Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సింఘు' - నేడిది కార్పొరేట్లకు సింహస్వప్నం. వారి సేవలలో పునీతమై పులకించిపోతున్న మోడీ బృందం గొంతులో పచ్చి వెలక్కాయ! కార్పొరేట్లడిగినవే గాక, అడగని ఎదురు సేవలూ అందించ గలుగుతున్నానని విర్రవీగే మోడీకి నిద్రలేని రాత్రులను అందిస్తున్న పేరే 'సింఘు'.
''ఇంతింతై, వటుడింతై
మరియు తానింతై, నభోవీధిపై నంతై
తోయగ మండలాగ్రమున అల్లంతై'' అంటూ వామనుడు పెరిగిన తీరును కండ్లకు కట్టాడు బమ్మెర పోతన. ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఆ వర్ణన అక్షరాల సరిపోతుంది. వందల మందితో మొదలై, వేలై, లక్ష లైందా ఉద్యమం. కోట్లాది భారతీయ రైతుల హృదయ స్పందనైంది. ముప్పయ్యేండ్ల ఉదారవాద విధానాలకు పెనుసవాలుగా నిలిచింది. వేలెకరాలకు విస్తరించిన దావాగ్నిని ఊది ఆపేద్దామని మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. వారి కిరాయి మేధావులు, యావత్ రాజ్యాంగ యంత్రమూ చేయని ప్రయత్నమంటూ లేదు.
సింఘు తెలంగాణలో గ్రామంపేరుకాదు. వీధిపేరు అంతకన్నా కాదు. తెలంగాణలోకి 'సింఘు' రావాలని కొందరి కోరిక. వస్తే బాగుండునని ఎందరికో ఆశ. ఉత్తర భారతాన్ని ప్రళయ భీకరంగా దహిస్తున్న దావానలం చిటపటలు మన తెలంగాణలో పడితే, ఇక్కడ అగ్గిరగలదా? అంటే 'కో' ఆటలో లాగా చతికిల పడున్న మన రైతాంగాన్ని వెనకనుంచి ఎవరో 'కో' అని లేపడం కాదు. ఎవరో లేపాల్సిన (దు)స్థితిలో మన రైతాంగం లేదు. 'వెట్టి'కి వ్యతిరేకంగా ప్రారంభమైన నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూపంపిణీతో ముగిసింది. ఫ్యూడల్ దొరల గడీలను కూల్చి వేసింది. నైజాం సంస్థానాన్ని బద్దలు కొట్టింది. భూసమస్యను భారతదేశ ఎజెండా మీదికి తెచ్చింది. తెలంగాణ రైతాంగం స్వయం చలితం. స్వయం ప్రకాశితం!
నేటి తెలంగాణ పాలకులు 'రాజకీయ' కొలబద్దతో రైతు సమస్యలను కొలుస్తున్నారు. రైతు బంధు వంటి సంక్షేమ చర్యలే ''ముడుపు కట్టి'' హుండీలో వేస్తే అదే మోక్ష ప్రదాయినన్న భ్రమలో ఉన్నారు. తెలంగాణ సాధించిన 'పట్టా'శాశ్వత కైవల్య సాధనమనే కలలు కంటున్నారు. వ్యవసాయ చట్టాలను అధినేత వ్యతిరేకించినంత సేపు పట్టలేదు పిల్లిమొగ్గలేయడానికి! ''ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయద''ని మనకు తెలుసు. కేసీఆర్ వచ్చే సంవత్సరం నుంచి ధాన్యం సేకరణ ఉండదని చెప్తే, వ్యవసాయ మంత్రి ''ఈ యాసంగి పంటలే కొనం'' అన్నాడు. పైగా కేంద్ర వ్యవసాయ చట్టాల్లో మద్దతుధరలేదు కాబట్టి తామూ ఇవ్వమనడం ఏం నీతి? వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించిందని ఈ పెద్ద మనిషికి తెలియదనుకోవాలా? లేదా ఆపేరు మీద ఇక్కడ వదిలించుకోదలిచారా?
