Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెడకు పడ్డ పాము కరవక మానదన్నట్టు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ చట్టం రాష్ట్రాలకు ఉరితాడుగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. విద్యుత్ సంస్థలను గట్టెక్కిస్తామని తొలుత చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మెడమీద కత్తిపెట్టి కొత్త బిల్లుకు మద్దతు ఇస్తావా, ఛస్తావా? అంటూ బాహాటంగానే బెదిరింపులకు ఎగబడింది. లేకుంటే రుణాలు ఇవ్వొద్దంటూ తన పర్యవేక్షణలోని ఆర్థిక సంస్థలకు ఆదేశాలివ్వడం, రాష్ట్రాల రాజ్యాంగ హక్కులకు తూట్లు పోడవడమే. బ్లాక్మెయిల్ చేయడమే. గులాబీ ప్రభుత్వ లాలూచీ రాజకీయాల మూలంగా రాష్ట్ర ప్రజలకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పేలా లేవు. గతంలో ఉదరు స్కీంలో చేరిన నేపథ్యంలో డిస్కంలు వేలకోట్ల అప్పులపాలయ్యాయి. నష్టాలకు గురయ్యాయి. ఈ సమస్యలు కొనసాగుతుండగానే, కొత్తగా మరిన్నీ కష్టాలను మోడీ ప్రభుత్వం ప్రజల నెత్తిన తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే అనేక రూపాల్లో రాష్ట్రాల హక్కులను హరిస్తూ, జీఎస్టీ బకాయిలను సైతం సరిగ్గా చెల్లించకుండా రాష్ట్రాలను మోడీ సర్కారు ఆర్థిక దోపిడీ చేస్తున్నది. తాజా వైఖరితో రాష్ట్రంలో పేదలు కరెంటు వాడకానికి దూరం చేసే కుట్రకు పావులు కదుపుతున్నది. గ్రామీణ విద్యుత్ రంగంలో కరెంటు కనెక్షన్లకు మీటర్లు లేవనీ, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతున్నదనీ, దీంతో నిధుల కొరతతో సాంకేతికంగా అభివృద్ధిచేయలేకపోతున్నాయంటూ తీపీకబుర్లతో వాతలుపెట్టే దుస్సాహసానికి పూనుకున్నది. నిజానికి విద్యుత్ రంగంలో అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి. రైతుల కోసం అందిస్తున్న విద్యుత్ రాయతీలను రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ శాఖకు బదలాయించడం లేదు. అలాగే ప్రభుత్వ శాఖలు, పోలీస్స్టేషన్లతో సహా భారీగా విద్యుత్ సంస్థలకు బాకీలు పడుతున్నాయి. ఇదంతా నష్టాలను పెంచుతున్నది. దీంతో ఇప్పుడు సబ్సిడీ పొందే విద్యుత్ వినియోగదారులందరితో, వాడుకున్న మేరకు పూర్తి ఛార్జీలను చెల్లింపచేయాలనీ, తద్వారా కార్పొరేట్ పరిశ్రమలకు చౌక కరెంట్ను అందించేందుకే బీజేపీ కొత్త బిల్లు తెస్తున్నది. ఆ తర్వాత ప్రభుత్వ రాయితీగా ఇచ్చే మొత్తాలను ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలంటున్నది. వంటగ్యాస్ తరహా సబ్సిడీ విధానమే ఇది. దీంతో నెలనెలా స్లాబ్ల వారీగా చెల్లిస్తున్న పద్దతి అంతమవుతుంది.
తక్కువ యూనిట్లతో సరిపెట్టుకునే పేద కుటుంబాలు ఇకపై నామమాత్రపు ఛార్జీలతో కరెంటును పొందడం అసాధ్యమే కానుంది. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తూ ప్రమాదంలో పడనుంది. వినియోగదారులంతా నిర్ణయించిన గరిష్ట విద్యుత్ రేటునే ప్రతినెలా చెల్లించాలి. ఈ ధర యూనిట్కు రూ.10 పైనే ఉంటుంది. ఈ బిల్లు ద్వారా ముందుగానే చెల్లించి విద్యుత్ వాడే పద్దతి(పీపెయిడ్ మీటర్లు) అమల్లోకి రానుంది. వాడకానికి ముందే కట్టిన బ్యాలెన్స్ అయిపోగానే, కరెంటు సరఫరా ఆటోమేటిగ్గా బంద్ అవుతుంది. మళ్లీ కనెక్షన్ తీసుకోవాలంటే డబ్బు కట్టాల్సిందే. ప్రీఫెయిడ్ మొబైల్స్ మన అనుభవంలోనివే కదా! గుర్తించిన వినియోగదారుల్నీ నేరస్థులుగా పరిగణించి, కోర్టు విచారణ లేకుండానే నేరుగా జైలుకు పంపించే అధికారం ప్రభుత్వానికి కొత్త బిల్లు కల్పిస్తున్నది. ఇది రైతులు, గ్రామీణ పేదలు, చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, గృహ వినియోగదారులపై అతిపెద్ద దాడి. అదే సమయంలో ఈ బిల్లు బడాకార్పొరేట్లకు భారీగా లాభాలను పోగేస్తుంది. కాగా రాజ్యాంగ మౌలిక సూత్రమైన ఫెడరలిజానికి తూట్లు పొడుస్తుంది. మన రాష్ట్రంతోపాటు కేరళ, పంజాబ్ వ్యతిరేకిస్తున్నాయి.
కొత్త సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ గతేడాది సెప్టెంబరులోనే తీర్మానం చేసింది. ఈసందర్భంగా కేసీఆర్ 'కొత్త చట్టంతో మోడీ ప్రభుత్వం అధికారాలను వికేంద్రీకరించాల్సింది పోయి, కేంద్రీకృతం' చేయడం అన్యాయం. ఇది అత్యంత క్రూరమైన చట్టం' అని వ్యాఖ్యానించారు. కానీ, ఇటీవల వ్యవసాయ చట్టాల విషయంలో మెత్తపడటాన్ని చూస్తే భవిష్యత్లో విద్యుత్ సవరణ చట్టంపై ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారనేది ప్రశ్నార్థకమే. సొంతంగా ఉత్పత్తి చేసుకునే సాంప్రదాయ విద్యుత్ను తగ్గించి, కార్పొరేట్ కంపెనీల సాంప్రదాయేతర కరెంటును కొనుగోలు చేయాలనేది కేంద్రం షరతు. తద్వారా లాభాల మూటలను బంగారు పల్లెంలో బడాపారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టాలి. ఈ చట్టంతో క్రాస్ సబ్సిడీ పోతుంది. ప్రభుత్వ సబ్సీడీలు అసలే ఉండవు. కేంద్రం, తన ఆర్ఈసీతో రాష్ట్రాలపై పెత్తనం చేస్తుంది. ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఉన్న లోడ్ డిస్పాచ్ సెంటర్ విషయంలోనూ ఇక కేంద్రానిదే ఆధిపత్యం. రాష్ట్రాల జాబితాలోని విద్యుత్పై మోడీ సర్కారుదే పెత్తనం కానుంది. అందుకే రాష్ట్రాలపై క్రమేణా వత్తిడి అధికం చేస్తున్నది. దీనిపై రాష్ట్రాలు అప్రమత్తమై, నికరంగా పోరాడకపోతే రాష్ట్రాలకు భారీనష్టాలూ, అదేస్థాయిలో ప్రజలకు కష్టాలూ తప్పవు.