Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విశాఖ ఉక్కు అంటే సంకల్ప కల్పవల్లి
లక్ష కుటుంబాల కడుపు నింపే కన్నతల్లి
ఆ తల్లిని చెరబట్టి, అంగట్లో నిలబెట్టి
అంగాంగం తూకమెట్టి అమ్ముకుతింటామంటే!'' చూస్తూ ఊరుకోమంటూ సుద్దాల అశోక్తేజ చేసిన హెచ్చరిక తెలుగువారికే కాదు, యావత్ భారతీయ సమాజానికే! రెండు వందలకి పైగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను 'రద్ది' పేపర్లను తూకమేసి అమ్మినట్టు అమ్మేయడానికి అవేమైనా పాత ఇనుప సామాన్లా? మూడునాలుగు తరాల భారతీయుల రక్తమాంసాలవి! జాతీయోద్యమ ఆకాంక్షలవి! స్వతంత్ర భరతదేశ పురోభివృద్ధి సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉండరాదని అప్పటితరం ఆలోచించింది. పాపం! వారికేమి తెలుసు? ఏడు దశాబ్దాలు గడిచేసరికి అమెరికా సామ్రాజ్యవాదంతో అంటకాగే తరం ఆవిర్భవిస్తుందని!? (జేఆర్డీ) టాటా, (జీడీ) బిర్లాల తరం తమశక్తి చాలక ప్రభుత్వమే మౌలిక రంగాన్ని నెత్తికెత్తుకోవాలని అభిలషించింది అప్పుడు. ఆ మౌలికరంగం సాయంతో శత, సహస్ర కోటీశ్వరులుగా పడగలెత్తిన 'కొత్తతరం' - అంబానీలు, అదానీలు. పందిరిని బట్టి అల్లుకుపోగల అశ్రిత పెట్టుబడిదారులు వీరు.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నేపథ్యం ఇది. ఆర్థికశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అది నష్టాల్లో ఉంది కాబట్టి ప్రయివేటు వారికిస్తున్నామనడం మోడీ సర్కార్ తాటిచెట్టు ఎక్కింది దూడ మేతకోసమేనని మనల్ని నమ్మించ జూడటమే. కాసేపు ఆయనవాదనే నిజమనుకున్నా అత్యంత లాభాలార్జించే బీసీపీఎల్, హెచ్పీసీఎల్లను ఎందుకు తెగనమ్ముతున్నారో అమాత్యుల వారు సెలవిస్తారా? ఉత్పత్తి ప్రారంభించి నలభైయేండ్లయినా మనదేశంలో గనులు కేటాయించబడని ఏకైక స్టీల్ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమే! ప్లాంటేలేని గాలి జనార్ధనరెడ్డికి, స్టీల్ప్లాంట్ బోర్డ్ తగిలించుకున్న బ్రాహ్మణిస్టీల్కు ఇనుప ఖనిజం గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్కు గనులెందుకు కేటాయించలేదో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. దక్షిణ కొరియాకు చెందిన 'పోస్కో'కు ప్లాంట్ నిర్మించకుండానే ఒడిషాలో గనులెందుకు కేటాయించారో కూడ పాలకులు జవాబు చెప్పాలి. గనులుండి ఉంటే సంవత్సరానికి 3000 - 3500కోట్ల రూపాయలు ఉత్పత్తి ఆదా అయ్యేది విశాఖ స్టీల్కు.
ఇక్కడ సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్ది మాత్రమే కాదు. పాలకులవలంబించే విధానాలది.1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ నియమించిన డాక్టర్ అర్జున్సేన్ గుప్తా నివేదిక గుర్తున్నవారు, దానిపై పోరాడిన వారు మోడీ మహాశయుడు దాన్ని మరో మెట్టు పైకి తీసికెళ్తున్నట్లు గుర్తిస్తారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభకాలంలో ఆ సునామీ భారత తీరాన్ని తాకలేదని గర్వంగా చెప్పుకున్న పాలకులు అందుకు కారణమైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలను టోకుగా వదిలించుకోవడం చూస్తే కార్పొరేట్ల తొందర స్పష్టమవుతుంది. కార్పొరేట్లు, వారి లాభాలకు కాపలాకాయడమే పాలకుల రీతి, నీతిగా విరాజిల్లుతోంది నేడు. పెట్టుబడిదారులకు ''కాగల కార్యం గంధర్వులే'' తీర్చాల్సిన పనిలేదు. ఈ కలియుగంలో ''56 అంగుళాల ఛాతి'' చాలు కదా! కుల, మత మారణహౌమాన్ని రేగ్గొడుతూ, రెచ్చగొడుతూ, తననింతవాణ్ణి చేసిన గుజరాతీ మిత్రులకే కాదు, దేశంలోని వారి బంధు, బంధులకందరికీ ఆయిల్ రిఫైనరీల నుంచి స్టీల్ ప్లాంట్ల వరకూ, ఎన్టీపీసీల నుంచి ఆర్డెనెన్స్ ఫ్యాక్టరీల వరకు బంగారు పళ్ళెంలో పెట్టి తాంబూలంగా అప్పజెప్పే బాధ్యత తీసుకున్న వ్యక్తి దామోదర్ భాయ్ నరేంద్రభాయ్ మోడీ!
ఒక స్వీడిష్ మహిళా ప్రొఫెసర్ అధ్యయనాన్ని (1990-2003) కూడా మోడీసాబ్ పటాపంచాలు చేశాడు. ''పొలిటికల్ ప్రొటెస్ట్ అండ్ పాలసీ ఛేంజ్ : డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ యాంటి ప్రయివేటైజేషన్ మొబిలైజేషన్స్''లో బహుళ పార్టీలున్న ప్రజాస్వామ్య దేశం కాబట్టి కార్మిక పోరాటాలకు పాలకులు కొద్దిగానైనా తలొగ్గాల్సి వస్తోందని రాసింది ఆమె. ప్రజాస్వామ్యమనే పై'పెంకు' అలానే ఉండగా లోపలి గుజ్జంతా కరిమింగిన వెలగపండులా నేడు మారలేదా? ఈ ముప్పయేండ్ల సరళీకరణ ఆర్థిక విధానాలు మనదేశ రాజకీయ వ్యవస్థను ఈ స్థితికి దిగజార్చినాయి. కార్మికోద్యమాలైనా, ఇతర ప్రజా ఉద్యమాలైనా ఎప్పటికప్పుడు వాటి నుంచి పాలకులు నేర్చుకుంటున్నారు. కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. నేర్చుకోలేంది ప్రజలేనా?
రైతన్నలు నిజంగా 'అన్నలే!' ఈ విధానాల బారిన పడి ''బతుకు కాలి, పనికి మాలి, శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన'' వారంతా ఆనాగేటి చాళ్లను పట్టుకు సాగాలి'. అది విశాఖ ఉక్కు కోసమైనా, మరో దానికోసమైనా ఆ ఉద్యమస్ఫూర్తే అజరామరం!