Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఆలోచనలకీ, కండ్లముందు కనిపించే వాస్తవాలకీ నడుమ అంతరం అనుపమానం. కరోనా-లాక్డౌన్ ఆరంభంతో ఇండ్ల నుంచి పని చేయడం (వర్క్ ఫ్రమ్ హౌం) మొదలయింది కొందరికి. వీరి సంఖ్య లక్షల్లోనే ఉంది. కొత్తలో అంతా బాగానే అనిపించింది. అయినవాళ్ళ మధ్య పని చేసుకోడం హాయిగానే తోచింది. భార్య/భర్త పిల్లాపాపలతో కుటుంబంలో ఏంచక్కా పనిచేసుకోవచ్చని తలపోశారు. కానీ రోజులు, వారాలు, నెలలు గడుస్తున్న కొద్దీ దృశ్యం మారింది. ఇంటి కన్నా ఆఫీసు పదిలం అనుకోడమే కాదు అంటున్నారు ఎందరో.
పదినెలలుగా ఇంట్లోంచి పనిచేస్తున్నవారి మానసికావస్థ చిత్రంగా పరిణమించింది. గుక్కతిప్పుకోనివ్వకుండా పెరిగిన పనిభారం హతాశుల్ని చేసింది. ఇంట్లో ఉన్నామనే గానీ ఎడతెగని పనితో అలసిపోతున్నామని 81శాతం మంది ఉద్యోగులు ఇటీవల జరిపిన ఒక సర్వేలో చెప్పారు. ఇల్లే ఆఫీసుగా మారడం అంత సులువు కాదనీ, సౌకర్యమూ కాదనీ ఈ సర్వే గణాంకాలు తేల్చి చెప్పాయి. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయడానికి అదనంగా పని చేయాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంటిపనినీ, ఆఫీసు పనినీ సమన్వయం చేసుకోడం సంక్లిష్టమైన వ్యవహారమని అరవైశాతం మంది ఉద్యోగులు అన్నారు. ఇంట్లోంచి పనిచేయడం ఎంతమాత్రం సంతోషంగా లేదని 55శాతం మంది జీరబోయిన కంఠాలతో చెబుతున్నారు.
ఇంట్లోంచి పని చేయడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చన్న భావన తలకిందులయింది. మధ్యతరగతి కొంపలు ఇందుకు అనువు కావన్నది అనుభవంలో బోధపడింది. నెలకు లక్ష, రెండు లక్షలు సంపాదించేవారు సైతం రెండు పడకగదుల ఇంట్లోనే పొద్దుపుచ్చుతున్నారు. మూడు పడకగదుల ఇల్లు అన్నది చాలామందికి ఓ విలాసం. రెండు గదుల ఇంట్లో భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉండటం, సర్దుకుపోవటం అంత చిన్న విషయం కాదు. నిజానికి చాలా ఇండ్లలో పడకగదులు స్టోర్రూముల మాదిరిగా ఉంటాయి.
దంపతులు ఇద్దరు పనిచేసేవారయితే ఇంట్లోంచే పని చేయడం కష్టసాధ్యం. తాము పని చేస్తూ, పిల్లలకు వండిపెడుతూ, వారి ఆలనాపాలనా చూస్తూ గడపాల్సి రావడం ఇబ్బందికరం. కొన్నిసార్లు పిల్లల అరుపులో, అల్లరో, భార్య లేదా భర్త కేకలో పనికి అంతరాయంగా పరిణమిస్తాయి. పనిలో పూర్తిగా లీనం కాలేని పరిస్థితి దంపతుల మధ్య గొడవలకు దారితీసిన వైనం 'వర్క్ ఫ్రమ్ హౌం' వద్దే వద్దు అనుకునేలా చేసింది.
అందరూ ఇంట్లోనే ఉండటం కారణంగా ఏకాంతం భగమైంది. ఆఫీసువాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లు, ఫోన్లో మాట్లాడాలంటే ఏకాంతం కావాలి. ఇతర శబ్దాలేవీ వినిపించకూడదు. ఒకరు పనిలో ఉంటే మరొకరు టీవీ చూడలేరు. కనీసం మిత్రులతో ఫోనులో మాట్లాడలేరు. ఎదుటివారి ఏకాంతాన్ని భగం చేయకుండా నోర్మూసుకొని కూర్చోవాల్సి రావడం సర్కస్ విన్యాసంగా పరిణమించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లోంచే పని చేయడం చెప్పుకోలేని ఇక్కట్లకు దారితీసింది.
