Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసియా - పసిఫిక్ ప్రాంతంపై తన ఆధిపత్యం కోసం, చైనాకు వ్యతిరేకంగా అమెరికా క్వాడ్ను ఏర్పాటు చేసింది. క్వాడ్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ సభ్యులుగా ఉన్నాయి. 2007లో క్వాడ్ ఏర్పాటుకు జపాన్ ప్రతిపాదించింది. 2020 అక్టోబర్లో పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యింది. భారత్ దీనిలో చేరడానికి లడ్డాక్లో చైనాతో ఏర్పడిన ఘర్షణల నివారణకు తప్పనిసరి అనే వాదనలు వినపడుతున్నాయి. కానీ భారత్ క్వాడ్లో చేరడానికి పునాది 2015 జనవరిలోనే పడింది. అప్పుడు ఒబామా భారత్ పర్యటన సందర్భంగా ''ఆసియా-పసిఫిక్ హిందూ మహాసముద్ర ప్రాంతంపై సంయుక్త వ్యూహాత్మక దృష్టి'' అనే పత్రంపై ప్రధాని నరేంద్రమోడీ సంతకం చేశారు. దానితో అమెరికా వ్యూహంలో భారత భాగస్వామి అయ్యింది. ఆ పత్రంలో తమ వ్యూహాత్మక దృష్టి స్పష్టంగా ఈ విధంగా ప్రకటించారు.. ''సముద్ర మార్గంలో వాణిజ్యానికి భద్రత, స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యం అని భావిస్తున్నాయి. ప్రత్యేంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అని ఉన్నది. ఆ మాటలతో చైనా వ్యతిరేకత నరనరాన ఇంకిపోయిందని స్పష్టమైంది. టోక్యోలో లాంచనంగా జరిగిన క్వాడ్ ప్రారంభోత్సవ సమావేశంలో అప్పటి అమెరికా రక్షణమంత్రి పాంపియో మాట్లాడుతూ.. ''క్వాడ్లో భాగస్వాములుగా ఇప్పుడు మన బాధ్యత మరింత పెరిగింది. కాబట్టి మనం మరింత సమన్వయంతో మన ప్రజలను, మన భాగస్వాములను చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క దోపిడీ, అవినీతి, కుట్రలనుంచి కాపాడాల్సి ఉంటుంది'' అన్నారు. అమెరికా మనసులో చైనాపై ద్వేషం ఈ మాటలలో బయటపడింది.
గత వారం బైడెన్ సారథ్యంలో జరిగిన క్వాడ్ సమావేశం సభ్యదేశాల మధ్య శాస్త్రసాంకేతిక సహకారం, వ్యాక్సిన్ పంపిణీ, వాతావరణ మార్పుపై పనిచేయాలనే లక్ష్యాన్ని పైకి ప్రకటించినా లోపల మాత్రం చైనా వ్యతిరేక వ్యూహ రచన జరిగింది. గత సెప్టెంబర్లో మన విదేశాంగమంత్రి ఎస్. జయశంకర్ భారత్ ఎలాంటి కూటములలో పాల్గొనబోదని ఒక బూటకపు ప్రకటన చేసారు. గత నవంబర్లో 3 నుంచి 6 వరకు విశాఖపట్నం తీరంలో జరిగిన నావికా దళాల ఉమ్మడి విన్యాసాలు, రెండవ దశలో అరేబియా సముద్రంలో నవంబర్ 17 నుంచి 20 వరకూ జరిగాయి. క్వాడ్లోని నాలుగు దేశాల నావికా దళాలు 13ఏండ్ల కాలంలో ఉమ్మడి విన్యాసంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గుర్తించదగిన అంశం. ఈ విన్యాసాలు చైనాను లక్ష్యంగా చేసుకుని జరిపారన్నది వాస్తవం.
సోషలిస్టు చైనా ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో, 5జీ, కరోనా కట్టడి, జీడీపీ పెంపుదల సాధించి ప్రపంచంలో మొదటి స్థానానికి పోటీపడుతున్నది. సోషలిజం యొక్క విశిష్టతను చాటిచెపుతున్నది. ''వన్బెల్ట్ వన్రోడ్డు'' అనే పథకం ద్వారా పొరుగు దేశాల అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడుతున్నది. దీనిని సహించలేని అమెరికా కుయుక్తులు పన్నుతున్నది.
2020 ఆగస్టు 20న జరిగిన భారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశంలో అమెరికా రక్షణశాఖ సహాయమంత్రి మాట్లాడుతూ.. ''ఆసియా నాటో'' యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆసియా నాటో ఏకైక లక్ష్యం చైనాను కట్టడి చేయడం అని అన్నారు ఆ ఆసియా నాటోనే క్వాడ్. ఈ విధంగా అమెరికా భారత్ లాంటి దేశాలను వెంటపెట్టుకుని ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో తన పెత్తనం సాధించడానికి వ్యూహాత్మకంగా కదులుతున్నది. క్వాడ్ దేశాలు అభివృద్ధి కోసం సహకరించుకోవాలని, మౌలిక సదుపాయాలు పెంచుకోవాలని, కరోనా కష్టకాలంలో మందులు కనుక్కోవడం, ఉత్పత్తి, సరఫరాకు బాధ్యతలు పంచుకోవాలని పైకి మంచిమాటలు చెపుతూ పొరుగుదేశాల మధ్య గోతులు తవ్వుతున్నారు. పొరుగుదేశాల మధ్య సంప్రదింపులు, సహకారం అభివృద్ధికి పరస్పర నమ్మకం పెంపొందించేందుకు జరగాలి. కానీ క్వాడ్ లాంటి చర్చలు దేశాల మధ్య దడికట్టి ముఠాలుగా ఏర్పడటానికే జరుగుతున్నాయి. ఇది సామ్రాజ్యవాద అమెరికా వ్యూహం. అందుకే చైనా తీవ్రంగా స్పందించింది. దడికట్టుకున్న దేశాల ముఠాలు సరికాదని ప్రకటించింది.
మోడీ ప్రభుత్వం అమెరికా పంచన చేరింది. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్న కాలంలో లడ్డాక్లో వాస్తవాధీన రేఖ దగ్గర నిత్యం భారత్ - చైనా సైన్యాల మధ్య రావణకాష్టాంలా ఉన్న పరిస్థితి సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఒక పక్షం తీసుకోవడం సరికాదు. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ చైనాతో నేరుగా చర్చలు జరపడమే సరియైన పద్ధతి అవుతుంది. మనమధ్య ఉన్న వివాదాంశాలను స్వయంగా చైనాతో చర్చించుకోగల సామర్థ్యం మనకుంది. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. అమెరికా చంకలో చేరి అది చెప్పినట్టు ఆడాల్సిన అవసరం లేదు.
ఈ నేపథ్యంలో చైనా కూడా జాగరూకతతో వ్యవహరించాలి. భారత్తో ఉన్న వివాదాస్పద అంశాల పట్ల ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. మొండిగా ఉండి, వాస్తవాధీనరేఖపై మంకుపట్టుతో వ్యవహరించి భారత్ అమెరికా వైపు చూసే అవకాశం ఇవ్వరాదు. జనాభా రీత్యా భారత్ చైనా ప్రపంచంలోనే పెద్ద పొరుగు దేశాలు. మనమధ్య పరస్పర సహకారం పెంపొందితే ప్రపంచ మానవాళికి ఈ భూమండలానికి మరింత మేలు జరుగుతుంది. అమెరికా క్వాడ్ పేరుతో వేసే జిత్తుల యెడల భారతదేశం అప్రమత్తంగా ఉండాలి.