Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలు పనులు వదిలేసి కొసరు పనులు చేసినట్టుగా ఉంది టీఆర్ఎస్ సర్కారులోని మంత్రులు, ఎమ్మెల్యేల తీరు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రాన్నీ, ప్రజలనూ ఆదుకోకుండా, కొత్త ముఖ్యమంత్రి పల్లవిని ఎత్తుకోవడం విడ్డూరం. విద్యాసంవత్సరం ముగిసే సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో అసలు తరగతులే ప్రారంభం కాక, దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందే దుస్థితి. ఉపాధి సమస్యలు కొలిక్కిరాకపోగా, ఇంకా పెరిగాయి. టీకా భయాలు జనాలను వెంటాడుతూనే ఉన్నాయి. పీఆర్సీ వ్యవహారాన్నీ తేల్చనేలేదు. ఒకవైపు దేశమంతా వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్లు, విద్యుత్ బిల్లుపై కర్షకులు, కార్మికులు, యువత, మహిళలు పోరుబాటలో ఉంటే, నీరోచక్రవర్తి అనుంగు శిష్యుల్లా వ్యవహరిస్తున్న రాష్ట్రంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల తీరు విచిత్రంగా కనిపిస్తున్నది. ప్రజల యాతన పక్కకు బెట్టి నూతన సీఎంను ప్రమోట్ చేసేపనిలో ఉండటం ఆశ్చర్యకరం. కార్మికులు, రైతుల మీద దాడిలో ప్రధాని మోడీ సర్కారు బీజీగా ఉంటే, ఆయనకు తామేమి తీసిపోమన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. ప్రజాసమస్యల పరిష్కారం ఒట్టిమాటైతే, కేసీఆర్నూ ఆయన కుటుంబాన్నీ స్తుతించడం, పొగడ్తలతో ముంచెత్తడమనే అలవాటును ఆనవాయితీగా మార్చేశారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఏదీ పక్కాగా నడవడం లేదు. అత్తెసరు నిధులతో సడిగిలపడ్డాయి. పథకాలు పదుల సంఖ్యలో ఉన్నా, ఒకటి, రెండింటిలో మాత్రమే కాసుల గలగలలు వినిపిస్తునాయి. మిగతా వాటి పరిస్థితి ఎడారిలో ఓయాసిస్సునే తలపిస్తున్నది. వీటి గురించి పట్టించుకోవడం, చక్కదిద్దడం తదితర చర్యలపై దృష్టిపెట్టకుండా, ఆయా అనవసర రాజకీయ వ్యాఖ్యానాలతో కాలం వెళ్లబుచ్చడం ఆందోళన కలిగిస్తున్నది.
విద్యాసంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ప్రభుత్వం సమీక్షలు చేయడానికే పరిమితమైంది. మే లో పరీక్షలు పెడతారనే గుబులు విద్యార్థుల్లో షురూ అయింది. సర్కారు డిజిటల్ తరగతులు ప్రారంభించి చేతులు దులుపుకున్నది. పిల్లలంతా క్లాసులు వింటున్నారనీ పదే పదే చెబుతున్నా, వారికి అవి ఏమేరకు వంటబడుతున్నాయనే విజ్ఞతను మరిచింది. పాఠాలు పక్కనబెట్టి పొట్టకూటికోసం పనిబాటపడుతున్న దృశ్యాలు ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయినా సర్కారు విస్మరిస్తున్నది. గత 10 నెలలుగా స్కూళ్ల ఆనవాళ్లు పూర్తిగా మారిపోయాయి. వాటి మరమ్మత్తులకు అవసరమైన నిధుల మంజూరును పెడవెవినపెట్టింది. పైనలియర్ విద్యార్థులకే ప్రత్యక్ష బోధన చేస్తామంటున్న సర్కారు, మిగతా పిల్లల గురించి స్పష్టమైన విధానాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ తరహా లాలూచీ విధానాన్ని అనుసరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, పంటల కొనుగోళ్లు, ఐకేపీ సెంటర్ల కొనసాగింపుపై బీజేపీ బాటలోనే వెళతానంటున్నది. కనీస మద్దతు ధర అంశాన్ని గాలికి వదిలేసి, కొనుగోళ్లు చేయబోమని ఇటు సీఎం, అటు మంత్రి ప్రకటించడం టీఆర్ఎస్ అసలు రంగును బయటపెట్టేదే. పొద్దునలేస్తే చాలు కాళేశ్వరం, మిషన్ భగీరథ ఢంకాను నెత్తికెత్తుకుంటున్నది. 2018 జూన్ నుంచి తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పీఆర్సీని నానుస్తూ వస్తున్నది. ప్రమోషన్లు, బదిలీలను గాలికొదిలేసింది. దాదాపు పదేండ్లుగా కార్మికుల కనీస వేతనాల జీవోలకు మోక్షం కలగలేదు. రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించడంలోనూ బీజేపీ వివక్ష ప్రదర్శిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో నిమ్జ్ భూసేకరణ రక్తసిక్తమైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను నిలేసి అడగకుండా ఢిల్లీకి లేఖలను పంపి చేతులు దులుపుకోవడం రాష్ట్ర నేతల హ్రస్వదృష్టికి నిదర్శనం. తద్వారా స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నది. విద్యుత్ సంస్కరణల పుణ్యమా అని డిస్కంలకు రూ.33 వేల కోట్ల అప్పులు మిగిల్చిన ఘన చరిత్రా బీజేపీదే. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలుచేయకపోవడంతో రూ.723 కోట్లు నష్టపోయే పరిస్థితి దాపురించింది. పునర్విభజన చట్టం చెప్పినట్టుగా వెనుకబడిన ప్రాంతాలకు రెండేండ్లకు కలిపి రూ.900 కోట్లనూ మోడీ సర్కార్ ఇవ్వలేదు. జీఎస్టీ, ఇతర పరిహారాల నిధులూ రూ. 8500 కోట్లకుపైగా కేంద్రం నుంచి రావాలి. ఇన్ని సమస్యలున్న ఈ తరుణంలో ప్రజలపక్షాన నిలబడి వారి బాధలను ఎప్పటికప్పుడు స్పృశించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం నీమ్మకునీరెత్తినట్టు ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? ఇలా సమస్యలన్నీ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త ముఖ్యమంత్రి కోసం స్తోత్రపాఠాల పారాయణం చేయడం ఆందోళనకరం. ఈ తరహా రాజకీయాలతో నమ్మిన ప్రజలను వంచించడమే గాక రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతిస్తుందనే సంగతినీ పాలకులు గుర్తెరగాలి.