Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధార్తో అనుసంధానం (దీన్నే సీడింగ్ అంటారు) చేయలేదన్న కారణంతో దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల రేషన్ కార్డులను ప్రభుత్వాలు రద్దు చేయడం దారుణమైన విషయం. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కూడా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. దాన్ని చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జార్ఖండ్కు చెందిన కొయిలీ దేవి కుమార్తె సంతోషి కుమారి 2017లో ఆకలి చావుకు గురైన నేపథ్యంలో ఆ తల్లి ఈ కేసు దాఖలు చేసింది. తమ పిటిషన్లోని అంశాలు చాలా కీలకమైనవని, దేశమంతటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న కొయిలీ దేవి తరపు న్యాయవాది కొలిన్ గొంజాల్వెస్ వాదన ప్రత్యక్షర సత్యం. ఆధార్ సీడింగ్ కాలేదన్న సాకుతో సామాన్య ప్రజల రేషన్ కార్డులను రద్దు చేస్తే ఆకలి చావుల బారిన పడడం తప్ప గత్యంతరం లేదు. సాంకేతికంగా ఇది ఆధార్తో ముడి పెట్టినట్టున్నా అసలు కిటుకు మాత్రం ప్రభుత్వ సబ్సిడీని తగ్గించుకోవడమే. నిజానికి ఈ కేసులో తమ ప్రతిస్పందన తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను 2019 డిసెంబరు 9న సుప్రీంకోర్టు కోరింది. ఇప్పటికి 15 మాసాలు గడిచినా అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తగిన సమాధానం చెప్పలేదంటే పేదల ఆకలి తీర్చే విషయంలో ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం తారాస్థాయిలో ఉందని స్పష్టమవుతోంది. ప్రభుత్వాల తీరిలా ఉంది కాబట్టే ప్రపంచ ఆకలి సూచీలో భారత్ అట్టడుగుకు (107 దేశాల్లో 94వ స్థానం) దిగజారింది. ఆధార్ మూలంగా పౌరుల గోప్యతకు భంగం వాటిల్లుతుందని, ఆ సమాచారం దుర్వినియోగం కావచ్చుననీ, ప్రజలకు చట్ట ప్రకారం అందాల్సిన సంక్షేమ ఫలాలు అందవనీ నాలుగేండ్ల క్రితమే సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలయింది. ఆ కేసులో మధ్యంతర ఉత్తర్వులిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ చట్టబద్ధ సంక్షేమ ప్రయోజనాలు నిరాకరించరాదని స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ ఆధార్ అనుసంధానం కాలేదంటూ మూడు కోట్ల రేషన్ కార్డులు రద్దు చేశారంటే ప్రభుత్వాలకు సుప్రీం తీర్పు పట్ల కనీస గౌరవం లేదన్నమాట. అయితే అవన్నీ బోగస్ కార్డులని ప్రభుత్వాలు చెప్పడం మరీ ఘోరం. కొండ కోనల్లో, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఆధార్, బయోమెట్రిక్ వంటివి కష్ట సాధ్యమైన అంశాలు. ఇలాంటి సాకులతో దాదాపు పదిహేను కోట్ల మందికి (కుటుంబానికి సగటున ఐదుగురు అంచనా) నోటికాడ కూడు తీసిన పాలకులకు ఏ శిక్ష వేస్తే సరిపోతుంది? ఆహార భద్రత చట్టం అమలు చేసే తీరు ఇదేనా? ఎంతమంది సంతోషి కుమారిలు ఆకలి చావులకు బలి కావాలి?
'ఒకే దేశం ఒకే రేషన్ కార్డు' అంటూ మోడీ సర్కారు ఆర్భాటం చేయడం వెనుకనున్న మర్మం కార్డుల రద్దేనన్నది స్పష్టం. జనం ఇబ్బందులు పడతారని, ఆ వ్యతిరేకతను తాము మూటగట్టుకోవాల్సి వస్తుందని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి ముందు వెనుకలాడాయి. దాంతో ''ఒకే దేశం ఒకే రేషన్'' అమలు చేసే రాష్ట్రాలకు అదనపు రుణం పొందే అర్హత ఉంటుందని ముందు కేంద్రం ఆశ చూపింది. ఆ తర్వాత ఆత్మనిర్భర్ ప్యాకేజి పేరిట ఆస్తి పన్ను పెంపు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, కార్మిక హక్కులపై వేటు లాంటి షరతులు విధించి అవన్నీ చేస్తేనే అదనపు రుణం అని మెలిక పెట్టింది. దాంతో సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల్తో జనానికి 'గోడ దెబ్బ- చెంప దెబ్బ' రెండూ తగిలినట్టయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ అమానవీయ విధానాలను విడనాడి సామాన్య ప్రజలకు ఆహార పదార్ధాలు అందేలా రేషన్ కార్డులు మంజూరు చేయడం అవసరం. కేవలం బియ్యంతో సరిపెట్టకుండా కేరళ వామపక్ష ప్రభుత్వం అమలు చేసిన విధంగా నిత్య జీవితావసర సరుకులన్నిటినీ చౌకడిపోల ద్వారా అందించాలి. సార్వత్రిక ప్రజా పంపిణీ విధానమే ఈ దేశానికి రక్ష. 2010 నుంచి దేశంలో జరిగిన ప్రతి సార్వత్రిక అఖిల భారత సమ్మెలోను భారతదేశ కార్మికోద్యమం చేస్తున్న డిమాండ్లలో ఈ కీలక డిమాండూ ఉంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను నెత్తికెత్తుకున్న ప్రభుత్వాలు అందుకు సిద్ధం కావు. ప్రజలే ఉద్యమించి సాధించుకోవాలి.