Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో '''పెట్రోలు ధరలు పెంచితే ఊరుకునేది లేదు'' అంటూ వీధుల్లో గగ్గోలుపెట్టిన వారే నేడు 'గద్దె'మీదున్నారు. కానీ వారికి పెట్రోలు ధరలు పెంచకుండా రోజు గడవకపోవడం వైచిత్రి..! ''చమురు ధరలు మండిపోతోంటే ప్రధాని మన్మోహన్ మౌనమునిలా ఉంటే ఎలా? జీడీపీ గురించి కాదు, కామన్ మ్యాన్ కష్టాల గురించి ఆలోచించరా..?'' ఇది నాటి ప్రధానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సవాలు..! ఇప్పుడు అదే నరేంద్రమోడీ నాయకత్వంలో పెట్రోలూ డీజిలూ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతూ వందను దాటిపోతుంటే, వంటగ్యాస్ వెయ్యికి చేరువగా అంటించకుండానే మంట పుట్టిస్తోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలన్నీ ఆకాశన్నంటుతుండగా, ప్రజల ఆదాయాలు మాత్రం అడుగంటుతున్నాయి. ''ఇవేమి భారాలు మహాప్రభో'' అంటూ జనాలు విలపిస్తుంటే... ''అందంతా గత ప్రభుత్వాల చలవే'' అంటూ ప్రధాని శెలవిస్తున్నారు. వైఫల్యాలను ప్రత్యర్థులకు అంటగట్టి విజయాలను తన జేబులో వేసుకోవడంలో ఆయన మహానేర్పరి అని తెలిసినా... మరీ ఇంత అడ్డగోలుగా అబద్ధాలకు దిగజారుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి జనాలది..!
ఇప్పటికే మోడీ ఏలుబడికి ఏడేండ్లు గడిచిపోయాయి. ఇంకా ఎంతకాలం తన వైఫల్యాలకు గత ప్రభుత్వాలను సాకుగా చూపుతారు..?! 2014లో వీరు అధికారంలోకి వచ్చేనాటికి ముడిచమురు ధర బ్యారెల్కు 108 డాలర్లు. అప్పుడు దేశంలో పెట్రోలు ధర 71 రూపాయలు. ఇప్పుడు బ్యారెల్ ముడిచమురు ధర 53 డాలర్లు. కానీ లీటరు పెట్రోలు ధర దాదాపు 100రూపాయలు. సహజంగా ముడిచమురు ధర తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలుకూడా తగ్గాలి. కానీ ఇక్కడ తగ్గకపోగా విపరీతంగా పెరిగాయి..! ఎందుకు? మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు పెట్రోల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకం రూ.9.48 పైసలు. ఇప్పుడది రూ.32.98 పైసలు. డీజిల్పై నాటి ఎక్సైజ్ సుంకం రూ.3.56 పైసలు. నేడు రూ.31.83 పైసలు. ముడిచమురు ధర తగ్గినా, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడానికి కారణం ఈ పెరిగిన పన్నులే కదా..! మరి వాటిని పెంచిందెవరు? గత ప్రభుత్వమా?! ప్రధాని సమాధానం చెప్పాలి.
మొత్తం పెట్రోల్ ధరలో 14శాతం ఉన్న కేంద్రం వాటా ఇప్పుడు 38శాతానికి పెరిగింది. 17శాతంగా ఉన్న రాష్ట్రాల వాటా 23శాతానికి పెరిగింది. ఫలితంగా 2014 నాటికి పెట్రోల్ ఉత్పత్తులపై రూ.99,000 కోట్లుగా ఉన్న కేంద్ర వార్షికాదాయం నేడు రూ.2,40,000 కోట్లకు పెరిగింది. అంటే 2019-20 సంవత్సరానికి భారత ప్రజలు కేవలం పెట్రోల్ ఉత్పత్తులపైన భారత ప్రభుత్వానికి చెల్లించిన ఎక్సైజ్ సుంకం అక్షరాల రెండులక్షల నలభైవేల కోట్లు. ఇదే సంవత్సరంలో కార్పొరేట్ ఇన్కమ్టాక్స్ తగ్గించి భారత ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకూ వాణిజ్యవేత్తలకూ ఇచ్చిన రాయితీ అక్షరాల ఒక లక్షా నలభై అయిదు వేల కోట్లు. అంటే వరాలు సంపన్నులకు, భారాలు సామాన్యులకా? ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఇచ్చే రాయితీల కారణంగా ప్రభుత్వ ఆదాయాల్లో వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి కేంద్రం ఇలా ప్రజలపై భారాలు మోపుతోంది. పెట్రోలు వినియోగదారుల్లో 80శాతం సాధారణ మధ్యతరగతి ప్రజలే. అయితే ఇందువల్ల నష్టపోతున్నది కేవలం ఈ పెట్రోలు వినియోగదారులు మాత్రమే కాదు. డీజిల్ రేట్ల పెరుగుదల వల్ల రవాణా వ్యయం పెరుగుతుంది. ముఖ్యంగా అతిచౌక రవాణా సాధనమైన ప్రజారవాణా ధరలూ పెరుగుతాయి. సామాన్యులు చితికిపోతారు. మనం మార్కెట్లో కొనుక్కునే కొత్తిమీరకట్టతో సహా సమస్త సరుకుల ధరలూ పెరిగి సకల జనులకూ భారమవుతాయి.
తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లో ధరలు తగ్గిస్తామన్న నేతలు ఇప్పుడు చేస్తున్నదేమిటి? ప్రభుత్వమే ధర నిర్ణయించే పద్ధతికి స్వస్తి పలికి ప్రపంచ చమురు మార్కెట్తో అనుసంధానం చేస్తున్నామనీ, తద్వారా ప్రపంచమార్కెట్లో ధరల తగ్గుదల, పెరుగుదలను బట్టే దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా ఉంటాయని గొప్పలు చెప్పారు. వీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రపంచ మార్కెట్లో ధరలు గతం కంటే తగ్గుతూనే వచ్చాయి. కానీ ఆ ప్రయోజనాలేవీ ప్రజలకు అందకుండా ఆ మేరకు పన్నులు పెంచుతూ ప్రభుత్వం తన ఖజానా నింపుకుంటున్నది. ఇదేం రాజకీయం?! బహుశా దీన్నే ''మోడీనామిక్స్'' అంటారేమో! ''పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్న కేంద్రం, మా పంటల ధరలు ఎందుకు పెంచడం లేదు?'' అంటున్నారు రైతు నేతలు. కనీసం ఎంఎస్పీ ఇస్తామని చట్టం చేయమన్నా చేయదెందుకు ఈ ప్రభుత్వం. ఇప్పటికే కరోనా మహమ్మారి దాడిలో ఒకవైపు ఉపాధిలేమి, మరోవైపు ఆర్థికమాంద్యాల దెబ్బలకు విలవిలలాడుతున్నారు ప్రజలు. ఇప్పుడు నిత్యం ఇంధన ధరల పెంపుతో తను దెబ్బమీద దెబ్బ వేస్తున్నా ప్రజలు కిక్కురుమనడంలేదని ప్రధాని సంబరపడుతున్నారేమో... మాటలగారడీతో జనాన్ని మాయచేయగల తన నైపుణ్యానికి మురిసిపోతున్నారేమో.. కానీ, ప్రజలు నిజాలు గ్రహించలేని అమాయకులేం కాదు. కీలెరిగి వాత పెట్టడంలో వారిది చాలాగొప్ప నేర్పు.