Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కవితా ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో, నిను నేనొక అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున... నేనెటు చూసిన చటులాలంకారపు మటుమాయల నటనలతో నీరూపం కనరానందున గుహలో కుటిలో చీకటిలో సృక్కిన రోజులు లేవా!'' అంటూ కవిత్వం కోసం పరితపించాడు శ్రీశ్రీ. ప్రపంచ కవితా దినోత్సవాన కవనలోకాన్ని ఒకమారు కదిలించి చూద్దాము.
కవిత్వమనగానే నేడు చాలామందిలో తమకు సంబంధించిన విషయం కాదనీ, లేక తమకది అర్థం కాదనీ ప్రక్కనపెడతారు. అంతే కాదు, అది కవుల వైయక్తికగోల అని తీర్మానించేసారు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి కవిత్వం భావోద్వేగాలకు సంబంధించినది. భావోద్వేగాల కలబోతలకు అననుకూలమైన సామాజిక తలంలో మనం జీవిస్తుండడం. ఉద్వేగాలకంటే ఉద్యోగ, ఉపాధులు, సంపాదనల కేంద్రీకరణలలో పడికొట్టుకుపోవడం. ఇక రెండవది కవిత్వం కూడా సామూహిక అనుభూతులను ప్రతిఫలింపచేయలేక పోవడమూ కారణంగానే తోస్తుంది. ఎన్ని కారణాలున్నప్పటికీ ఎంత పట్టించుకోని సమాజమైనప్పటికీ కవిత్వం, సాహిత్యం నిత్యం సంఘం కోసం తన ప్రయాణాన్ని ప్రయత్నాన్ని వొదులుకోలేదు.
కవిత్వం మానవీయాంశం. కానీ మనిషిపై నేడు ఆర్థికాంశాలు ప్రధానమై పెత్తనం చేస్తున్నాయి. అందులో చిక్కుకుని బయటపడలేక కొట్టుమిట్టాడుతున్నాడు. సార్వజనీన మానవీయ అంశాలకు అద్దం పట్టేది కవనం. అందుకనే ప్రపంచ వ్యాపితంగా మనుషుల మధ్య ఎన్ని వైవిధ్యాలున్పటికీ అందరినీ ఒకేరకంగా ఆకట్టుకునేది, అంటిపెట్టుకునేది కవిత్వం ఒక్కటే. 'మానవుల తొలి దినాల సౌందర్యానంద చర్యల ఆలోచనల్లో కవిత్వం ఒకటి. అది ఆనాటి మానవుల ఉద్విగ మానస సాధారణ సంభాషణ' అని క్రిష్టోఫర్ కాడ్వెల్ వివరిస్తాడు.
అవును సమాజపు సామూహికతలోంచే ఉద్విగ కవిత్వం పుట్టింది. ఆదిలో అది పాట. ఆ తర్వాత పద్యం. అసలు ఎందుకు మనిషి కవిత్వ సృజనకు పూనుకుంటాడంటే, 'సంవేదనలను, అనుభూతులను, ఆలోచనలను అందమైన రూపంలో వెల్లడించాలనే కోరిక మానవులందరికీ సహజమైనది' అంటాడు గోర్కీ. ప్రకృతిలోని లయాత్మక ధ్వనులు, శబ్దాలు, ప్రవాహాలు మానవుని గొంతుకు సానపట్టాయి. ప్రయాణం, భయాలు, అప్రమత్తత ఆలోచనలకు అభివ్యక్తిని కూర్చాయి. నిత్య కార్యాచరణగలమానవుడి ఉత్కృష్ట భావ వ్యక్తీకరణే కవిత్వమైపొంగింది. నిజ జీవితంలో కష్టాలు, బాధలూ ఎదురైనప్పుడు చెప్పుకోవడానికి మరో మార్గం కావాలి. అదే కవన సృజన. నిజంగా ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరూలేనితనం మనందరినీ వెంటాడుతోంది. ఏమీ మాట్లాడలేని, వ్యక్తం చేయలేని ఓ నిర్భంధ సన్నివేశంలో నివసిస్తున్నాము. అందుకని కవిత్వావసరం మరింత పెరిగిందనే చెప్పుకోవాలి.