ఈ నేపథ్యంలోనే ఇంటి కన్నా ఆఫీసు పదిలం అన్నది వాస్తవం. ఇంట్లో పిల్లలనో, భార్యనో ఒక మాట అనేసి, వాళ్ళముందే మనస్ఫూర్తిగా పనిలో లీనం కాలేరు. అయ్యోపాపం అనవసరంగా నోరు జారాననే నేరపూరిత భావనలో అల్లాడుతారు. ఇదివరలో కోపం వస్తే ఒక మాట అనేసి బయటకు వెళ్ళేవారు. ఆఫీసుకు వచ్చాక ఇంటినీ, కుటుంబాన్నీ మరిచిపోయి పనిలో నిమగమయ్యేవారు. ఇప్పుడు పొట్లాడుకుంటూనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ పని చేయాల్సి రావడం ఎంత సంక్లిష్టం. మధ్యతరగతి కొంపల్లో 'ఏకాంత మందిరాలు', 'కోపగృహాలు', 'అలకతో గారాలు' పోవడానికి ప్రత్యేకించిన గదులేం ఉండవు. అందరూ స్టోర్రూమ్ల వంటి ఒకటీ రెండు పడకగదుల్లోనే సర్దుకుపోవాలి. నగరాల్లోనైనా, పట్టణాల్లోనైనా ఇదే సాధారణ దృశ్యం.
ఇంటి నుంచే పని సుఖప్రదమూ, సౌకర్యవంతమూ కాదని కరోనా-లాక్డౌన్ అనుభవం తెలియజెప్పింది. పని ప్రదేశం, నివాస స్థలం వేరుగా ఉంటేనే అందం, ఆనందం. ఇంటికొచ్చాక ఆఫీసు గురించి ఆలోచించక్కర్లేదు అనే భావనలోనే సౌఖ్యం ఉంటుంది చాలామందికి. కానీ ఇల్లు, ఆఫీసు ఒకటే అయితే ఈ సౌఖ్యం బొత్తిగా ఉండదని కరోనా కల్లోల కాలం చెప్పింది. 'ఇంటి నుంచే పని' అన్నది ఆడవాళ్ళ మీద అదనపు భారం మోపింది. పిల్లలకీ, శ్రీవారికీ సేవలు చేయడంలో ఆడవాళ్ళ రెక్కలూడ్చుకుపోతున్నాయి. ఇంటిపనే ఒక యాతన అంటే, ఇక ఇంట్లోనే తిష్టవేసిన భర్త, పిల్లల డిమాండ్లు తీర్చడానికి అరవచాకిరీ చేయాల్సి రావడం కనాకష్టం. ఈ కారణంగానే ఉద్యోగాలు చేసే మహిళలు ఇంటి కన్నా ఆఫీసు పదిలం అనుకుంటున్నారు.
రంగనాయకమ్మ ఒక నవలలో సౌకర్యవంతమైన ఇల్లు అంటే కనీసం ఆరుగదుల ఇల్లు అయి ఉండాలని అన్నారు. కానీ సగటు భారతీయులకు అది ఒక కల. నెరవేరని ఆదర్శం. కోట్లమంది భారతీయులు ఒంటిగదిలోనే కాపురముండటం చేదునిజం. రెండు పడకగదుల ఇంటికోసం చేసిన అప్పు తీర్చడానికే బతుకంతా చాకిరీ చేయడం మధ్యతరగతి నైజం. ఈ గుడుగుడుగుంచం బతుకులకు 'వర్క్ ఫ్రమ్ హౌం' అన్న భావన సరిపడని వ్యవహారం. ఇది కరోనా కాలం నేర్పిన పాఠం. ఇంతకు మించి ఆలోచించడానికి వీలు పడనిది మధ్యతరగతి చైతన్యం.