Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పాలిచ్చే తల్లే పీక నులుమబోతే.. పాపకు దిక్కెవరు..
పాలించే ప్రభువే పీడిస్తూపోతే.. ప్రజలకు చుక్కెదురు''
అంటాడు అలిశెట్టి ప్రభాకర్. హర్యానాలో అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వ కిరాతక దాడి చూశాక ఈ అలిశెట్టి వాఖ్యలు గుర్తుకురాక మానవు. ఈ దేశంలో ప్రభుత్వాలకు రైతులు పాలితులా? లేక ప్రత్యర్ధులా? అన్న అనుమానం రాక మానదు. ఒకవైపు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతుల పోరు సాగుతుండగా, మరోవైపు ఈ చట్టాల ప్రయోజనాలను వివరిస్తామంటూ పోటీ సభలకు పూనుకుంది ప్రభుత్వం. ఆ ప్రయత్నాల్లో ''కిసాన్ మహాపంచాయత్'' పేరుతో ఆదివారం హర్యానాలోని కైమ్లాలో ఓ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది స్థానిక రైతాంగం. కానీ ప్రజాభీష్టాన్ని మన్నించలేని ప్రభుత్వం పైశాచికంగా దాడి చేసింది. లాఠీలు, జలఫిరంగులు, భాష్పవాయుగోళాలతో విరుచుకుపడింది. అయినా తలవంచని రైతుల పట్టుదల ముందు ముఖ్యమంత్రి ఖట్టర్ తన పర్యటన రద్దు చేసుకుని వెనుదిరిగాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత నిరసనలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు తెగించించింది ప్రభుత్వం.
అయినా గత 47రోజులుగా ఢిల్లీ పరిసరాల్లో ఎండా, వానా, చలిని ఏకం చేస్తూ పోరాడుతున్న రైతులకు సమాధానం చెప్పకుండా... ఇలా పోటీ సభలకు దిగజారడంలోని ఔచిత్యమేమిటి? రైతులేమైనా ఏలినవారికి ప్రత్యర్థులా? వారి ఏలుబడిలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ప్రజలే కదా..! దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ లక్షలాది రైతులు హస్తిన సరిహద్దుల్లో దీక్షలో ఉంటే... వారికి సమాధానం చెప్పకుండా, చట్టాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామంటూ పోటీ సభలు నిర్వహించడం దేనికి సూచిక అదే ప్రశ్న లేవనెత్తారు రైతులు. సమాధానం లేని సర్కారు తన పోలీసు బలగాలకు పనిచెప్పింది. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
నిజానికి ప్రశ్న ప్రజాస్వామ్యానికి ఎనలేని బలం. నిరసన దానికి అలంకారం. వీటిని గౌరవించడం ప్రజా ప్రభుత్వాల లక్షణం. అది విస్మరించి ప్రశ్న గొంతు నులిమేయడం, నిరసనలపై విరుచుకుపడటం ఏ లక్షణం? జాతీయోద్యమ అనంతర కాలంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ముందుకొచ్చిన ఈ రైతు ఉద్యమం ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరిలూదుతోంది. ప్రపంచానికే గొప్ప స్ఫూర్తినిస్తోంది. అదే మన ఏలికలకు కంటగింపుగా మారినట్టుంది. అందుకే పదే పదే విఫల చర్చలు సాగిస్తూ, వాయిదాల పర్వం కొనసాగిస్తూ, రైతుల సహనాన్ని పరీక్షిస్తూనే మరోవైపు అణచివేతలకూ, అసత్య ప్రచారాలకూ పాల్పడుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాల సారాంశమేమిటీ? ఈ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసమే అంటోంది ప్రభుత్వం! ఆ ప్రయోజనాలు మాకొద్దు మొర్రో రద్దు చేయండి అంటున్నారు రైతులు. చట్టాల రద్దు తప్ప మరేదైనా అడగండి అంటుంది ప్రభుత్వం! మా పోరాటమే ఆ చట్టాల రద్దు కోసమైతే అదికాక మరేమి అడుగుతాం? అంటున్నారు రైతులు. ఇక చర్చలు ముందుకెలా సాగుతాయి. చర్చల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణలేం కావాలి? వద్దన్నా రుద్దుతామంటున్న ఈ చట్టాలు ఎవరికోసమో అర్థం చేసుకోవడానికి ఇంతకు మించిన రుజువులేం కావాలి?
చివరికి బాధ్యతారహితంగా బంతిని సుప్రీం''కోర్టు''లోకి తోసి చేతులు దులుపుకోవాలను కుంటున్నారు. కోర్టులు తేల్చాల్ససిన విషయమా ఇది? అటువంటప్పుడు ఇక ప్రభుత్వమెందుకు? ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ''చర్చలు పూర్తయ్యేవరకూ చట్టాలను నిలిపేస్తారా? లేక మమ్మల్ని స్టే ఇవ్వమంటారా?'' అంటూ గట్టిగానే హెచ్చరించింది. కానీ ఇది ఏలినవారికి తలకెక్కుతుందా? అందుకే రైతులు ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తూ జనవరి 26న ట్రాక్టర్ల పెరేడ్కు పిలుపునిచ్చారు. ఉలిక్కిపడ్డ ఏలినవారి భజన బందాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమకు అలవాటైన విభజన రాజకీయాలకు తెరతీశాయి. ఇది రిపబ్లిక్ డే రోజున జరిగే సైనిక కవాతును అవమానించడమేనంటూ కిసాన్కూ జవాన్కు మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారు. రైతులు దేశద్రోహులు అంటున్నారు. మరి ''మేమూ రైతుబిడ్డలమే'' అంటూ ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న సైనికులను విధులనుంచి తొలగించడాన్ని ఏమనాలి?
ఇప్పటికే రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులన్నారు. విదేశీ ఏజెంట్లన్నారు. కుట్రదారులన్నారు. ఇప్పుడు దేశద్రోహులు అంటున్నారు. అవును... ఎన్నుకున్న ప్రజలకు వెన్నుపోటు పొడిచి, కార్పొరేట్ రాబందులకు రక్షణగా నిలవడమే దేశభక్తిగా చలామణీ అవుతున్న కాలం కదా...! దానిని ప్రశ్నించేవారంతా దేశద్రోహులే అవుతారు మరి! అందుకే హర్యానాలో ప్రభుత్వ బలగాలు రైతులపై పాశవికంగా దాడి చేశాయి. రేపు ఢిల్లీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక ఈ అప్రజాస్వామిక దాడి ఘటన, ప్రజాపక్షం వహించే కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తప్ప ప్రధాన స్రవంతి మీడియాలో కనీస ప్రస్తావనకు నోచుకోకపోవడం వైచిత్రి. సర్వాధికారాలనూ గుప్పిట పెట్టుకున్న రాజ్యం సత్యాన్ని సమాధి చేసేందుకు, ప్రశ్నను అణచివేసేందుకు ఎంతకైనా తెగిస్తుందనడానికి ఈ పరిణామాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కానీ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నిరసనే నేరమైన చోట పుట్టుకొచ్చేది ధిక్కారమే. చరిత్ర చెప్పిన సత్యమిది. హక్కులన్నీ రాజ్యం ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నప్పుడు, దేశభక్తి పరీక్షలో ప్రజలే ద్రోహులుగా మారిపోతున్నప్పుడు, చెక్కుచెదరని చైతన్యమే మనలను ఒక్కటిగా పదునెక్కిస్తుందంటూ రాజధాని సరిహద్దుల సాక్షిగా రైతన్నలు ఇస్తున్న సందేశమిది.