Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మభాషల గురించి మార్కెట్కు తెలిసినంతగా పాలకులకు తెలియకపోవడం విడ్డూరం కాదు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. అమ్మభాషలో చదువుకుంటే ఉపాధి ఉండదనే స్థితికి జనాలని నెట్టివేసాయి ప్రభుత్వాలు. దరిమిలా ఆంగ్లంలో చదువుకుంటేనే బతుక్కింత భరోసా లభిస్తుందని ఆశలకు లోను చేసాయి. దీనితో రెండు దశాబ్దాలకు పైబడి తెలుగునాట ఆంగ్లం చదువులు మామూలయ్యాయి. కోట్లాది మంది పిల్లలు తేనెలొలుకు తెలుగు మాటలు నేర్చుకొని మూడేండ్లు దాటకుండానే పరాయి భాషల వల్లింపుకు కాన్వెంట్లకు తరలింపబడటం చేదు నిజం. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ తమ భాష తమకు వద్దు అనే విపత్కర పరిణామం నెలకొనలేదు. కేవలం తెలుగునాట మాత్రమే తెలుగువద్దు ఆంగ్లమే ముద్దు అనే స్థితి రాజ్యమేలడం మనం చూస్తున్న నిజం.
అయినా ఏటేటా మాతృభాష దినోత్సవాలు (ఫిబ్రవరి 21) జరుపుకోడం ఆనవాయితీ. గిడుగు పేరుతోనో, కాళోజీ పేరుతోనో తెలుగు భాష ప్రాశస్త్యం గురించి చెప్పుకుంటారు. ఈవిధంగా ఏడాదికి ఒకటీ రెండుసార్లు తెలుగు భాషకు తద్దినం పెట్టడం తెలుగువారి నవ్య సంప్రదాయమైంది. అందుకని ఇక్కడ ఆంగ్లంలో తెగ చదివేసుకొని ఆంగ్ల భాషా పండితులయిన వారు ఎవరూ లేరు. ఏ తెలుగువాడు కూడా అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన కవిత్వమో, కథలో, నవలలో రాసిందీ లేదు. అటు తెలుగు, ఇటు ఇంగ్లీషు సరిగా రాని తెలుగువాళ్ళను తయారు చేసిపెట్టాయి మన చదువులు. అమెరికాలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా అమ్మపలుకును మరవలేరు. కానీ అమ్మభాషలో మాత్రం చదువులు వద్దు అనుకుంటున్నారు.
అయినా ఇవాళ మాతృభాష దినోత్సవ వైశిష్ట్యం గురించి చిలకపలుకుల వల్లింపు వినిపిస్తుంది. అమ్మభాష మాధుర్యం ఎనలేనిదంటూ ఉపన్యసిస్తారు. కపటత్వం తమ జీవనశైలిలో అంతర్భాగం చేసుకోడం తెలుగువారి దౌర్బల్యం. భాష విషయంలో ఇది స్పష్టాతిస్పష్టం. ఇంటర్మీడియేట్లో సంస్కృత భాషని రెండేండ్లు చదువుతారు- కేవలం అత్యధిక మార్కులకోసం. మొక్కుబడిగా సంస్కృతాన్ని వల్లెవేస్తారు. అలాగే ఇంగ్లీషు మాధ్యమాన్ని స్వీకరించినప్పటికీ ఆ భాషని నేర్చుకోవాలనే తపన కనిపించదు. ఇక ఒక సబ్జక్టుగా ఉన్నప్పటికీ తెలుగును సరిగా నేర్పే దృష్టికోణం లేదు. ఈవిధంగా భాషల పట్ల నిర్లక్ష్యం మన విద్యావ్యవస్థని పట్టిపీడిస్తున్నది. ఆంగ్లం మీద మోజే తప్ప ఆ భాష మీద మమకారమేమీ లేదు. అసలు ఏ భాష పట్ల కూడా ఎవరికీ శ్రద్ధ లేదు. అయినా తెలుగులో చదువుకుంటే బతుకు లేదని, ఆంగ్లం బువ్వ పెడుతుందని విశ్వసిస్తారు.
