Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూకేలో రూపం మార్చుకున్న కరోనా వైరస్ స్ట్రెయిన్ ఈ రోజు ప్రపంచ ప్రజలను మళ్ళీ భయబ్రాంతులకు గురిచేస్తున్నది. ఎప్పుడో సెప్టెంబర్లోనే అక్కడ మ్యుటేషన్ పొందిన కరోనా ఇప్పుడు దాని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ విస్తరిస్తున్నది. ప్రపంచ వ్యాప్తతంగానే కరోనా వైరస్ ప్రభావం నుంచి సాధారణజీవనంలోకి అడుగుపెడుతున్న ప్రజలకు ఈ స్ట్రెయిన్ హెచ్చరికలు చేస్తోంది. బ్రిటన్లో తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో తిరిగి విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అందుకని అక్కడ మరోసారి లాక్డౌన్ ప్రకటించారు. క్రిస్మస్ వేడుకలను కూడా కట్టడిచేశారు. విమాన సర్వీసులూ రద్దుచేశారు.
ఈ సందర్భంలో బ్రిటన్ నుంచి భారత్కు పన్నెండు వందల మంది వచ్చారు. వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించే పనిని ప్రభుత్వం చేపట్టింది. మనహైదరాబాద్కు కూడా పాజిటీవ్ కేసులు దిగుమతి అయ్యాయి. అవి స్ట్రెయిన్ కేసులేనా కాదా అనేది తేలాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా కరోనాకు వాక్సిన్ తయారై అందరికీ అందించటానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇదో కొత్త బాంబు పేలింది. వాక్సిన్ వస్తోందన్న సంతోషాన్ని, కరోనాను ఎదుర్కొంటామన్న ధైర్యాన్ని ఈ స్ట్రెయిన్ కబళించివేసింది. కొత్తగా విస్తరిస్తోన్న కరోన పాతదానికంటే డెబ్బయిశాతం ఎక్కువ విస్తరణ సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు యూఎన్ఓ చెబుతోంది. అయితే కోవిడ్-19 కన్నా ఇది ప్రమాదకరమైన వైరస్ అని, దీంతో మరణాల రేటు పెరుగుతుందని ఇంకా నిర్థారణ కాలేదు. పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యూకే మాత్రం కొత్త వైరస్ విస్తరణతో యుద్ధం చేస్తూనే ఉంది.
ఇక అసలు విషయమేమంటే.. ప్రకృతిలో ఉన్న ప్రతి జన్యువూ మార్పులకు గురవుతూనే ఉంటుంది. ఈ వైరస్ మ్యుటేషన్ కూడా అందులో భాగమే. ఈ మ్యుటేషన్ అనేది పరిణామ క్రమంలో సాధారణమైన అంశం. ఈ మ్యుటేషన్ రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి పర్యావరణంలో కలిగే మార్పుల వల్ల, రెండోది పునరుత్పత్తి క్రమంలో. వాతావరణంలో మార్పులు నూక్లియర్ రేడియేషన్ వల్ల అతినీలలోహిత కిరణాలు జీవజాలంపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమిదే. ఈ పరిణామాలు జీవావరణంపై కలుగచేస్తున్న ఫలితమే ప్రాణాంతక కరోనా.
ఐక్యరాజ్యసమితి తన యూఎన్డీపీ నివేదికలో ముందుగానే కోవిడ్-19 తరువాత వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంగానే తెలిపింది. శాస్త్రవిజ్ఞానం కూడా కరోనా ఒక ఉదాహరణ మాత్రమేనని, రాబోయే కాలంలో ఇలాంటివి చాలా వస్తాయని చెపుతోంది. ఈ విపత్తులు, సంక్షోభాలు సాధారణ మవుతున్నప్పుడు, వీటిని ఎదుర్కోవడానికి మనం, మన ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? అనేది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. నివేదికలో ఇంకా ఏముందంటే జీవావరణ విధ్వంసమే విపత్తులకు కారణమని తేల్చి చెప్పింది.
మనిషి తన ఆవరణంతో ప్రవర్తిస్తున్న తీరు, జంతువులతో వ్యవహరించే తీరులో వచ్చిన మార్పులు ప్రమాదాలను ఎగదోసాయి. జంతువులను చంపి వాటి మాంసాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్, అంతర్జాతీయ లాభాల మార్కెట్గా మార్చిన తరువాత, ఆ మాంసం కోసం లక్షలాది జంతువులను అసహజమైన, కృత్రిమమైన రీతిలో ఒకేచోట పెంచటం మూలాన సహజ జీవాభివృద్ధి సంక్షోభంలో పడింది. అదుకనే మెక్సికన్ నవలాకారుడు తన నవలలో పందుల పెంపకాన్ని, వాటిని చంపటాన్ని వర్ణిస్తూ... 'ఇక్కడ పందుల అరుపులు తప్ప ప్రతి ఒక్కటీ వ్యాపారమే' అని పేర్కొంటాడు. నిత్యం ఆ జంతువులను మూకుమ్మడిగా చంపుతున్నప్పుడు అవి అరిచే తీరును భయంకరంగా వివరిస్తాడు. అప్పుడు అక్కడి వ్యాపారులు అవి అరవకుండా ఎలా చంపాలో తెలుసుకుని అమలు చేస్తారు.
ఈ విషయాలను వివరించటమెందుకంటే మన జీవన పద్ధతులు, వ్యాపార మౌలిక స్వభావాలు, మార్కెట్ లాభాలు మొదలైన వ్యవహారాలతో పాటు ఉత్పత్తి, పంపిణీ విధానాలు ఇప్పటికైనా మారకపోతే నిత్యం ఇక ఇలాంటి విపత్తులే ఎదురవుతాయనేది అతిశయోక్తి కాదు. అక్షర సత్యం. ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచించకుండా వ్యాక్సిన్లు, మందులు మాత్రమే పరిష్కారంగా కనిపెడుతూపోతే ప్రతి మాసానికొక కొత్త వాక్సిన్ అవసరమవుతుంది.
కానీ, మన ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ల కోసం మార్చివేస్తున్న సందర్భంలో..ఆ కార్పొరేట్లు వ్యాపారుల సరళికి భిన్నంగా ప్రజానుకూల, పర్యావరణ రక్షణ చర్యలను చేపడుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కొత్త విపత్తులు ముంచుకొస్తున్న వేళ కూడా ప్రజల రక్షణ కోసం పరితపించడం మాని, సామాన్య రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో మునిగిపోయిందీ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ ఆపదలపై దృష్టిపెట్టి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుందాం.