Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ పొద్దున్నే లేచాక వార్తాపత్రికలు చదివే అలవాటు క్రమంగా కనుమరుగవుతున్నది. పక్క మీంచి లేవగానే మొబైల్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. వాట్సాప్లోకి తల దూరుస్తున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మొబైల్ని తాకడం అలవాటయింది ఈతరానికి. పొద్దుటే ఎవరి ముఖం చూసామో అనేవారు ఇదివరలో. ఇపుడు ఎవరి ముఖమూ చూడటం లేదు. కాలకృత్యాలు ముగిశాక టీనో, కాఫీనో సేవిస్తూ పేపర్ తిరగేయడమనే అలవాటూ అంతరించి పోతున్నది. ఒకచేతిలో టీకప్పు, మరో చేతిలో స్మార్ట్ఫోను ఉండటం సాధారణ దృశ్యమైంది. కోవిడ్-19 కల్లోలం మొదలయినప్పట్నించి ఇంటికి పేపర్ తెప్పించుకోడం మానేసారు చాలామంది. దినపత్రికలు వచ్చినప్పటికీ నలభయ్యేండ్లు పైబడిన వారు మాత్రమే తిరగేసేవారు. ఇపుడు వారు కూడా పత్రికలకు దూరమై మొబైల్లోకి చూపులు సారిస్తున్నారు.
చదువుకొని ఉద్యోగాలు చేసే యువత పొద్దుటే పేపర్ చదివే అలవాటును కోల్పోయింది. ఏదైనా సంచలనవార్త గురించి వింటే మరిన్ని వివరాల కోసం మొబైల్లోని న్యూస్ వెబ్సైట్లని చూస్తున్నారు. ఇతరేతర వృత్తుల వారు అవసరమైన వార్తల కోసం యూట్యూబ్ చానల్స్ని పరికిస్తున్నారు. ఈక్రమాన వార్తాపత్రికలు చదివే అలవాటు ఇటీవలి నెలల్లో బాగా తగ్గింది. మన జీవన విధానంలోంచి పొద్దుటే దినపత్రిక చూసే అలవాటు అదృశ్యమవుతోంది. ఇక వార్తా కథనాలు, విశ్లేషణలు, సంపాదకీయ వ్యాఖ్యలు, సంపాదకీయపేజీలలోని వ్యాసాలు ఏ కొద్దిమందికో పరిమితమైన వ్యవహారంగా పరిణమించడం సరికొత్త వాస్తవికత. వార్తల్ని న్యూస్చానెళ్ళలో, వెబ్సైట్లలో, యూట్యూబ్ చానల్స్లో, వాట్సాప్ కథనాలలో చూస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అంతిమంగా అచ్చు పత్రికలు చదివే అలవాట్ల క్షీణతకు దారితీయడం గమనార్హం.
చదివే అలవాటు తగ్గడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించడం లేదు. పత్రికలే చదవనివారు పుస్తకాలూ చదవరు. తమకు ఇష్టమైన రంగానికి సంబంధించిన పుస్తకాలు సైతం చూడరు. ఇండ్లలో పెద్దలకే చదివే అలవాటు లేకపోతే పిల్లలూ చదవరు. పత్రిక ఒకటి ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు ఏదో ఓ సమయంలో చదువుతారు. కానీ పత్రికలని తెప్పించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆందోళనకరం. అక్షరాస్యత పెరుగుతున్నది. ఇందుకు తగ్గట్టుగా పత్రికలు చదివేవారి సంఖ్య పెరగాలి. అలా జరగడం లేదు. ఏ కొద్దిమందో తప్ప వార్తల పట్ల ఆసక్తి కనబరిచే వారు అరుదయ్యారు. ఇంటికి దినపత్రిక తెప్పించుకోడం ఒకప్పుడు సామాజిక హౌదా. తర్వాత అది అలవాటుగా మారింది. ఆ మధ్యన కరోనా భయంతో పత్రికల్ని ముట్టుకోడం మానేసారు. దాంతో పత్రిక ముఖం చూసేవారు తగ్గారు. ఇదివరలో ప్రయాణాల్లో పత్రికని కొని తీసుకెళ్ళేవారు. ఇవాళ బస్సుల్లో, రైళ్ళల్లో ఎవరి సెల్కు వాళ్ళు కళ్ళప్పగిస్తున్నారు.
