Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆజాదీనీ సమాధిచేస్తూ అమృత మహౌత్సవాలు చేస్తారట..! ఇప్పుడు దేశం ఎలా ఉందీ..? స్వాతంత్య్రం మనుగడ కోల్పోతుంటే పువ్వులు పూయాల్సిన కాలం ఆకులు రాలుస్తోంది. ''ఒక్కరిపై దాడిచెరు, వందలు, వేలమందిని భయభ్రాంతులకు గురిచెరు...'' అన్నది ప్రభుత్వానికి ఓ విధానంగా మారిపోయింది. ఎక్కడ ఏ చిన్న భిన్నాభిప్రాయం వ్యక్తమయినా రాజ్యం విపరీతమైన అభద్రతకు గురవుతోంది. ప్రశ్న ఎక్కడ ఏ రూపంలో తలెత్తినా వెంటనే అణచివేతలకు పూనుకుంటోంది. దర్యాప్తు సంస్థలన్నీ తమ స్వతంత్రతను కోల్పోయి ఈ కుతంత్రానికి సాధనాలవుతున్నాయి. బాలివుడ్ ప్రముఖులు అనురాగ్ కాశ్యప్, తాప్సీలపై జరిగిన సోదాల ఉదంతాలు ఈ పరంపరకు తాజా ఉదాహరణలు మాత్రమే. నిజంగానే అక్రమాలకు పాల్పడిన వారిపై దాడులకు పూనుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండాల్సిన పనిలేదు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ దుర్నీతిని ప్రశ్నించినవారిపైనా, ప్రజా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించినవారిపైనే ఈ దాడులు జరుగుతుండటం, కేసులు పెడుతుండటం దేనికి సంకేతం? ఇప్పటి వరకూ ఇలాంటి దాడుల్లో ఏ అక్రమాలూ, అవినీతీ వెలుగుచూసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
ఇప్పుడు అనురాగ్ కాశ్యప్, తాప్సీలే కాదు, దీపిక పదుకొనే నుంచి దిశారవి వరకూ అనేకమంది సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలు, ప్రజాపక్షం వహించిన న్యూస్క్లిక్, దివైర్ వంటి పత్రికలు, సిద్ధార్థ వరదరాజన్, ప్రబీర్ పుర్కాయస్థ, రాజ్దీప్ సర్దేశారు లాంటి పాత్రికేయులు ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మించిన హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులంతా ఈ కాలంలో వేదింపులకు బాధితులే. బహుశా డెబ్బయిమూడేండ్ల స్వాతంత్య్రం తర్వాత భావప్రకటనే నేరమవుతున్న ప్రజాస్వామ్యదేశం భారతదేశమొక్కటే నంటే అతిశయోక్తి కాదేమో..! ఏ ప్రభుత్వమైనా తన మద్దతుదారులకంటే విమర్శకుల నుంచే ఎక్కువ నేర్చుకోగలదనేనది విజ్ఞుల మాట. ఆ విజ్ఞత మరిచి చిన్న చిన్న భిన్నాభిప్రాయాలకు కూడా ప్రభుత్వం కన్నెర్రజేస్తుంటే... ఇప్పుడు అభిప్రాయాలే కాదు, నాటకాలు, సినిమాలు, పుస్తకాలు, వ్యాసాలు, పాటలు, ప్రసంగాలతో పాటు వాట్సప్ సందేశాలు, ఫేస్బుక్ పోస్టులు, ట్విట్టర్ ట్వీట్లు.. ఒక్కమాటలో చెప్పాలంటే సమస్త స్పందనలూ దేశాన్ని అస్థిరపరిచేవిగా మారిపోతుండటం వైచిత్రి!
