Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించరాదంటూ బ్రిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది. వికీలిక్స్ వ్యవస్థాపకుడు అయిన అసాంజే ఎనిమిదన్నరేండ్లుగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దూరమై ఉన్నారు. ఈ తీర్పు ఆయన విడుదల కోసం ఉద్యమిస్తున్నవారికీ కొంత ఊరటనిస్తుంది. ప్రజాస్వామ్యానికి తామే రక్షకులమని చెప్పుకునే అమెరికా లాంటి దేశాల నిజస్వరూపాన్ని బజారులో నిలబెట్టి, నిలదీసి అందరిని ఆశ్చర్యపరిచిన అసాంజేను అగ్రరాజ్యాలు వేటాడుతున్నాయి. అసాంజేను అరెస్టు చేయడం, అమెరికాకు తరలించేందుకు ప్రయత్నించడం అంటే పత్రికా స్వాతంత్రానికి, ప్రచురణకు ఉన్న హక్కులను హరించడమే. అమెరికా అసాంజేపై ఎందుకు పగపట్టింది అనేందుకు ఆయన బట్టబయలు చేసిన రహస్యాలే నిదర్శనం.
అమెరికా, ఇరాక్, అఫ్ఘనిస్థాన్పై యుద్ధనేరాల వివరాలను ప్రభుత్వ పత్రాల నుంచే తీసి బట్టబయలుచేశారు. కలోట్రల్ మర్డర్ అనే వీడియోలో ఇరాక్లోని ఒక గ్రామంలో మట్లాడుకుంటున్న సాధారణ పౌరులను, ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులను కేవలం సరదాకోసం బాంబులేసి హతమార్చిన అమెరికా సైనిక హెలికాప్టర్ దురాగతాన్ని చూపారు. అఫ్ఘాన్లో ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరిట అమెరికా, దాని కూటమి దేశాల సైనిక దళాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో తెలిపే పత్రాలను ఆయన ప్రపంచానికి తెలియజేసారు. వేర్వేరుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన కోట్లాది సందేశాలన్నీ అసాంజ్ వల్లనే లోకానికి తెలిసాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు, వాటిసైనిక వ్యవస్థలపై అమెరికా అంచనాలు తమ అక్రమార్జననూ వేరే దేశాల బ్యాంకులకు తరలించే బడా సంపన్నుల గుట్టు.. వగైరాలు ఆయన చొరవతోనే వెలుగు చూసాయి. లేనిపక్షంలో అవి రహస్యాలుగానే మిగిలిపోయేవి.
చెలసియా మానింగ్ ఈ యుద్ధ నేరాలను అసాంజే సహకారంతో సేకరించారు. ప్రధాన మీడియాలో వీటిని చూపేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో విఫలమై వికీలీక్స్ ద్వారా బట్టబయలు చేశారు. అందుకే అసాంజే, మానింగ్ ఇప్పుడు జైళ్ళలో ఉన్నారు. వారిపై పెట్టిన నేరం అసాంజే నిజమైన జర్నలిస్టు కాదని, మానింగ్ ద్రోహి అని. అందుకే వారిని శిక్షించ తలిచారు. వీరు ఇద్దరు ప్రపంచ మానవాళికి అమెరికా నేరస్వరూపాన్ని తెలియచేశారు. వారికి అందులో వ్యక్తి స్వార్థం ఏమీలేదు. అందుకే అమెరికా రక్షణమంత్రి పాంపియో అసాంజే వికీలీక్స్ను ప్రభుత్వతరహా నిఘా సంస్థ అని నామకరణం చేశారు. అమెరికా గ్రాండ్ జూరీ అసాంజేను కంప్యూటర్ ఫ్రాడో చట్టం కింద కుట్ర చేసినట్టు పేర్కొన్నది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి.
కొత్త డిజిటల్ యుగం ఇది. దీనితో సోషల్ మీడియా నిఘా వ్యవస్థ సర్వేలేన్స్ పెట్టుబడిదారీ విధానం, ప్రభుత్వం రక్షణ వ్యవస్థలో ప్రజలందరినీ నిఘా వ్యవస్థ కిందకి తెచ్చి ప్రతిక్షణం గమనిస్తున్నాయి. ఈ కొత్త వ్యవస్థను అసాంజే వినియోగించి కొత్త తరహా జర్నలిజాన్ని సృష్టించాడు. అగ్రరాజ్యం దృష్టిలో ఇది ఆయన చేసిన పెద్ద నేరం, కుట్ర, కంప్యూటర్ ఫ్రాడ్, హైటెక్ నేరస్తుడు ఇంకా ఇలా ఎన్నో...
అసాంజేకు అమెరికా చట్టమే జర్నలిస్టులకు కల్పించిన స్వేచ్ఛ, రక్షణ కల్పించడానికి నిరాకరిస్తున్నది. ఇదే అంశాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే న్యూయార్క్ టైమ్స్ విలేకరి డానియల్ ఇల్స్బర్గ్ పెంటగాన్ పత్రాలు బయటపెట్టాడు. వీళ్ళందర్నీ శిక్షిస్తే అది పత్రికా స్వేచ్ఛపైనే దాడి కదా!?
అసాంజే కేవలం ప్రభుత్వ రహస్య పత్రాలను చేధించి సరిపెట్టుకోలేదు. డిజిటల్ మీడియా వ్యవస్థలో ఏదీ రహస్యంగా జరగదు అనే ఒక నమ్మకాన్ని బద్దలకొట్టి, ఆనవాళ్ళు కనపడకుండా ఉండే పరికరాలను కూడా తయారుచేసుకుని వినియోగించాడు. ఇది మరో ముందడుగు.
వికీలీక్స్ సర్వర్లను నిలిపివేసి సమాచారం ప్రసారం కాకుండా చేసే ప్రమాదాన్ని ముందే ఊహించిన వికీలీక్స్ అనేక సైట్స్లోకి దీన్ని బదిలీ చేసింది. డిజిటల్ మీడియాలోని మెళుకువలను అన్నింటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బ్రహ్మస్త్రాన్ని అమెరికా నెత్తిమీదనే పెట్టాడు. అందుకే సామ్రాజ్యవాద అమెరికాకు అసాంజే అంటే ద్వేషం.
ట్రంప్ అధికారం ముగింపు అంకంలో అనేక మందికి క్షమాభిక్షలు ప్రకటించారు. అసాంజేకు సైతం క్షమాభిక్ష మంజూరు చేసి ఆయనపై సాగుతున్న వేదింపులకు ముగింపు పలికి ఉండవచ్చు. అసాంజేపై అమెరికా మోపిన 17 అభియోగాలకు 175ఏండ్ల శిక్ష పడే అవకాశం ఉన్నది. కొత్త అధ్యక్షుడుకానున్న బైడెన్ గతంలో అసాంజేను హైటెక్ ఉగ్రవాది అని అన్నారు. ఇక్కడ సమస్య సామ్రాజ్యవాదంది. దాని నిజస్వరూపాన్ని బట్టలూడదీసి బహిర్గతం చేసిన వాళ్ళను, అది అసాంజే అయినా, చెల్సియా మానింగైనా, ఎడ్వర్డ్ స్నోడెన్ అయినా వాళ్ళను అమెరిక పాలకులు వదుల్తారా?