Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రాజైనా.. రారాజైనా.. మనీవున్న మనముందు సలాం కొట్టవలసిందే, పైసా ఉంటే పరుగెత్తుకు రాడా పరమాత్మయినా... కో అంటే కోటి దొర్లుకుంటు వస్తుంది కొండమీది కోతి!'' అని సినిమాలో పాడుకున్నారుగానీ రప్పించుకోవడమే కాదు కుత్తుకలు కత్తింరించడమూ మనీ చేయగలుగుతుంది. డబ్బనేది ఏమైనా చేయగలదని, అది చేయని పనంటూ ఏమీ లేదని నూటయాభైయేండ్ల క్రితమే మార్క్స్ విపులంగా వివరించారు. డబ్బు విశ్వరూపాన్ని మన కండ్లముందుంచారు. అయినా కొన్ని మనకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి.
డబ్బు గురించి షేక్స్పియర్ కూడా చాలా వర్ణనాత్మకంగా చెపుతాడు. 'పసిమితో మిసమిస మెరిసిపోయే పసిడి, అత్యంత విలువైన అపురూపమపరంజి, ఇంత మాత్రమె చాలు నలుపు తెలుపైపోవు, తప్పు ఒప్పయితానె మారేను. అవినీతి నీతిగా ఆమోదమొందేను, అల్పుడే ఉన్నతుడి అవతారమెత్తేను, వృద్ధుడే నవనవోన్మేష యువకుడైపోయేను, పిరికిపంద ధీరుడను ఖ్యాతికలిగేను. కుష్టురోగికి ప్రియుల కొనితెచ్చు కాంచనము. మతములను జతకూర్చు, మరల వాటిని చీల్చు'' అంటూ డబ్బు అనేది ఒక కళంకిణి అని అభివర్ణిస్తాడు. ఇన్ని చేయగలిగింది తాను వృద్ధి చెందుతుందీ అంటే ఇక అంతమొందించడమూ హతమార్చడమూ చేయలేదా! తనను అందుకోవటానికి డబ్బు మనిషికి సవాలక్ష ఉపాయాలను, తలకుమించిన తెలివితేటలనూ అందిస్తుంది.
అలా డబ్బు ఏమయినా చేయగలదనటానికి, ఎంతకయినా తెగించగలదనటానికి ఇటీవల మన తెలంగాణలో జరిగిన ఓ సంఘటన రుజువుగా నిలుస్తుంది. నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ ఐదుగురు సభ్యుల బృందం జీవితబీమా పాలసీలు చేయించి, పాలసీ తీసుకున్న వ్యక్తులను హతమారుస్తూ, సహజమరణాలుగా చిత్రించి కోట్ల రూపాయల క్లెయిమ్లు చేశారని తెలిసింది. ఇలా క్లయిమ్లు చేయటం కోసమే పాలసీలు చేయించటం, ఆ తరువాత కొంత కాలానికి వాళ్ళను ట్రాక్టరుతో గుద్దించో, కత్తులతో నరికించో చంపి సహజమరణంగా సర్టిఫై చేయింటం, ఆ తరువాత బీమా క్లయిమ్ చేయడం పకడ్బందీ పథకం ప్రకారం చేస్తూపోయారు. అంటే వాళ్ళు పాలసీ చేయించేదే క్లయిమ్ చేయటానికి, నామినీకి కొంత వాళ్ళకు మిగతాదంతా! ఎంత దుర్మార్గం! ఇది ఒక సాధారణ మనుషుల బృందం చేసింది కాబట్టి దొరికిపోయారు. కానీ ఉన్నత కుటుంబాలలోనూ చాలా తేలికగా ఇలాంటివి జరిగిపోతున్నాయి. కొందరు ప్రముఖ సినీతారల మరణాల సందర్భంగానూ ఇలాంటి గుసగుసలు వినిపించాయి. డబ్బు సంబంధాలలో మనం కూరుకుపోయాక దాని మాయోపాయాలు అది చేస్తూ పోతుంటుంది. ఇక దాన్ని ఆపటం మనకు అసాధ్యమైనదిగా మారుతుంది. అందుకే 'గుండెల్లో, మెత్తగా దిగబడే, కాగితపు కత్తి, కరెన్సీ నోటు' అని అలిశెట్టి పొలికేకపెట్టాడు.
ఓ సినీ కవి పాటలో చెప్పినట్టు ''అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా! అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా!'' అని చాలా విడమర్చి చెబుతూ 'డబ్బుపుట్టి మనిషి చచ్చాడమ్మా, పేదవాడు నాడే పుట్టాడమ్మా! అని రెండు వాక్యాల్లో గొప్ప విషయాన్ని వ్యక్తీకరించాడు. అవును డబ్బు మనిషిని చంపేస్తుంది. మానవత్వాన్ని పాతేస్తుంది. డబ్బును మనం ఖర్చుపెడుతున్నామని గొప్పలు పోతాము కాని మనల్నే డబ్బు ఖర్చుపెడుతూ తన చుట్టూ తిప్పుకుంటుంది. ఇప్పుడే కాదు, దాని శక్తిని పదిహేడవ శతాబ్దంలోనే వేమన చెప్పగలిగాడు. 'కులము గల్గువాడు గొత్రంబు గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమా!' అన్నాడు. అంటే డబ్బు ఫలితాన్ని పట్టుకున్నాడు.
డబ్బు అనేది మానవుని సహజ మానవీయ లక్షణాలన్నిటినీ వ్యతిరేక లక్షణాలుగా మార్చేస్తుంది. మానవుల సహజగుణాలను తలకిందులు చేస్తుంది. మనిషిగా చేయలేని పనులు డబ్బుతో చేయగలుగుతాము. మనుషుల మధ్య సంబంధాల్లో మనసును మైనస్ చేసి తాను కుర్చీ వేసుకుని స్థిరంగా కూర్చుంటుంది. అందుకనే మార్క్స్ 'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే'నని విశ్లేషించి చెప్పారు. మనిషి తాను స్వయంగా సృష్టించిన డబ్బు, సృష్టించినవాడినే ఇష్టానుసారం ఆడిస్తూ తన చుట్టూ తిప్పుకోవటం గమ్మత్తయిన చిత్రం. ఈ చిత్రాలకు, మాయలకు కారణాలు సమాజంలోనే ఉన్నాయి. వాటిని మార్చుకొన్ననాడే డబ్బు మనం చెప్పినట్టు వింటుంది. లేదంటే సమాజంలోని సమస్త విలువలు, ప్రేమలు, స్నేహాలు, అనురాగాలు, ఆప్యాయతలు, రాజకీయాలు, సామాజికాలు మానవత్వాలు అన్నీ డబ్బు కేంద్రంగానే సంచరిస్తాయి. ఇప్పుడు మనం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం. వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తే అధికారం కాళ్ళముందుకొచ్చి సేవ చేస్తోంది. గుండుగుత్తగా మనుషుల్ని కొనేస్తోంది. అమ్మేస్తోంది. ఈ సంబంధాలను మార్చివేయగలిగినప్పుడే మనిషి మనిషిగా మారతాడు. అందుకే 'కూలివాని చెమటలో ధనమున్నదిరా! పాలికాపు కండల్లో ధనమున్నదిరా! ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవధర్మం!' అన్న గీతంలో డబ్బు ఎక్కడి నుంచి సృష్టించబడుతోందో స్పష్టంగా చెప్పాడు కవి. ఆ వివేచనతో ఎరుకతో డబ్బు కన్నా మనిషి ముఖ్యమనే మానవీయ సమాజాన్ని నిర్మించుకోవడమే మనముందున్న కర్తవ్యం.