Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికాలోని దేశాల్లో మళ్లీ వామపక్ష భావజాలం, ప్రగతిశీల శక్తులు మంచి విజయాలు సాధిస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలను కఠినంగా అమలు జరపడంతో అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు బాగా దిగజారిపోయి ఆ విధానాలను ఓడించే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. 2000సంవత్సరం ప్రారంభంలో కూడా ఇదే విధమైన వామపక్ష తరంగం వచ్చి వెనెజులా, బ్రెజిల్, బొలీవియా, నికరాగ్వా తదితర దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. క్యూబా వీటికంటే ముందునుంచే సోషలిస్టు విధానాలు అమలులో పెట్టింది.
ఆ తర్వాత మితవాద శక్తులు పుంజుకుని బ్రెజిల్ తదితర దేశాలలో రాజ్యాధికారం చేబట్టి ప్రజలపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నాయి. తాజాగా కోవిడ్కాలంలో ప్రభుత్వాలు సరిగ్గా స్పందించక ప్రజలు నానా తిప్పలు పడవల్సి వచ్చింది. సోషలిస్టు దేశం అయిన క్యూబా, వెనెజులా పొరుగుదేశాలకు అందించిన సహాయం ఒక ఆదర్శంగా నిలబడ్డది. క్రమంగా ప్రజలు మళ్ళీ వామపక్షం వైపుకే అడుగులు వేస్తున్నారు. దానికి తాజా ఉదాహరణగా బొలీవియా, వెనెజులాలో అమెరికా సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలు చేసినా అక్కడ వారు ఓటమిపాలైయ్యారు. బొలివియాలో మోరేల్స్ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచింది.
లాటిన్ అమెరికా గురించి ప్రత్యేకించి బొలివియాలో ఉన్న పరిస్థితిపై బొలివియా మాజీ ఉపాధ్యక్షుడు అల్వారా గార్సియా లినేరా మాట్లాడుతూ.. ''తాము రెండవ పురోగమన తరంగంలో ఉన్నామని చెప్పారు. వామపక్ష ఉద్యమం తరంగాల వంటిది తప్ప, ఆగిపోయే చక్రం కాదు. తరంగాలు వస్తుంటాయి, పోతుంటాయి అన్నారు. ఎన్నికల కూటములకు మించి ఆలోచించటం నూతన ప్రజాస్వామ్య తరంగానికి ముఖ్య భూమికగా ఉన్నది'' అంటూ ''లాటిన్ అమెరికాలో వామపక్షాలు వెనుకపట్టు పట్టినా మితవాదం - వామపక్షం మధ్యవైరుధ్యం ముగియలేదు. 2021లో వామపక్షం తిరిగి లాటిన్ అమెరికాలో ముందుకు సాగేందుకు వీలుగా ఉంది'' అని తేల్చి చెప్పారు.
చీలీలో 1973లో వామపక్ష అధ్యక్షుడు సాల్వడార్ ఆలెండీని హత్యచేసి నియంత పినోచట్ అధికారాన్ని చేపట్టారు. వామపక్ష ఉద్యమాన్ని అణచివేశారు. పినోచట్ ప్రవేశపెట్టిన నిరంకుశ రాజ్యాంగమే ఇప్పటికీ అమలులో ఉన్నది. ఇప్పుడు కొత్త రాజ్యాంగం రచనకోసం జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా వామపక్షాల చొరవతో కొత్తరాజ్యాంగ రచన జరగనున్నది. అన్ని సక్రమంగా జరిగి ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరిగితే వామపక్షం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈక్విడార్లో మాజీ అధ్యక్షుడు రాఫెల్ కొర్రియా బలపరిచిన వామపక్ష అభ్యర్థి ఆండ్రెస్ అరౌబ్ విజయం సాధిస్తే దానికి ప్రాధాన్యత సంతరించుకుంటుందని కొలంబియాకు చెందిన సామాజికవేత్త అన్నది నిజం. మొదటి దఫా ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి ఆండ్రెస్ మొదటిస్థానంలో ఉన్నందున ఏదో ఒక సాకుతో అసలు ఎన్నికలనే రద్దుచేసేందుకు నానాయాగి చేస్తున్నారు. జైళ్ళలో జరిగిన ఉదంతాలకు మాజీ అధ్యక్షుడైన వామపక్షవాది రాఫెల్ కొర్రియా అనుచరులే కారణమని ప్రభుత్వం ప్రకటించడం వెనుక ఉన్న కుట్ర ఏమిటో స్పష్టం. రెండవ దఫా జరగనున్న ఎన్నికలలో కొర్రియా బలపరిచిన అభ్యర్థిని దెబ్బతీసే దుర్మార్గమైన ఎత్తుగడ ఇది. ఫిబ్రవరి చివరివారంలో నాలుగు జైళ్ళలో ఆటవిక పద్ధతిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 81మంది మరణించారు. రంపాలతో శరీరాలను కోయటం, కుళ్ళపొడవటం, ముక్కలు చేయడం వంటి దారుణాలను ప్రభుత్వమే అనుమతించి వాటిని వామపక్ష అభ్యర్థి తరపువారు చేసినట్టు చూపి ఆ అభ్యర్థిని రంగం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నది. అడుగడుగునా కుట్ర సాగుతూనే ఉన్నది. ఇన్ని చేసినా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. వామపక్ష అభ్యర్థి గెలుపుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ అంతర్గతంగా అనేకమంది గళమెత్తుతున్నారు. దీనితో ప్రజాస్వామ్య ప్రక్రియ ఈక్విడార్లో కొనసాగుతుందనే ఆశాభావాన్ని మెక్సికో అధ్యక్షుడు అండ్రెస్ మాన్యుయల్, అర్జంటీనా అధ్యక్షుడు ఆల్బర్ట్ ఫెర్నాండెజ్ ప్రకటించారు. ఈ ప్రకటనను బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్సీ కూడా బలపరిచారు. సామ్రాజ్యవాదులు ఈ పరిణామాలు జరగనీయకుండా కట్టడి చేసేందుకు అన్ని శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ ఆరౌజ్ విజయం లాటిన్ అమెరికాలో వామపక్షాల నిర్ణయాత్మక పాత్రను మరింత పెంచనున్నది.
ఫిబ్రవరి 21న వెనెజులా అధ్యక్షుడు ముదురో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురించిన 173వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ.. వామపక్ష భావాజాలాన్ని నిలబెట్టాలని, మితవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. లాభాల కంటే మానవ సమాజం ముఖ్యం. యుద్ధంకంటే శాంతి ముఖ్యం అనే మానవ సమాజం ఏర్పడాలన్నారు. ''నేను ఈ మాటలు ఒక కార్మికుడిగా, ఒక బస్సు డ్రైవర్గా, ఒక కార్మిక సంఘం సభ్యుడుగా మరీ ముఖ్యంగా వెనెజులా కార్మికవర్గంలో భాగంగా చెపుతున్నాను'' అన్నారు. వెనెజులాపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎదుర్కోవాలంటే ఐక్యత కీలకం అని, అందులో అన్ని శక్తులను అంటే ప్రగతిశీల విప్లవశక్తులను కలుపుకుని సోషలిజం, మానవత్వం కోసం పోరాడేవారు ఉండాలని పిలుపు ఇచ్చారు. ఇలాంటి ఐక్యతే లాటిన్ అమెరికాలో మరో తరంగానికి భూమిక కానున్నది.