Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విషయం మన రాష్ట్ర రాజకీయ పార్టీలన్నిటికీ బాగా ఇంకిపోయినట్టుంది. బై ఎలక్షన్ అయినా, రొటీన్గా నింపే శాసన మండలి స్థానాలైనా ప్రస్తుతం తెలంగాణలో జరిగే తంతు పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. పాలక పార్టీలు, అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నట్టే ఉంటుంది. ఎవరికీ చిన్న గాయం కూడా కాదు. సంధించే విమర్శలు, ప్రతి విమర్శలు పరిశీలిస్తే ''విధానాలు'' పక్కకు పోయి ''నీది కుటుంబ పాలన'', ''నీది అబద్ధాల కుప్ప'', ''నీది అవినీతి పుట్ట'' వంటివి రోజు పత్రికలు తిరగేస్తే తారసపడే మాటలు. పైమూడు పార్టీల నిఘంటువుల్లో ఇటువంటివి కావల్సినన్ని! అందుకే ఇది డొంక తిరుగుడు ప్రచారం!
అందరిదీ ఒకే విధానమైన పుడు, ఆ విధానంపై అందరికీ ఏకాభిప్రాయము న్నపుడు అసలు విషయాలపై చర్చ వెనక్కి పోవడం సహజం. 1991లో పీవీ నరసింహారావు ప్రారంభించిన విధానాన్నే తాను కొనసాగిస్తున్నానని మోడీ నిరంతరం చెప్తూండటం మనం వింటూనే వున్నాం. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం మెల్లిగా మొదలైంది పీవీ- మన్మోహన్ల హయాంలోనే. యునైటెడ్ ఫ్రంట్ కాలంలో కొద్దిగా నెమ్మదించింది. వాజ్పారు సర్కార్ కాలంలో జర్ర స్పీడ్ పెరిగింది. హిందూస్థాన్ జింక్, బాల్కో ఇండియన్ పెట్రో కెమికల్స్, మోడరన్ ఫుడ్స్, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్, పారదీప్ ఫాస్ఫేట్, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండు హోటల్స్, ఐ.టీ.డీి.సీకి చెందిన 17 హోటల్స్ను వాజ్పారు పాలనలోనే ప్రయివేటీకరించారు. యూపీఏ-2 కాలంలో వేగం పెరిగి, మోడీగారి 2వ దశలో విశ్వరూపం చూపుతోంది. తాజాగా మోడీ మొత్తం ప్రభుత్వ రంగాన్ని వదిలించుకుంటానని స్వయంగా నీటి ఆయోగ్ మీటింగ్లో ప్రకటించారు.
దీనికి కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ఏ అభ్యంతరమూ ఉన్నట్టు లేదు. కనీసం ఉన్నట్టు ప్రకటన కూడా చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని సహకార నూలు, చక్కెర మిల్లులను చంద్రబాబు మడిచి ప్రయివేటు వారి నోట్లోకి జారవిడుస్తున్నపుడు కేసీఆర్ తెలుగు దేశంలో అంతర్భాగం. ఆ ప్రక్రియను వ్యతిరేకించిన దాఖలాల్లేవు. తెలం గాణ వచ్చిన తర్వాత నిజాం షుగర్స్కు నూతన 'శోభ' కల్పిస్తామంటే నమ్మిన జనం బ్యాలెట్ బాక్స్లు నింపారు. తనయ పార్లమెంటు సభ్యురాలైంది. తాజాగా వారి హాలత్ ఏంటో మొన్న పాదయాత్ర చేసిన యాభై జతల కాళ్ళనడిగితే తెలుస్తుంది.
ప్రస్తుతం మన రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న తమాషా చర్చ నువెన్ని ఉద్యోగాలిచ్చావంటే, నువ్వెన్ని ఇచ్చావని! 2014నాటికే దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగం మోడీని సింహాసనాధీశుని గావించిందన్న విషయం నిర్వివాదాంశమే! మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలు ఉపాధి అవకాశాలను పెంచలేదు. మాంద్యం ముప్పిరి గొంటూంటే, ఉన్న కొలువులూ ఊడి కార్మికులు నిరుద్యోగులయ్యారు. పులి మీద పుట్రలాగా కరోనా మహమ్మారి పంజా విసిరింది. పదకొండు కోట్లమంది వలస కార్మికులు కొలువులే కాక నెలవులూ తప్పి వీధుల్లోకి విసిరేయబడ్డారు. దీన్నే ఈపీిడబ్ల్యు సంపాదకీయంలో ''ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందన్న దాన్ని అంగీకరించకపోవడం గత బడ్జెట్ ప్రత్యేకతైతే, కోట్లాది అసంఘటిత వలస కార్మికులు కరోనా వల్ల ఉపాధి పోయి వారి వారి గ్రామాలకు మళ్లారనే విషయాన్ని అంగీకరించకపోవడం తాజా కేంద్ర బడ్జెట్ ప్రత్యేకత'' అని రాశారు. ఈ దశలో గ్రామీణ ఉపాధికి 34.5 శాతం నిధులను తెగ్గోయడం దారుణం కదా! దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న తీరిది. వ్యవసాయాన్ని ముట్టుకోకుండా పారిశ్రామిక, సేవారంగాల పరిస్థితి ఇది. వ్యవసాయం పరిస్థితి మరీ దారుణం. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి. అసలీ విషయాలు టీఆర్ఎస్ నోట్లోంచి వస్తే కదా దీనిపై చర్చ జరగడానికి!
తెలంగాణ సాధనోద్యమంలో పాల్గొన్న యువత స్వరాష్ట్రంలో ఉపాధి తప్పక దొరుకుతుందనే భరోసాతో ఉన్నారు. లేబర్బ్యూరో తాజా లెక్కల ప్రకారం జాతీయ నిరుద్యోగిత రేటు 21.6 శాతం ఉంటే తెలంగాణలో 33.9 శాతం ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెలువరించి, తొడగొడుతున్న అంశం గత ఆరేండ్లలో 1,32,899 ఉద్యోగాలిచ్చామనే! వీళ్లిద్దరూ కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 30వేలు, పోలీసు ఉద్యోగాలు 32వేలు తప్ప మిగతావి వందల్లోనే. ప్రభుత్వం ఘనంగా ఊదరగొడ్తున్నట్టు విద్యుత్ శాఖలోని ఆర్టిజాన్లు తాము రెగ్యులరైజ్ అయినట్టు భావించడం లేదు. అదే పరిస్థితి పంచాయతీ కార్యదర్శులది కూడా! చదువుకున్న వారిలో నిరుద్యోగం బాగా ఎక్కువున్న రాష్ట్రాల్లో మన తెలంగాణ ఒకటి. పీవీ ప్రారంభించి మోడీ ఉధృతం చేసిన ఈ ఆర్థిక విధానాన్ని వ్యతిరేకిస్తేనే ఉపాధి అవకాశాలను ఒక మేరకైనా పెంచగలుగుతారని కెసిఆర్/కెటీఆర్లు గుర్తిస్తే మంచిది. ఆ దారే తొక్కితే వారు చేరిన చోటుకే చేరతారనే లాజిక్ మిస్ అవుతారు.