Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు తుమ్మితే బొమ్మలు, అమ్మమ్మలు ''శతాయుష్షు'' అని దీవించడం విన్నాం. (విననివారు ఆ మధ్య వచ్చిన ఒక బ్లాక్ బ్లస్టర్ సినిమాలో మహేష్బాబు నిర్వహించే క్విజ్ చూడండి!) అంతేగాని తుమ్మిన పెద్దవాళ్ళు ''నాకు వందేండ్లు'' అనుకోవడం విడ్డూరమే కాదు, వికారంగా కూడా ఉంటుంది. ఏమైనా అది వ్యక్తులకు చెల్లుబాటయ్యే విషయం. ప్రభుత్వాలకు కాదు. సరళీకృత ఆర్థిక విధానాల సునామీలో దేశమంతా కొట్టుకుపోతూంటే మన రాష్ట్రం మాత్రమే ఒక ''సంక్షేమ ద్వీపం''లా, నాలుగుకోట్ల మందికి ''వెలుగు నిచ్చే దీపం''లా నిలవడం సాధారణ పరిస్థితిలో అసాధ్యం. దానికి ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథముండాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికుండాలి. అవి ఈ రాష్ట్ర ప్రభుత్వానికున్నాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!
''మావూరి మిరియాలు తాటికాయంతున్నాయ''ని చెప్తే నమ్మడానికి మన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కార్మికులు, రైతులు చెవుల్లో పూలుపెట్టుకుని, నోట్లో వేళ్లు పెట్టుకుని కూర్చోలేదని మన రాష్ట్ర పాలకులు ఎంత తొందరగా గుర్తిస్తే అంతమంచిది. తెలంగాణ రాష్ట్రంలోని వేతన జీవుల్లో 98శాతం అసంఘటితంగానే ఉన్నారు. లేటెస్ట్ భాషలో వీరందర్నీ ''జిగ్'' కార్మికులంటున్నారు. ఇటువంటి వారితో నడిచే ఆర్థిక వ్యవస్థను ''జిగ్ ఏకానమీ'' అంటున్నారు. ఈ ఆరేండ్లలో ''చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు'' నింపేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తమకు తామే దీవించుకుంటోంది. భజన మాత్రమే 'తక్షణ కర్తవ్యంగా' పెట్టుకున్నవారికి అది బానే ఉండవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు ఎబ్బెట్టుగా ఉంటోంది.
పైగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రంలోని పారి శుధ్య కార్మికులు ''అడగకముందే, వారితో సహపంక్తి భోజనం చేసి మరీ జీతాలు రెట్టింపు చేసిన''ట్టు 'బాకా'లో ఊదితే రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లలో పనిచేసే 36వేల మంది పారిశుధ్య కార్మికులు తమకు ఎప్పుడు పెంచారు? తాము పారిశుధ్య కార్మికులం కామా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పైగా పంచాయతీగా ఉన్నప్పుడు 16-20వేల రూపాయల వేతనం ఎత్తుకున్న పంచాయతీ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్లో కొచ్చి రూ.12వేలే జీతం అందుకోవడం విధి వైపరీత్యమా? ఏలినవారి చేతకాని తనమా? పైగా మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు సమ్మెల మీద సమ్మెలు చేసి ఇది బదిరాంధక ప్రభుత్వమని ఎలుగెత్తి అలసి, సొలసిన తర్వాతగాని వారి వేతనాలు పెంచారన్న విషయం ఈ పాలకులకు ఎవరు అర్థం చేయించాలి? ఇదే పరిస్థితి ఆశాలది. పైగా అడక్కుండానే వేతనాలు పెంచారనడం పుండు మీద కారం జల్లడం కాదా?
ప్రభుత్వ ప్రత్యక్ష దర్శకత్వంలో నడిచే ''బాకా'' కథలు ఇటీవల చాల రక్తి కట్టిస్తున్నాయి.అటువంటి ఒక ''సంక్షేమద్వీపం'' మయసభనే మనముందు ఆవిష్కరించింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపచేయడానికి ప్రముఖ ఇంద్రజాలికుడు ప్రొఫెసర్ పట్టాభిరామ్ వీరిముందు బలాదూరే! టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తేనె ప్రవహిస్తున్నట్టు 'బాకా'లో ఊదారు.ఈ రెండేండ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం లైన్లో నిలబడి, పడి చనిపోయిన ఇద్దరు రైతుల విషయం మనకు గుర్తుండదని వీరి ఆశ. కల్తీ ఎరువులు, విత్తనాల వల్ల ఏటా 4-5 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వమే తయారుచేసిన నివేదికలు మనం చూడవద్దని వీరి అభిప్రాయం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కల్తీ విత్తనాల విషయంలో 220 కేసులు నమోదు చేసి ఇప్పటిదాకా ఎవర్నీ ఎందుకు శిక్షించలేదని మనం అడగద్దు. నిషేధింపబడిన విత్తనం ''గ్లే పోసేట్''ను ఆరు లక్షల ఎకరాల్లో విత్తించిన ఘనతవహించిన ఈ సర్కార్ ఎందుకు అనుమతించిందో కారుసారు ''బాకా''కు అనవసరమైనా రాష్ట్ర ప్రజలకు అవసరం. తెలంగాణలో 59లక్షల మంది రైతులకు గాను 31లక్షల మందికే రైతు బీమా ఎందుకు వర్తిస్తోందో ఎవరు సమాధానం చెప్పాలి? రైతుబంధును తన్నుకుపోతున్న రాబందుల గురించి రైతులు, రైతు సంఘాల అరిగోస అరణ్యరోదనగా మిగలాల్సిందేనా?
నయా ఉదారవాదాన్ని నెత్తికెత్తుకున్న తర్వాత పాలకుల రాజకీయాల్తోగాని, వారి కుల, మతాల్తోగాని ఆ విధానాలకు ఖాతరుండదు. ఆ విధానాలకు ''లాభమే'' గీటురాయి. దానికి ''హృదయ''ముండదు. 250 మంది తోటి భారతీయ రైతులు ఆహుతవుతున్నా మోడీ గుండె బండబారిపోవడానికి కారణం ఆ విధానాల పరిష్వంగమే తప్ప ఆయన వ్యక్తిగత కర్కశత్వం కాదు. ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ విధ్వంసక మార్గాన్నే ఎంచుకుంది. ఆ ఆర్థిక విధానమే రాజకీయ చెలికాళ్లను దగ్గరజేస్తుంది. ఈ విధానానికి ''మానవీయ హృదయ'' ముంటుందనే 'బాక' ఆశ పేరాశే! రాష్ట్రంలోని 6700 కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ ప్రభుత్వం పడావు పెట్టింది కచ్చితంగా ఆ విధానాల కౌగిలింతలో పులకిస్తూనే!
కొలువులివ్వని వారికి సైతం ఇచ్చినట్టు భ్రమింపచేయడం, ''పిల్లలకు కడుపునిండా పోషకాహారం అందిస్తున్నా''మనుకోవడం, ''రోగులంతా సర్కారు దవాఖానాలకే పోతున్నారని'' భ్రమించడం వంటి పిచ్చి ప్రేలాపనలు ''బాకా''లో ఊదనివ్వడం ఆశ్చర్యమే. రాజుగారికి బట్టల్లేవనే మాట ఎవరు చెప్పాలి..?!