Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ ప్రభుత్వం విస్త్రృత ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయ అవసరాలకు ప్రాధాన్యతనిస్తే మొదటికే మోసం వస్తుంది. గత ఏడాదిగా కేసీఆర్ సర్కారు తీరే ఇందుకు నిదర్శనం. కొత్త రాష్ట్రాన్ని సరైన పంథాలో నడుపుతానన్న ఉద్యమ నేత, ఆ తర్వాత కేంద్రంతో రాజీపడి బాధ్యతను గాలికొదిలేశారు. రాష్ట్రాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారును అటు చట్టసభలు, ఇటు ప్రజలసాక్షిగా ప్రశ్నించకుండా, నిలదీయకుండా నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించడం విడ్డూరం. అంతేగాక ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేష రాజకీయాలు, మతోన్మాదానికి వెన్నుదన్నుగా నిలవడం, దాని అడుగులకు మడుగులొత్తడం ఆశ్చర్యకరం. గత ఆరేండ్లుగా రాష్ట్రం తీవ్రమైన కష్ట, నష్టాలను చవిచూసింది. కోవిడ్తోపాటు ఆయా సందర్భాల్లో సాయం చేయాలని కోరినా ప్రధాని మోడీ మనస్సు కరగలేదు. కాగా ప్రజావ్యతిరేక ప్రపంచబ్యాంకు సంస్కరణలను పివి హయాం కంటే వేగంగా అమలుచేస్తున్నారు. బీజేపీతో టీఆర్ఎస్ వ్యవహారం చీకట్లో దోస్తీ, వెలుగులో కుస్తీలా మారింది. తద్వారా రాష్ట్ర ప్రజల ఆశలను అడియాశలు చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు, పరిపాలన సంస్కరణల పేరిట కేంద్రం, రాష్ట్రాలపై పెత్తనం చేస్తూ తెచ్చిన పలు నిరంకుశ చట్టాలు, బిల్లులకు టీఆర్ఎస్ చప్పట్లు కొట్టింది. మున్సిపాల్టీల్లో ప్రజావ్యతిరేక సంస్కరణలకూ ఓకే చెప్పింది. తద్వారా జీఎస్టీ బకాయిలను తెచ్చుకోవాలని చూసిన టీఆర్ఎస్కు, బీజేపీ మొండిచేయే చూపింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రానికి రూ.2.73లక్షల కోట్లు పన్నులు కడితే, అందులో నుంచి రూ.1.40లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కేంద్రాన్నీ అడిగితే సంస్కరణలు అమలుచేయాలంటూ లంకె పెట్టింది. తద్వారా రాష్ట్రాలను పంచాయతీలు, మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చింది. ఎఫ్ఆర్బీఎం రేటును 3.5శాతం నుంచి 5శాతానికి పెంచి రాష్ట్రాలు తన చెప్పుచేతుల్లో ఉండేలా కుట్రపన్నింది. కేంద్రం షరతులకు తలొగ్గిన మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలూ అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నాయి. కొత్త రైతు చట్టాలు, విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కేసీఆర్, చివరికంటా దానికి కట్టుబడి నిలబడలేదు. పేరుకు కేంద్రానికి లేఖ రాసి, ఇప్పుడా చట్టాల అమలుకు సిద్దమవడం ఆయన చిత్తశుద్ధికి ఆనవాలు. ఇప్పటికే రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ విధానం అమల్లోకితేవడంతోపాటు తాజాగా విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సర్కారు అంగీకరించడం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రద్దుచేయడం అన్యాయం. ఒక పక్క మున్సిపల్ కార్పొరేషన్లల్లో 20వేల లీటర్ల నీరు ఉచితమంటూనే, మరోపక్క మీటర్లు పెట్టి బిల్లుల వసూలుకు వ్యూహారచన చేస్తున్నారు. ఈ పథకమూ రైతుబంధు లాంటిదే. గృహ యజమానులకు మాత్రమే లాభం చేకూర్చి, కిరాయిదారులకు వాత పెట్టాలని భావిస్తున్నది. బలవంతంగా రాష్ట్రాలపై కేంద్రం ఉదరు స్కీం, ఆ తర్వాత ఆదిత్య పేరుతో చేసుకున్న విద్యుత్ త్రైపాక్షిక ఒప్పందంతో డిస్కంలకు దాదాపు రూ.30 వేల కోట్ల అప్పులు మిగిలాయి. మద్ధతు ధర విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయాలని తొలుత చెప్పిన గులాబీ అధినేత, అనంతరం ఆ మాటే మరిచారు. రాష్ట్రాల జాబితాల్లోని అంశాలపై రాజకీయం చేస్తున్నదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఆ తర్వాత కేంద్రానికి లొంగిపోయారు. గత ఆరేండ్ల కాలంలో పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ అంశాల్లో ఎన్డీయేకి టీఆర్ఎస్ వంతపాడింది. కాగా బీజేపి పునర్విభజన చట్టం పరిధిలోని అనేక సమస్యలను పెండింగ్లో పెట్టింది. హైదరాబాద్ ఐటీఐఆర్పై లేఖలతో కేటీఆర్ తాటాకు చప్పుళ్లకే పరిమితమవుతున్నారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, నిటిఅయోగ్ చెప్పినట్టు కాకతీయ, భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వనేలేదు. సీసీఐ పునరుద్దరణ, నర్మద, గంగానది తరహాలో మూసీనది ప్రక్షాళన నిధుల ముచ్చట అటకెక్కింది. సంస్కరణలను అమలుచేస్తేనే సాయంచేస్తామంటూ రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేయడాన్ని కేరళ వామపక్ష ప్రభుత్వం ఆది నుంచీ వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నది. ఆ తరహాలో కలిసొచ్చే రాష్ట్రాలు, పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఎదిరించాల్సిన టీఆర్ఎస్, రాజీ ధోరణితో బీజేపీకి మద్దతివ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం చేయడాన్ని సహించకూడదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పోరాట జెండాను పట్టాల్సిన కేసీఆర్, తెల్లజెండా పట్టడం ఆ పార్టీకి నిజంగా శాపమే. భవిష్యత్తే ఆ సంగతిని తేల్చనుంది. తనతో సంధి చేసుకున్న ప్రాంతీయ పార్టీలను పూర్తిగా మింగేసి జీర్ణం చేసుకున్న చరిత్ర బీజేపీది. నిలిచి పోరాడితేనే టీఆర్ఎస్ బతికిబట్టకడుతుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల హక్కులనూ రక్షించగలుగుతుంది.