Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్యా శుల్కంలో ''డాన్సింగ్ గర్ల్'' మధురవాణికి ''పార్టింగ్ విజిట్'' కోసం గిరీశం తపనపడే సందర్భం కూడా ఆమె నుంచి విడిపోతున్నప్పుడేనన్న సత్యం మనకెరుకే! ఆప్తులు విడిపోతున్న సందర్భంలో ఈ ''పార్టింగ్'' అనేది రెండువందల సంవత్సరాల ఇంగ్లీషోడి పాలనలో మగ్గిన ఫలితంగా దక్కిన మాట!
''హౌడీ మోడీ'', ''నమస్తే ట్రంప్'' అనే తిరణాల కోసం వేల కోట్లు (రూపాయలు/డాలర్లు) ఖర్చు చేసినా ఇండియన్ అమెరికన్ల ఓట్లు ట్రంప్ బుట్టలో పెద్దగా రాలలేదు. అయినా పోతూ పోతూ ''లిజియన్ ఆఫ్ మెరిట్'' చీఫ్ కమాండర్ స్థాయి పురస్కారం మోడీ సాబ్ను వరించింది. గత 30/35 సంవత్సరాల నుంచి ఏ అధ్యక్షుడూ ఏ దేశాధినేతకూ (నేటి ట్రంప్లా) ఈ పురస్కారమియ్యలే! ఇది అమెరికా మిలటరీ హెడ్ కార్వర్టర్స్ పెంటగన్ ఇచ్చే పురస్కారం. సాధారణంగా సైనికాధికారులకు ఇస్తూంటారు. 1949లో మనదేశానికి చెందిన నాటి ఫీల్డ్ మార్షల్ జనరల్ కె.ఎమ్. కరియప్పకు అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారిట్రూమాన్ ఇచ్చారు. ''భక్తులు'' మైమరిచి ఆలపిస్తున్న బృందగానంలో గాని, గోడీ మీడియా ఆలాపనల్లోగాని, జె.సి.నడ్డా వంటి గణాచార్యుల కీర్తనల్లోగాని కనపడే కామన్ అంశమేమంటే ఇది ''మోడీ దార్శనికతకు, ప్రపంచశాంతి కోసం ఆయన చేస్తున్న కృషి''కి అందిన పురస్కారమట!
''బొంకరా! మంకెన్నా అంటే మా వూరి మిరియాలు తాటికాయలంత ఉన్నా''యన్నాడట వెనకటి కెవరో! ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిసిన తర్వాత, అమెరికానే సర్వంసహాధికారిగా వెలిసిన తర్వాత, అమెరికా ప్రయోజనాలే ప్రపంచ ప్రయోజనాలుగా చెలామణిలోకి వచ్చిన తర్వాత, అమెరికా ఊడిగానికి మనదేశాన్ని దిగజార్చేందుకు వెంపర్లాడుతున్నది మోడీ బృందం. ఈ దశలో ''లిజియన్ ఆఫ్ మెరిట్''ను పరిశీలించాలి. ఇది మోడీ ఒక్కడికే దక్కిన పురస్కారం కాదు. ఆస్టేలియా, జపాన్ ప్రధానులు స్కాట్ మోరిసన్, షింజో అబెలకు కూడా ''లిజియన్ ఆఫ్ మెరిట్'' అవార్డు దక్కింది. కారణం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన నాలుగు దేశాల కూటమి 'క్వాడ్'లో ఇవన్నీ సభ్యదేశాలు. భాగస్వాములు. భారత ప్రధాని ''దార్శనికత''కే అమెరికా మెచ్చి మేకతోలు కప్పిందని 'భక్తులు' పారవశ్యంతో చేసే పలవరింపులు భ్రమలు వెదజల్లేందుకే! చైనాతో సుమారు నాలుగువేల కి.మీ.