అసమ్మతిని గౌరవించలేని ప్రభుత్వాలు ఈ దేశానికి కొత్తేమీ కాదు గానీ, అసమ్మతిపై దాడులకు తెగబడుతున్న తీరు, వేదింపుల తీవ్రత, వాటి విస్తృతి పౌరస్వేచ్ఛకే ప్రమాదఘంటికలు మోగిస్తుండటం ఇప్పటి వరకూ ఎరుగనిది. ఈ ఏడేండ్ల పాలనాకాలాన్ని గనుక పరిశీలిస్తే దేశంలో ఏ ప్రభుత్వమూ, ప్రపంచంలో ఇంకే దేశమూ తన సొంత పౌరులమీద ఇన్ని కేసులు పెట్టి ఉండదు. రాజ్యవ్యతిరేక నేరాలు మోపబడిన ఈ కేసుల వివరాలన్నీ చూస్తే దేశంలో ఇంతమంది ''దేశద్రోహులు''న్నారా? అని అనిపించకమానదు..! ''నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017-19 మధ్య కేవలం రెండేండ్ల వ్యవధిలో నమోదైన రాజ్యవ్యతిరేక కేసులు 25,118. వీటికి 2017కు ముందు, 2019 తరువాత చేరిన కేసులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఎంత ఉంటుందో ఊహించడం అంత కష్టమేమీ కాదు. వీరందరిపై కుట్రదారులన్న ఆరోపణలే తప్ప వాటికి ఏ ఆధారాలూ లేవు. అసలు విచారణే లేకుండా జైళ్లలో మగ్గుతున్న మేధావులెందరో..! దేశం ఎంతటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తుందో తెలుసుకోవడానికి ఇంతకు మించిన ఉదాహరణలేం కావాలి? అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రాధమిక హక్కులకు కూడా దిక్కులేకుండా పోతోందని పలు అంతర్జాతీయ నివేదికలూ హెచ్చరిస్తున్నాయి.
''అసమ్మతి దేశద్రోహం కాదు, అది ప్రజాస్వామ్యానికి ఊపిరి'' అని రాజ్యాంగ సూత్రాలు, న్యాయస్థానాలూ ఘోషిస్తున్నప్పటికీ దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ పరిస్థితినేమనాలి? ఈ దేశం ఒక ఆధునిక దేశంగా అభివృద్ధి చెందేందుకు ప్రాతిపదికగా ఒక రాజ్యాంగం ఏర్పడింది. అది ఈ దేశంలో పౌరులందరూ సమానమేనని హామీ ఇచ్చింది. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించింది. దేశం మతాతీతమైన రాజ్యంగా ఉండాలన్న లౌకిక విధానాన్ని నిర్దేశించింది. ఈ కర్తవ్యాల నిర్వహణకై వివిధ వ్యవస్థలకు రూపకల్పన చేసింది. ఇప్పుడా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడిచే కుట్రలు సాగుతుంటే... వాటిని ప్రశ్నించడం, తమ అసమ్మతిని తెలియజేయడం దేశభక్తి అవుతుందేగానీ దేశద్రోహమెలా అవుతుంది..? అసమానత్వాన్నీ, అవమానాన్నీ, అమానవీయతనూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రజలపై రుద్దుతోంటే.. ప్రశ్నించడం బాధ్యత అవుతుందేగానీ నేరమెలా అవుతుంది.. ఒకవైపు అడుగడుగునా మనుషుల కదలికల మీదనే కాదు, ఆలోచనల మీద కూడా ఆంక్షలు విధిస్తూ, మరోవైపు 'ఆజాదీకా అమృత్ మహౌత్సవ్' అంటూ డెబ్బరు అయిదొవ స్వాతంత్య్ర వేడుకలకు పిలుపునివ్వడం తమ కుట్రలకు ముసుగులేయడమే. ఈ ముసుగులు తొలగించి, జాతిని మేల్కొల్పడం నేటి ఆవశ్యకత. ''స్వేచ్ఛ అంటే ఇష్టారీతిన వ్యవహరించడం కాదు, ఆవశ్యకతలను గుర్తించడం'' అంటాడు మార్క్స్. ఆ ఆవశ్యకతలను గుర్తించడమే ఇప్పుడు దేశం ముందున్న కర్తవ్యం.