Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్రం 73వసంతాలు పూర్తిచేసుకున్న వేళ.. దేశం ఒక భయానక వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. రాజ్యం ఇప్పుడు అభిప్రాయాల చుట్టూ ఆంక్షల వల విసురుతోంది. ఆలోచనల చుట్టూ కుట్రల ఉచ్చు బిగిస్తోంది. అవును.. గాయపడిన హృదయాలను ఓదార్చడం నేరమిక్కడ... మూగబోయిన గొంతులకు మాటలివ్వడం నేరమిక్కడ... పట్టెడు మెతుకులకోసం, పిడికెడు ఆత్మగౌరవంకోసం తాపత్రయపడటం కూడా నేరమే ఇక్కడ.. అందుకే ఇక్కడ 'సేచ్ఛ' ముళ్లకంచెల మధ్య చిక్కుకుని దేశం విలవిలలాడుతోంది. ఈ నిజాన్ని మరింత ఎత్తి చూపుతూ వెలువడింది ''ఫ్రీడం ఇన్ ది వరల్డ్ 2021'' అనే తాజా నివేదిక. అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ''ఫ్రీడం హౌజ్'' సంస్థ అనేక అధ్యయనాలు చేసి ప్రకటించిన ఈ నివేదిక, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అడుగంటుతున్న ''స్వేచ్ఛ''కు అద్దం పడుతోంది.
''నరేంద్రమోడీ అధికారంలోకొచ్చాక భారత్లో పౌరహక్కుల దురాక్రమణ క్రమానుగతంగా సాగుతోంది. మోడీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం హక్కుల సంఘాలు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతోంది'' అంటూ తన అధ్యయనాల సారాన్ని స్పష్టం చేసిందీ నివేదిక. ఒకవైపు ఈ నివేదిక వెలువడుతుండగానే మరోవైపు గుజరాత్లో ఆర్టీఐ కార్యకర్త అమ్రాభారు బొరిచా దారుణహత్య జరిగింది. త్రిపురలో వామపక్షనేత, మాజీ మంత్రి బాదల్ చౌదరిపై కిరాతక దాడి జరిగింది. ఈ రెండు ఘటనలూ ఈ నివేదిక ఎంత నిజమో నిరూపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్లో ''స్వేచ్ఛ పాక్షికమే'' నంటూ కుండబద్దలు కొట్టిందీ నివేదిక. 211 దేశాలలో అనేక అంశాలను పరిశీలించిన ''ఫ్రీడం హౌజ్'' మేథో బృందం మన దేశానికిచ్చిన స్థానం 88. గత సంవత్సరం 83వ స్థానంలో ఉన్న భారత్ ఈ సంవత్సరం 88వ స్థానానికి చేరడం దిగజారుతున్న మన ప్రజాస్వామిక ప్రమాణాలకు సూచిక.
''మోడీ 2019లో తిరిగి ఎన్నికయ్యాక ఈ హక్కుల హననం మరింత తీవ్రంగా మారింది'' అంటూ ఈ నివేదిక పేర్కొనడం ఇక్కడ గమనార్హం. మేథావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులే ఇందుకు లక్ష్యం కావడాన్ని కూడా ఇది ఎలుగెత్తింది. నిజమే కదా! రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటమే నేరమన్నట్టుగా మారింది పరిస్థితి. సొంత అభిప్రాయాలు కలిగివుండటం, వాటిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం ప్రజలందరి హక్కు. ఈ అభిప్రాయాలతో ప్రభుత్వాలు విబేధించవచ్చుగాక, కానీ.. భావస్వేచ్ఛ నోరునొక్కడం, ఆలోచనలను వేధించడం, నిర్బంధించడం చేయకూడదని భారత రాజ్యాంగమే నిర్దేశిస్తున్నది. కానీ, ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, ప్రజల హక్కులను హరిస్తూ, ప్రజాస్వామిక భావనలను విలువలను ఛిద్రం చేస్తోంది మోడీ ప్రభుత్వం. రాజకీయాల్లో అసలు భిన్నాభిప్రాయాలకే తావులేకుండా కుతంత్రాలకు పాల్పడుతోంది.
ఫలితంగా అభిప్రాయాలు ప్రకటించడం, అన్యాయాన్ని ప్రశ్నించడమే కాదు.. సమానత్వాన్ని కాంక్షించడం, స్నేహ హస్తాన్ని అందించడం కూడా దేశద్రోహమే అయిందిక్కడ. అంతరాలు, అసమానతలను చెరిపేయాలనుకోవడం రాజ్యం దృష్టిలో నేరం. మనుషులంతా ఒక్కటేనని చాటే విశ్వమానవ ప్రేమ కూడా నేరమే. అందుకే ఇప్పుడు ప్రేమ కూడా రాజద్రోహమే. ఇంకా చెప్పాలంటే... వాళ్లు - మనం అనే భాష నేర్వని వాళ్లంతా దేశద్రోహులే. వాళ్లు.. అంటే ఎవరు? వాళ్లు అంటే మనవాళ్లు కాదని అర్థం. వాళ్లు మన మతస్థులు కారు.., మన దేశస్థులు కారు. మన పార్టీవాళ్లూ , మన రంగువాళ్లూ కారు. వాళ్ల అచారాలూ విశ్వాసాలూ వేరు. వాళ్లని దుస్తుల్ని బట్టి గుర్తించవచ్చు. వాళ్లకు అర్బన్ నక్సల్స్, అక్రమ చొరబాటు దారులు, జాతి వ్యతిరేకులు ఇలా ఇంకా చాలా పేర్లున్నాయి. ఈ విద్వేష భాషను వంటబట్టించుకోని వాళ్లంతా ఇప్పుడు దేశద్రోహులే. కాదు, కూడదు నాస్వేచ్ఛా స్వాతంత్య్రాలంటే చెరసాలలు స్వాగతం పలుకుతాయి.
ఎందరో సంపదకు నెత్తురు ధారపోస్తూ ఆకలిని మోస్తుంటే.. కొందరు మాత్రం ఆ కష్టాన్ని హరిస్తూ కరెన్సీని పండిస్తున్న కాలం కదా..? ఈ ఘోరాన్ని ప్రశ్నించే హేతువు, తర్కం, సమతా భావనలు మొలకెత్తినప్పుడల్లా అధికారం, పెట్టుబడి, మత మౌఢ్యం ఎప్పుడూ ఏదో ఒకరూపంలో స్వేచ్ఛను బంధించాలనే చూస్తాయి. ఈ బంధనాలను ఛేదించేందుకు, ఈ సమాజాన్ని నిద్దురలేపేందుకు ఎవరు ఏ ప్రయత్నం చేసినా వాళ్లు దేశద్రోహులే అవుతారిక్కడ... అయితే ఈ స్వేచ్ఛారహిత జీవితాన్ని ఏ సమాజమూ ఎంతో కాలం భరించదు. కనీస హక్కులను కలగనడమే నేరమైనప్పుడు ధిక్కారమే దిశ దిశలా ప్రజ్వలిస్తుంది. అప్పుడు ఎంతటి పీఠాలైనా కూలిపోక తప్పదు... కాబట్టి ఈ నివేదిక నేటి ఈ వర్తమానానికి సూచికే కాదు, భవిష్యత్తుకూ ఓ హెచ్చరిక.