వడ్లు, జొన్నలు, మక్కలు, కొర్రలు, పెసలు, పత్తి వంటి 23రకాల వ్యవసాయోత్పత్తులను ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి ఎఫ్సీఐ, సీసీఐతో పాటు నాఫెడ్, ఆయిల్ఫెడ్, స్పైస్ఫెడ్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తున్న సంగతి టీఆర్ఎస్ పెద్దలకు తెలియదా? ఇన్ని రకాల వ్యవసాయోత్పత్తులను కొనకపోతే తెలంగాణలోని 60లక్షల రైతు కుటుంబాలు, మరో 60లక్షల వ్యవసాయ కార్మిక కుటుంబాలు ఏమికావాలి? మన రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం, అనుబంధంగా ఉన్న పాడి, పౌల్ట్రీ వంటివన్నీ కలిసి 15.5శాతం. ఇదంతా దెబ్బతింటే రాష్ట్రం పరిస్థితి ఏమిటి? వ్యవసాయంమీద ఆధారపడి ఉన్న రైస్మిల్స్, దాల్ మిల్స్, చక్కెర పరిశ్రమ మొదలైనవి దెబ్బతినవా?
అంతమంది ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతింటే రాష్ట్రాభివృద్ధి ఏరకంగా జరుగుతుంది. అరచేతిలో పెట్టి మోచేతిదాకా నాకిచ్చే పాలకులను ప్రజలు ఉపేక్షించరు. ఒక్క చిన్న ఉదాహరణ చూస్తే తెలంగాణలో ''నిధులు- నియామకాలు'' ఏవిధంగా కొండెక్కాయో అర్థమవుతుంది. వరంగల్, అదిలాబాద్ టెక్స్టైల్ కారిడార్ అన్నారు. ఒక్క సిరిసిల్లలో 200 యూనిట్లు నిర్మాణమైనాయి. 40 ప్రారంభమై నడుస్తున్నాయి. చౌటుప్పల్ వద్ద 400 టెక్స్టైల్ పరిశ్రమలొస్తాయన్నారు. 22 వచ్చాయి. బ్రాండెక్స్తో ఒప్పందం చేసుకుని జీన్స్ ప్యాంట్లు ఉత్పత్తి చేస్తున్నారు. వరంగల్లో 'మెగా కాకతీయ టెక్స్టైల్స్ పార్క్' అన్నారు. 2వేల ఎకరాలు కేటాయించారు. 5లక్షల మందికి ఉపాధి అన్నారు. 3వేల కోట్ల రూపాయల ఒప్పందాలు 33 కంపెనీలతో చేసుకున్నామన్నారు. ఒక్కటీ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఉపాధి చూపట్లేదు. తరతరాలుగా చేసుకుంటున్న వ్యవసాయానికీ 'సాయం' ఆగితే రైతుకి దారేది? రానున్న రోజుల్లో ఒకటికాదు ఎన్ని సింఘూలు పుట్టుకొస్తాయో తెలంగాణలో!
ఈ దశలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లో నిశితంగా ఎండగట్టి పోరాడాల్సిన టీఆర్ఎస్, బీజేపీతో లాలూచి కుస్తీ వల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అందుకు లిట్మస్ టెస్ట్ వ్యవసాయ చట్టాలు. ఇవి కేసీఆర్, మోడీల వ్యక్తిగత వ్యవహారం కాదు. దేశంలోని కోట్లాది రైతుల ప్రయోజనాలకు సంబంధించిన, ఆహార భద్రతకు సంబంధించిన విషయం.
మూడు దశాబ్దాలుగా సరళీకృత ఆర్థిక విధానాలపై పోరాడుతున్న వర్గాలు, వ్యక్తులు, శక్తులకు ఇదొక 'వాటర్లూ' యుద్ధం వంటిది. దాదాపు మొత్తం ఐరోపాను ఆక్రమించిన నెపోలియన్ బోనపార్టె 1815లో వాటర్లూ అనే చోట జరిగిన యుద్ధంలో ఓడిపోతాడు. అప్రతిహత నాయకుడనేవాణ్ణి ఓడించిన యుద్ధం వాటర్లూ యుద్ధం. అందుకే సింఘూ మోడీకి ''వాటర్లూ' అవ్వాలని, అవుతుందన్న ఆశతో కోట్లాది కష్టజీవులు ఎదురు చూస్తున్నారు.