కరోనా ప్రబలిన దరిమిలా అసలు ప్రయాణాల్లో పత్రికలే కనిపించడం లేదు. మన అభివృద్ధి గమనాలు మన అభిరుచుల స్థాయిని పెంచాలి. సాంకేతిక పురోగతి జ్ఞాన దాహాన్ని ఇనుమడింపజేయాలి. తెలుసుకోవాలన్న జిజ్ఞాసని ప్రోది చేయాలి. ఇందుకు భిన్నంగా స్మార్ట్ఫోను ఒక్కటి ఉంటే చాలు అనుకునే రీతి మన జీవనగతిని ఎటువైపు తీసుకెళుతుందో యోచించాలి. వాట్సాప్లో వచ్చే అబద్ధాల బురదనే నెత్తికి ఎక్కించుకొనే దుస్థితి మెదళ్ళను మొద్దుబారుస్తున్నది. నిజాలేవో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నిరాధార వార్తలు, వదంతులు, పుకార్లే నిజమని నమ్మే తరంలో ఏ చలనం ఉంటుంది? ఏ చైతన్యం పాదుకుంటుంది? సత్యానికి మరో పార్శ్వం వుంటుందనే దృష్టి లేకపోవడం కనీస అధ్యయనం లేని ఫలితం.
నిజానికి ఈ కరోనా కాలంలోనే పత్రికలు చదివే అలవాటు పెరగాలి. పిల్లలు, పెద్దలు ఇంట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఓ అరగంటయినా వార్తాపత్రికలు చదివితే లోకం పోకడ తెలుస్తుంది. చదివే అలవాట్లు కొనసాగుతాయి. పత్రికలు చదవడానికి గ్రంథాలయాలకు వెళ్ళేవారి సంఖ్య సైతం తగ్గింది. ఈ నేపథ్యంలో ఇండ్లకు పత్రికలు తెప్పించుకోడం అవసరం. ''పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యంబు'' అన్నారు పెద్దలు. ఈ మాటేమో గానీ అనేక యోచనలు, ఆలోచనలు నెలకొంటాయి పత్రికలు చదివితే. ''వార్త యందు జగము వర్థిల్లుచున్నది'' అన్న మాటలోని అంతరార్థమూ, సారాంశమూ బోధపడుతుంది.
పత్రికల్లో వచ్చేవన్నీ నిజాలేనా అని ఎవరయినా ప్రశ్నించవచ్చు. కొన్నిసార్లు అబద్ధాలు, వక్రీకరణలు, అసమ ప్రాధాన్యాలు ఉండొచ్చుగానీ నిజాలూ ఉంటాయి. నిజానిజాలు నాలుగు పత్రికలు చదివి తెలుసుకొని బేరీజు వేసుకోవచ్చు. అసలు సమాచారమే లేకుంటే స్మార్ట్ఫోన్లలో వండివార్చే అబద్ధాలే వార్తలనుకునే ప్రమాదముంది. అందుకని పత్రికలు చదవడం దైనందిన జీవనశైలిలో అంతర్భాగం కావాలి. ఏ పత్రిక ఎవరి పక్షమో తెలుస్తూనే ఉంటుంది. తాము ఏ పక్షం ఉండాలో, ఏ చైతన్యంతో మసలుకోవాలో పత్రికలు చదువుతుంటే అర్థమవుతుంది. అబద్ధాలకు అలవాటు పడిన ప్రచార సాధనాల్ని దూరం పెడుతూ నిజాల మీద నిలబడిన పత్రికలని అక్కున చేర్చుకోడం వీలవుతుంది. నిజాల వెనుక దాగిన అసలు సత్యాలు, నిగూఢ వాస్తవాలు తెలుస్తాయి. తద్వారా తమ గమనాగమనాల్ని నిర్దేశించుకుంటూ సరికొత్త జీవనరీతిని సంతరించుకోడం సాధ్యం.