పాలకులకు ఒక భాషావిధానమంటూ లేదు. తెలంగాణ ఉద్యమ కాలాన తెలంగాణ భాష గురించి గొంతు చించుకున్నారు. అధికారంలోకి వచ్చాక తెలుగు భాషకు సమాధికట్టే చర్యలనే తెలంగాణ పాలకులు అనుసరిస్తున్నారు. నూతన విద్యావిధానంలో మాతృభాషలో అయిదో తరగతివరకు, ఇంకా చెప్పాలంటే ఎనిమిదో తరగతి వరకు మాతృభాషల్లోనే చదువులు కొనసాగాలని నిర్దేశించినట్టు తొలుత ప్రచారమయింది. తెలుగు భాషా ప్రేమికులు సంబరపడ్డారు. కానీ ''కుదిరిన పక్షంలో, వీలయిన పక్షంలో'' మాత్రమే మాతృభాషల్లో బోధించవచ్చునని చెప్పారు. తెలుగునాట పాలకులకు కుదరదు, కనుక ఇక్కడ నిక్షేపంగా ఆంగ్లంలోనే చదువులు కొనసాగుతాయి.
అమ్మ భాషల ప్రాధాన్యం గుర్తించే శక్తి, ఇచ్ఛ పాలకులకు లేదు, కానీ మార్కెట్కు ఉంది. అందుకే అమెజాన్.కాం కూడా తెలుగులోనే ఆర్డర్లు తీసుకోడానికి ముందుకు వచ్చింది. నెట్ఫ్లిక్స్ లాంటి వేదికల్లో ఆంగ్లభాషా చిత్రాలు, వెబ్ సిరీస్లు తెలుగులో డబ్బింగ్ అయి తెలుగువారిని అలరిస్తున్నాయి. హర్షద్మెహతా మీద వెబ్సిరీస్కు తెలుగునాట లభించిన ఆదరణ అంతాఇంతా కాదు. ఎందుకంటే అది తెలుగు డబ్బింగ్లో ఉండటమే కారణం. అనేక కార్పోరేట్ కంపెనీల ప్రకటనలు తెలుగులో అందంగా ముస్తాబయి ప్రసారమవుతుంటాయి. 'అమ్మ పలుకు'లో చెబితే మనసుకు హత్తుకుంటుందనే మంత్రం వారికి తెలుసు. కనుక కోట్లాదిమంది తెలుగువారి మనసునీ, డబ్బునీ సొమ్ము చేసుకోడానికి వాణిజ్యప్రకటనలన్నీ తెలుగులో ఉంటాయి. అనేకానేక హాలీవుడ్ చిత్రాలు, ఆంగ్లంలో ప్రసిద్ధి చెందిన పుస్తకాలు తెలుగు అనువాదాలతో వస్తున్నాయి. తెలుగు నుడికారంలో చెబితే ఉండే అందం వేరు. కనుకనే వజ్రాల ప్రకటనలు, బీమా పాలసీలు, సబ్బులు, కార్లు, బట్టలు ... ఒకటేమిటి సకలం తెలుగులోనే వినిపించడం, కనిపించడం మహత్తు కాదు, మార్కెట్ వాస్తవికత. తెలుగుభాషకు ఉన్న డిమాండ్కు నిదర్శనం.
బోధనా మాధ్యమంగా తెలుగుని అంగీకరించరు. అయినప్పటికీ అమెరికాలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా, తెలంగాణలో తిరుగాడుతున్నా మన మాటలు, నవ్వులు, ఏడ్పులు అన్నీ తెలుగులోనే. అమ్మభాషని వదలాలన్నా వదల్లేరు. అంతటి శక్తివంతమైన తెలుగు భాషలో మాత్రం చదువులు అక్కర్లేదు అనే నిర్ణయాలకు పాలకులకు వచ్చి, అందుకు ప్రజల ఆమోదం పొందడం విరోధాభాస. మాతృభాష దినోత్సవం 21 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఆరంభమైంది. ఈ సరికొత్త మిలీనియంలో ఏండ్లు గడుస్తున్నకొద్దీ తెలుగు చదువులు నీరసించిపోవడం పాలకుల నిర్వాకం ఫలితం. నిజంగా ఆంగ్లంలో చదువుకుంటే బతుక్కి ఢోకా లేదనుకుంటే ఎందుకింత నిరుద్యోగం? లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు రోడ్డున పడి ఎందుకు రోదిస్తున్నారు? ఆంగ్లాన్ని నమ్ముకున్న అమ్మలు, అయ్యలు - గద్దెలెక్కిన పెద్దల్ని ఈ ప్రశ్నలతో నిలదీయండి. అమ్మభాషల దినోత్సవమే ఇందుకు తగిన సందర్భం, సన్నివేశం!