Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలకు అమెరికా ఏకైక నాయకత్వ కేంద్రంగా (యూనిపోలార్) ఉండాలనే సంకల్పాన్ని బైడెన్ తన పాలన తొలినాళ్ళనుంచే కొనసాగిస్తున్నారు. బైడెన్ విదేశాంగ విధాన లక్ష్యం అమెరికాను ప్రపంచ ఆధిపత్య స్థానంలో నిలబెట్టడంగానే ఉన్నది. ఈ విషయం ఆయన స్పష్టంగా ప్రకటించాడు కూడా! ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్, వెనెజులా లాంటి దేశాలను శత్రువులుగా గుర్తించి దెబ్బకొట్టడానికి అమెరికా అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఆమేరకు ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి.
ట్రంప్ పాలన మీద అధ్యక్ష ఎన్నికల ముందు బైడెన్, చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు గమనించదగ్గవి. ట్రంప్ నియంతృత్వ ధోరణులు గల నాయకులను కౌగలించుకుని ప్రజాస్వామ్య లక్షణాలు ఉన్న మిత్రదేశాల నాయకుల కండ్లలో పొడిచాడు. దానితో అమెరికా నాయకత్వంపై గౌరవం బాగా దిగజారింది అని శెలవిచ్చారు.
''ట్రంప్ అమెరికా ఫస్ట్ను సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నా కరోనా వైరస్ను కట్టడి చేయడంలో విఫలం కావడంలో మాత్రమే అమెరికాను మొదటిస్థానంలో నిలబెట్టాడు. అమెరికా జనాభా ప్రపంచ జనాభాలో 4శాతం ఉంటుంది. కరోనా వలన ప్రపంచంలో చనిపోయిన వారిలో అమెరికన్లు 20శాతం మంది ఉన్నారు. ఇది సిగ్గుచేట''ని బైడెన్ ప్రకటించారు. ట్రంప్ కరోనాకు కారణం చైనా అని చేసిన ప్రచారంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం దాగిఉన్నది అనేది అసలు రహస్యం. ఇప్పుడు బైడెన్ కరోనాను కట్టడి చేయడానికి పూనుకోవడంలో కూడా జీవిత బీమా కంపెనీలు, ఔషద పరిశ్రమల లాభాలు కాపాడటం కోసమే.
అమెరికా ప్రపంచ ఆధిపత్య స్థానంలో ఉండాలనే లక్ష్యంలో బైడెన్కు స్పష్టత ఉన్నది. అది సాధించడమే అమెరికా విదేశాంగ విధానంకు ఛోదకశక్తిగా ఉంటున్నది. అందుకోసం ఆయన ట్రంప్ పాటించిన విధానానికి బదులు ఇప్పుడు ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించదలిచాడు. మరోవైపున రెండు ప్రపంచ యుద్ధాలలో అమెరికా ఎలా గెలిచిందో అదే విధంగా అన్ని శక్తులు ఒడ్డి ప్రపంచంలో ఏకధృవ వ్యవస్థను ఏర్పాటుచేసి అగ్రరాజ్యం స్థానం సాధించాలన్నది తమ విదేశాంగ విధానం వ్యూహంగా ఉంటుందని బైడెన్ ''ఫారిన్ అఫేర్స్'' అనే పత్రికలో రాసిన వ్యాసమే ఇందుకు సాక్షి. ఈ వ్యూహం యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నది స్పష్టం.