కు పైగా సరిహద్దు గల భారతదేశాన్ని మించిన ''మొనగాడు'' అమెరికాకు ఇంకెక్కడ దొరుకుతారు? ప్రపంచంలో అమెరికా ఒక్కటే సూపర్ పవర్గా వెలుగొందాలనేది దాని ఆకాంక్ష. చైనా క్రమంగా ఆర్థిక శక్తిగా పెరగడం దానికి మింగుడు పడటం లేదు. అందుకు పన్నిన ఉచ్చు 'క్వాడ్', దాన్లో మనదేశం ఒక ప్రధాన పాత్రధారి. ఈ పురస్కారం వెనక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు రక్షించుకునే మరో చమత్కారం కూడా ఉంది. 2008లో అమెరికాతో మనదేశం అణుఒప్పందం చేసుకున్నప్పటి నుంచి వామపక్షాలు, ముఖ్యంగా సీపీఐ(ఎం) హెచ్చరిస్తున్న అంశమేమంటే మనదేశం అమెరికా ''డంపింగ్ గ్రౌండ్''గా మారుతుందని! అంటే కేవలం అణు ఒప్పందానికి సంబంధించిన వెస్టింగ్ హౌస్ కార్పొరేషన్, జి.ఇ. వంటి సంస్థలే గాక వారి వ్యవసాయ ఉత్పత్తులూ, డైరీ, పౌల్ట్రీ ఉత్పత్తులూ మనదేశంలో వెల్లువెత్తుతాయని నెత్తినోరూ కొట్టుకుని మొత్తుకున్నాయి వామపక్షాలు. నేడదే నిజమై సాక్షాత్కరిస్తోంది. దాని ఫలితమే స్వాతంత్య్రానంతరం అతిపెద్ద ప్రజావెల్లువ నేడు ఢిల్లీని 'ఘెరావ్' చేస్తున్న విషయం కండ్లకు కడుతోంది.
'రద్దు' తప్ప ఏదైనా కోరండని మోడీ సర్కార్, రద్దే తప్ప మరేదీ అవసరం లేదని 'మహౌద్యమం' డిమాండ్ చేయడంతో పీట ముడిపడింది. రైతు ఉద్యమం వెనుక ''రాజకీయాలు''న్నాయంటాడు మోడీసాబ్. తమ ఉద్యమంలోకి రాజకీయ నాయకులను 'నిషేధించామ'ని రైతులు తెగేసి చెప్పినా ప్రభుత్వ ధోరణి మారట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతు చట్టాలతో ముందుకు సాగాలని మోడీ సర్కార్ ప్రయత్నం. ఏమైనా వీటి రద్దు సాధించాల్సిందేనని ముఖ్యంగా మండీల వల్ల ప్రయోజనం పొందిన ''హరిత విప్లవ'' రాష్ట్రాలు, ప్రాంతాల రైతాంగం బిర్రుగా నిలబడ్డారు. నిన్నటి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ రైతులు పూర్తిస్థాయి ఉద్యమంలో దూకాల్సిన పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదట! కొనుగోళ్ళు అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదట! మొన్నటి భారత్ బంద్లో తమ కార్యకర్తలు పూర్తిస్థాయిలో పాల్గొన్న విషయం పక్కనబెట్టి రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నేడు కేసీఆర్ చేతులెత్తేయడం కసాయి చట్టాలకు రైతులను బలి చేయడమే. పైగా కేంద్ర చట్టాలు అందుకు అనుమతిస్తున్నాయట! దీనికి వ్యతిరేకంగానే కదా భారత్బంద్ జరిగంది. తమ అనుయాయులందర్నీ పాల్గొనమని ఆర్డరేసిన సంగతి కారు సారు యాద్మరిచినట్టుంది. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరట! అంటే ఐ.కె.పి. కేంద్రాలు మూతబడి అక్కడ పనిచేసే గ్రామీణ హమాలీలూ ఉపాధి కోల్పోతారన్నమాట! కీలకాంశం రైతుల్ని కార్పొరేట్ గద్దలకి, రాబందులకు ఎరగా వేస్తున్న మోడీకే వంతపాడుతున్నారు కేసీఆర్..!