Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేధావులు, మీడియా ప్రశ్నించడం మానేస్తే సమాజం నష్టపోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నదదే. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పాలన ప్రశ్న గొంతుపై కాలుపెట్టి సాగుతున్నది. ప్రజలు, ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నాయి. తప్పును తప్పు అని చెప్పడమే ఇప్పుడు నేరమైంది. ఆ గొంతు పెగలకుండా విషపు గుళికలు వేసి పబ్బంగడుపుకునే పనిలో పాలకపక్షాలున్నాయి. మార్చి 14న రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ గోబెల్స్ ప్రచారానికి ఒడిగట్టాయి. ప్రజాసమస్యలను ఎజెండా కాకుండా అడ్డుకుంటున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవతలివాళ్ల మీద బట్టకాల్చి మీదేసే దుష్టకార్యానికి ఎగబడ్డాయి. ప్రజావ్యతిరేక విధానాలపై చర్చ జరగకుండా, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలకూ మతోన్మాద రంగును పులుముతూ ఓట్లేయించుకునే దుస్థితికి దిగబడ్డాయి. రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. వాటిలో మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్, ఖమ్మం-వరంగల్-నల్లగొండకు వచ్చేనెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వతంత్ర అభ్యర్థులూ బరిలో నిలిచారు. అసలు ఎన్నికలను 'ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్'గా (ఆలోచనల పండుగ) భావిస్తారు. ప్రచారం అంటే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య తిట్ల పురాణం కాదు. రొచ్చు మాట్లాడి రచ్చ చేయడం అంతకన్నా కాదు. ప్రజలకు తామేమీ చేస్తామో చెప్పడం. తమ ఆలోచనలు, భావనలను వారి ముందుంచటం. విద్యావంతుల మెప్పు పొందటం. ఉపాధి అవకాశాల కోసం తామేమీ చేస్తారో తెలియజేయడం. ఉద్యోగ భద్రతకు పాటుబడబోయే చర్యలను ప్రస్తావించడం. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన సొమ్ములపై చర్చించడం. సెస్సుల పేర నేడు ఆర్థికంగా కేంద్రం బలోపేతమవుతూ, రాష్ట్రాలను పాలకప్రభుత్వాలు ఎండబెడుతున్న వైనాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడం. జీఎస్టీ బకాయిలు, ఆర్థిక సంఘాల నిధులను రాబట్టేందుకు ఏం చేస్తారో చెప్పడం. ముందు రాష్ట్రంలో దాదాపు 16 లక్షలుగా ఉన్న గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల కష్టాలను తీర్చడం కోసం, లక్షకుపైగా ఉన్న ప్రయివేటు టీచర్ల ఇబ్బందులను పరిష్కరించడానికి ఏమీ చేస్తారో చెప్పాలి. అంతే తప్ప మాటల కబడ్డీ ఆడితే లాభం లేదు. విధానపరమైన చర్చకు ఆస్కారమివ్వకుండా, వ్యక్తుల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శల వ్యవహారంగా ఎన్నికల ముఖచిత్రాన్ని తయారుచేయడం ఎంతమాత్రం సహించరానిది. ఈ తరహా రాజకీయాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ గ్రాడ్యుయేట్లు అనుమతించకూడదు. సహించకూడదు. సాధారణ ఎన్నికలు కావివి. విజ్ఞానవంతులైన పట్టభద్రులకు పరీక్షా సమయమిది. వారి లౌక్యం, మేథస్సుకు పెనుసవాల్. తమ సమస్యలను చట్టసభలో ప్రస్తావించి పరిష్కారం కనుగోనే సాధనమీ ఎన్నిక. కాగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల భావోద్వేగాలను సొమ్ముచేసుకోవడానికి అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలతో తమ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి. భయంకరమైన విష ప్రచారంతో వ్యక్తులపై మానసిక దాడికి దిగాయి. కార్మిక కోడ్లు, వ్యవసాయ చట్టాల నుంచి విద్యుత్ బిల్లు వరకూ, పెట్రోల్, డీజిల్ ధరల నుంచి కొత్త ఉద్యోగాల వరకూ ఎన్నో సమస్యలు రాష్ట్ర ప్రజల ముందున్నాయి. వీటి గురించి అభ్యర్థులు నోరిప్పాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు ఆ సమస్యలపై తమ పార్టీల వైఖరేమిటో చెప్పి పట్టభద్రులను మెప్పించి ఒప్పించాలి. ఒక ఎమ్మెల్సీ పరిస్థితినంతా మార్చలేకపోవచ్చు. కానీ, ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించు 'అంకుశాలు' అవసరం. మండలి సభ్యత్వం హోదా కాదు. ప్రజల గొంతుకై నిలవాలి. నిలిచి పోరోడాలి, పోరాడి హక్కులు సాధించాలి. విద్యావంతులు డబ్బులు, ఇతర ప్రలోభాలకు గురై ఓటేస్తే ఇక సమాజానికి చీడపట్టినట్టే. బాధితుల పక్షాన నిలబడి వారి గొంతును చట్టసభలో పటిష్టంగా వినిపించగల సమర్థనేతను అక్కడకు పంపాలి. ప్రశ్నించాల్సిన మీడియా తన పాత్రను విస్మరిస్తున్నది. కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మయింది. వారి వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నది. ఇటు పత్రికలు, అటు ఛానెళ్లల్లోనూ సామాన్యుల అవస్థలకు స్పేస్(స్థానం) లేకుండా పోయింది. అందుకే ప్రజలు మీడియాను అనుమానంగా చూస్తున్నారు. ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాను ఎంచుకున్నారు. విశ్వసనీయతకోల్పోయిన మీడియా ప్రజలు, బాధితులు, అసహాయుల పక్షాన గర్జించడం పోయి, మిన్నకుంటున్నది. చేతులెత్తేసింది. సమాజంలోని చెడుకు చెడ్డవారు కారణం కాదు, మంచివారు మౌనంగా ఉండటమే ప్రధాన సమస్య. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక ప్రతిపక్షం ప్రజలపక్షం. ఈ అసాధారణ పరిస్థితుల్లో శాసనమండలికి నిజాయితీ, నిబద్ధతతో నిజంగా ప్రాతినిథ్యం వహించే, ప్రశ్నించే నేతలను పంపడం ప్రజల తక్షణ కర్తవ్యం కావాల్సి ఉంది.