చైనాలో సోషలిస్టు విజయానంతరం చైనా వ్యతిరేకత అనేది అమెరికా విధానంగా కొనసాగుతున్నది. దాన్ని ట్రంప్ కొనసాగించాడు. బైడెన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి బిల్కిన్ చైనా ఆర్థిక, సాంకేతిక, సైనిక, దౌత్య రంగాలలో పెద్ద సవాలుగా పరిణమించింది అని ప్రకటించారు. చైనాను ఎదుర్కోవాలంటే ప్రజాస్వామిక దేశాల కూటమి ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నం అయిందని బైడెన్ భావిస్తున్నారు. అప్పుడే చైనాను ధీటుగా ఎదుర్కోగలం అనే లక్ష్యంతో పావులు కదుతుపుతున్నారు. దీనికి సాంకేతికంగా ప్రజాస్వామ్య దేశాల కూటమి అని ముద్దుపేరు పెడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5జి సమాచార సాంకేతిక వ్యవస్థలతో మమేకం అవుతున్న తరుణంలో 5జి సేవలు నియంత్రించే శక్తి సంపాదించటమే ఈ నినాదం వెనుక అసలు వ్యూహం. తద్వారా ప్రపంచంలో అన్ని తన చేతుల్లోకి తీసుకుని, తనే నడపాలని, చైనాకు ఆ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంలో బైడెన్ ప్రభుత్వం తన విదేశాంగ విధానానికి రూపకల్పన చేసుకుంటున్నది. అమెరికా తన రాజకీయ, సైనిక బలంతో చైనాపై ఒత్తిడి తెచ్చి చైనా దగ్గర ఉన్న అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వశపర్చుకోవాలని చూస్తున్నది.
చైనా సాంకేతిక శక్తిని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం.. చైనా 1.4 ట్రిలియన్ డాలర్లు 5జి వైర్లెస్ నెట్వర్క్ నిర్మాణానికి కేటాయించింది. ఇంత పెద్ద మొత్తం ఇప్పటి వరకు ఏదేశం కేటాయించలేదు. చైనా ఇప్పటికే రెండులక్షల 5జీ టవర్ల నిర్మాణం చేసుకుంది. సంవత్సరం చివరికి ఐదులక్షలు ఏర్పాటు చేయనుంది. దాని అంతిమలక్ష్యం 50లక్షల టవర్లు ఏర్పాటు చేయడం. దీన్ని ఎలాగైనా అధిగమించి చైనాపై ఆధిపత్యం సాధించాలని అమెరికా చూస్తున్నది.
బైడెన్ అధికారం చేపట్టిన వెంటనే పారిస్ ఒప్పందంలో చేరుతున్నట్టు ప్రకటించడం ఒక సానుకూల పరిణామం. ఇతర దేశాల నుంచి నైపుణ్యం గల వారిని తెప్పించుకుంటేనే అమెరికాలో పనులు జరుగుతాయి. అందుకని ''వీసా'' నియంత్రణలు సరళతరం చేస్తున్నారు. ఇది ఇతర దేశాస్తులపై ప్రేమ కాదు... వారి అవసరాల నిమిత్తమే ఈ నిర్ణయం జరిగింది.
వెనెజులా విషయంలో అక్కడ ఎన్నికలు జరిపి, రాజ్యాంగాన్ని మార్చాలనీ, అప్పుడు మదురోతో చర్చిస్తామని బైడన్ షరతు పెడుతున్నారు. వెనెజులాకు అండగా ఉన్న చైనా, రష్యాను దూరం చేసి దెబ్బకొట్టాలని అమెరికా చూస్తున్నది. ప్రత్యక్ష యుద్ధం చేయకుండా హైబ్రీడ్ యుద్ధం చేయాలని సంకల్పిస్తున్నది. అంటే వెనెజులాకు అండగా ఉన్నవారిని దూరం చేసి, ఆంక్షలను మరింత తీవ్రంగా అమలు జరపడం అనే ఆయుధాన్ని వినియోగించాలని చూస్తున్నది. ఇదే పంథాను ఇరాన్లో కూడా అమలు జరపనున్నది.
అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ ఆధిపత్యం కోరుకుంటున్నది. ట్రంప్ కాలంలో ఏర్పడిన కొన్ని హెచ్చుతగ్గులను సరిచేసుకునే పనిలో బైడెన్ ఉన్నారు. ఆయన అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచంపై ఆధిపత్యం సాధించడమే.