Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశంలో సగం... అవనిలో సగం.... అయినా అడుగడుగునా అవమానలే ఆమెకు బహుమానాలు. దారిపొడవునా దాడులు దౌర్జన్యాలే ఆమెకు సత్కారాలు. జాతీయ మహిళా కమిషన్ తాజా నివేదిక మరోసారి రుజువు చేస్తున్న సత్యమిది. ''బేటీ బచావో'', ''బేటీ పడావో''లు కేవలం ఏలినవారి నినాదాలు మాత్రమే కాగా... ఈ దేశంలో కనీస రక్షణ కరువైన మహిళ ఓ భౌతిక వాస్తవం. నిన్నటి ఢిల్లీ నిర్భయ ఘటన నుంచి నేటి హత్రాస్ సంఘటన వరకు ఇందుకు సాక్షాలు. అందుకే వర్తమాన భారతంలో మహిళ జీవితాన్ని వివరిస్తూ ''నడిచే గాయమా.. నారీ లోకమా'' అంటాడు అమరజీవి' ప్రజాకవి రాళ్లబండి నర్సింహరాజు. ఎప్పుడో ఇరవై ఏండ్ల క్రితం రాసిన ఈ పాటకు నేటికీ ఎంతటి ప్రాసంగికత ఉందో జాతీయ మహిళా కమిషన్(సీడబ్ల్యూసీ) తాజా నివేదిక వెల్లడిస్తున్నది. 2020లో మహిళలపై నేరపూరిత చర్యలను వివరిస్తూ సీడబ్ల్యూసీ విడుదల చేసిన ఈ నివేదిక నేటి ఆధునిక యుగంలోనూ మారని అతివల బతుకులకు అద్దం పడుతున్నది
దేశవ్యాప్తంగా మహిళల సమ స్యలైన లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, గృహహింస, సైబర్ క్రైంలపై న్యాయపరమైన రక్షణ కోరూతూ గత ఆరేండ్లలో ఎప్పుడూ లేనన్ని ఫిర్యాదులు అందాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. 2014లో అత్యధికంగా 33906 ఫిర్యాదులు రాగా.. ఆ తర్వాత తగ్గినా తిరిగి ఈ ఏడాది పెరిగి 23,772 ఫిర్యాదులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి పెరుగుతున్న ఆరాచకాలకు ఓ సంకేతం మాత్రమే. పరువు ప్రతిష్టలు, కుటుంబ గౌరవం, కట్టుబాట్ల పేర వెలుగులోకి రాని ఘటనలెన్నో... గతంలో వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉండగా, ఈసారి అందుకు భిన్నంగా తమకు గౌరవ ప్రదమైన జీవితాన్ని కోరుతూ ఫిర్యాదులందడం చర్చనీయాంశంగా మారింది.
నిజమే కదా... నెలంతా ఉద్యోగం చేసినా ఆ జీతం డబ్బుల మీద ఆమెకు హక్కు లేదు. అంతెందుకు అత్యంత ఆధునిక సమాజమని చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా ఆమె దేహం మీదే ఆమెకు హక్కు లేదు. ఇంటా బయటా ఆమె శరీరం మీద హింస సాగుతూనే ఉంది. పుట్టుక నుంచీ ఆమె వివక్షకు గురవుతూనే ఉంది. కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలియగానే పిండంగానే ఆమె హత్యచేయ బడుతోంది. ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం, తాగొచ్చి అకారణంగా కొట్టడం, తిట్టడం, మగపిల్లల్ని ఒకరకంగా ఆడపిల్లల్ని ఒకరకంగా పెంచడం నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆడదిగా పుట్టినందుకు ఆమె మనిషిగా కనీస గౌరవానికి నోచుకోవడంలేదు. ఇదే కదా నేటి ఆధునిక సమాజ యవనికపై మహిళ ముఖచిత్రం. 21వ శతాబ్దంలో కూడా ఆమె రెండో తరగతి పౌరురాలే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఆర్థిక, సామాజిక భద్రత కొరవడటంతో పాటు అవమానాలు, వేధింపుల మధ్య నిత్యం విపరీతమైన ఒత్తిడితో సహజీవనం చేస్తున్న మహిళకు... సమాజం సంగతి అటుంచితే కనీసం కుటుంబం నుంచి కూడా మద్దతు లభించడం లేదని వెల్లడిస్తున్న సీడబ్ల్యూసీ నివేదిక కలవరపాటుకు గురిచేస్తున్నది. ప్రత్యేకించి నేటి కరోనా కాలంలో ఈ ఒత్తిడి మరింత పెరిగింది. ఈ కాలంలో తలెత్తిన ఆర్థిక సామాజిక సంక్షోభాల నేపథ్యంలో పురుషులు తమ అశక్తతను మహిళల మీదే ప్రదర్శిస్తుండం ఇందుకు కారణంగా సీడబ్ల్యూసీ పేర్కొనడం గమనార్హం. సమాజంలో తలెత్తే ఏ సంక్షోభానికైనా మొదట బలయ్యేది మహిళలే అనడానికి ఇదొక ఉదాహరణ.
అందిన ఫిర్యాదులలో అత్యధిక భాగం ఉత్తరాది రాష్ట్రాలవే కావడం, అందునా ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువగా రావడం అక్కడి పాలనా వైఫల్యాలనూ సూచిస్తోంది. అతివలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకుంటున్న కాలంలోనూ ఈ పరిస్థితులు మారకపోవడం అవాంఛనీయం. ఇలా ఎంతకాలం..? పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తరిస్తోన్న ఇంటర్నెట్ సంస్కృతి తోడు, ఏ నియంత్రణా లేని సామాజిక మాధ్యమాల తీరు మరిన్ని విపరీతాలకు దారితీస్తోంది. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రవేశించిన విషసంస్కృతి.. సినిమాల్లో, టీవీల్లో మహిళను మనిషిగా కాక ఓ విలాస వస్తువుగా, మార్కెట్ సరుకుగా చూపిస్తుంటే ఈ అఘాయిత్యాలను అరికట్టగలమా? ఈ వైపరీత్యాలకు తోడు ఏలినవారి పితృస్వామ్య భావజాలం వేయితలల విషనాగై బుసలు కొడుతుంటే... భయాన్ని కాళ్ళకు తొడుక్కుని నడుస్తున్న ఆమెకు భరోసానిచ్చేదెవరు? కన్నీటి ధారలను యెదనిండా దాచుకున్న ఆ మాతృమూర్తికి మార్పును చూపేదెవరు...?