్టణాలకు వలసపోయిన జనం, కరోనా వైరస్ కారణంగా పల్లెలకు తిరుగుముఖం పట్టడం మీడియాలో కండ్లకు కట్టిందీ విదితమే. ఈ కాలంలో దేశంలో వ్యవసాయ కార్మికులు 11 కోట్ల నుంచి 13 కోట్లకు పెరగడం గమనార్హం. రాష్ట్రంలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు బిల్లులు ఇవ్వకుండా కేంద్రం పెండింగ్లో పెట్టింది. ఇందుకు ఇటీవల రాష్ట్రం, కేంద్రానికి రాసిన లేఖే సాక్ష్యం. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ, ఆయా ఆర్థిక సంఘాల నిధులు రూ.4571 కోట్లతోపాటు ఉపాధి హామీకీ నిధులు విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాదికి రాష్ట్రానికి రూ.1719.25 కోట్లకుగాను రూ.694.66 కోట్లు మాత్రమే విదిల్చడం పేదల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పుట్టెడు కష్టాల్లో ఉన్న సామాన్యులకు అదనంగా నిధులిచ్చి ఆదుకోవాల్సింది పోయి, న్యాయంగా రావాల్సిన వాటాల్లోనూ కోతలు పెట్టడం, జాప్యం చేయడం, నిలిపేయడం అన్యాయం చేయడమే. ఈ తరహాలోనే దాదాపు రూ.1024.55 కోట్లు ఉపాధి హామీ బకాయిలను తొక్కిపట్టింది. ఈ విషయం కేసీఆర్ సర్కారుకూ తెలుసు. అయినా ఈ రెండు ప్రభుత్వాలు ముసుగులో గుద్దులాట కొనసాగిస్తున్నాయి. తద్వారా పేదలను సమిధలను చేస్తున్నాయి. ఇదిలావుంటే, రాష్ట్రంలో ఈ ఏడాదికిగాను 29.87 లక్షల కుటుంబాల్లోని 51.87 లక్షల మందికి ఉపాధి హామీ కింద పనులు కల్పించారు. దాదాపు 13.75 కోట్ల పనిదినాలకుగాను 13.37 కోట్ల పనిదినాలను ఇచ్చారు. ఈ మేరకు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు రాష్ట్రం చెప్పుకుంటున్నది. కానీ, కేంద్రం నుంచి నిధుల సాధనలో గులాబీ సర్కారు విఫలమైంది. నిరుపేద కూలీలు ఇబ్బందులు పడుతున్నా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం క్షమార్హం కాదు. గత మార్చి నుంచి ఉన్న కాస్త ఉపాధిని కోల్పోయి పొట్టచేతపట్టుకుని దిక్కులు చూస్తుంటే ఆపన్నహస్తం అందించాల్సింది పోయి, అసలుకే ఎసరుపెట్టడం క్షంతవ్యం కాదు. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరగాలనే డిమాండ్ ముందుకొచ్చింది. కాగా, మనదేశంలో బీజేపీ, తన విధానాలు, నిర్ణయాల ద్వారా వాటిని మరింత పడగొట్టింది. ఇందుకు 2019-20లో కేంద్రం ఉపాధి హామీ కోసం రూ.71 వేల కోట్లు కేటాయించి, 2020-21కి వచ్చేసరికి రూ.60 వేల కోట్లకు తగ్గించడమే నిదర్శనం. ఆత్మనిర్భర్ అభియాన్ కింద అదనంగా రూ.40 వేల కోట్లు ఇస్తామని ఊదరగొట్టిన మోడీ, ఆచరణలో చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 10శాతానికీ కోత పెడుతూ 4శాతానికి కుదించారు. కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో మరోరకంగా కనిపిస్తున్నది. అసలు బీజేపీ ప్రభుత్వం నిధులను తగ్గించడం, జాప్యం చేయగా, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఆ నిధులను నేరుగా ఉపాధి పనులకు ఖర్చు చేయకుండా, ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో సమస్య మరింత జఠిలమైంది. అవసరమైన మేరకు పనులు కల్పించడం ద్వారా పనిదినాలను పెంచకుండా, చేసిన పనులకు యూసీలను కేంద్రానికి పంపకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఉపాధి కూలీల పరిస్థితి ఘోరంగా తయారైంది. రెండేండ్లుగా దాదాపు రూ.2 వేల కోట్ల మేర ఉపాధి హామీ రొక్కాన్ని ఇవ్వకుండా కేంద్రం ఆపేసిందనే విమర్శలున్నాయి. పేదలకు విస్త్రృతంగా పనులు ఇవ్వడం ద్వారా కొనుగోలు శక్తి పెంచడం, ప్రతి కూలీకి ఏడాదికి 200 రోజుల పని కల్పించడం, దినసరి కూలి రేటును రూ. 600కు పెంచాలనే డిమాండ్లు ఇప్పటికే ఉన్నాయి. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సింది పోయి, ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీపై పోరాటం ద్వారానే పేదలకు న్యాయం చేయడం, నిధులను సాధించడం సాధ్యం.