కవిత్వానికున్న ప్రయోజనాన్ని పూర్వం నుంచీ కొందరు అర్థం చేసుకోలేకపోయారు. వినేవారిని కవి తన కవిత్వంతో మోసం చేస్తాడని ప్లేటో భావిస్తాడు. అంటే ఊహలు, కల్పనలు ఉంటాయని అతిశయం పాలు ఎక్కువనీ ఆయన భావన. 'కవిత్వమనేది స్వప్న ప్రపంచం లాంటిదని జార్జ్థాంప్సన్ వర్ణించాడు. అంటే వాస్తవ జీవిత ప్రమేయాలతో సంబంధమేమీలేదని కాదు. వాస్తవ జీవితంలో వ్యక్తుల మధ్య ఉండే విభేదాలను మరచి అందరికీ సమానమైన మౌలిక వాంఛలనూ ఆశయాలను ప్రకటించేట్టుగా సగం కలవంటి మానసిక స్థితిని కలిగించటమే. కవిత్వానికున్న ప్రభావం వల్ల సహానుభూతి పెరుగుతుంది. నిజమైన మానవ కార్యకలాపమేదైనా ప్రయోజన రహితంగా ఉండదు. మానవాళిని ఒకింతముందుకు తీసుకుపోయేందుకు తోడ్పడుతుంది. జీవితాన్ని నిత్య నూతనంగా ఇంకొంత తేజోవంతంగా మనిషి మనిషిగా బ్రతకాలనే కోర్కెను రగిలించడానికి కవితా సృజన తోడ్పడుతుంది.
సామూహిక మానవానుభూతుల నుంచే సత్యాన్వేషణ సాగుతుంది. అదే కవి చేయాల్సిన పని. అప్పుడే అది ప్రజా కవిత్వమవుతుంది. అందరినీ ఆకర్షిస్తుంది. చీలీ ప్రజల ఆశలనూ ఆకాంక్షలనూ తన కవిత్వంలో సంపూర్ణంగా ప్రతిబింబించడమే కాకుండా నూతన చైతన్యాన్ని రగిలించాడు పాబ్లో నెరూడా. ప్రపంచంలోని విప్లవకారులు, విప్లవనాయకులు చాలా వరకు కవులనే విషయాన్ని గుర్తించవచ్చు. చైనాలో విప్లవ నాయకుడు మావో, వియత్నాం నేత హౌచిమిన్, చెగువేరా, అంతే కాదు దోపిడీ విముక్తి సిద్ధాంతవేత్త కారల్మార్క్స్ కవిత్వం రాశారు. ''ఇక్కడ బుద్ధిజీవులు మంచుగడ్డల్లో చచ్చిన శవాలై తిరుగుతున్నారు. ఇప్పట్లో వాళ్ళకు నే నర్థం కాను, కలల్ని నిజం చేయటానికి మనం అనంత జాగృత యాత్ర చేస్తాం!'' అని వాస్తవాధార కలను కవిత్వం చేశారు.
అలాంటి మహౌన్నత సార్వజనీన అభివ్యక్తి ధార కవనాన్నీ మన భారతీయ సమాజంలోని సామాజిక వివక్షతలు వేరుచేయటాన్ని చూస్తాము. అందుకనే జాషువా లాంటి దార్శనిక కవులు విశ్వనరున్నని చెప్పుకున్నా 'నా కవితా వధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖా కమనీయ వైఖరులుగాంచి భళీభళియన్న వారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున గ్రుమ్మినట్లగున్' అని వాపోయాడు. ఈ అసమానతలపై, మూఢత్వాలపై కవిత్వ తిరుగుబాటు సాగుతోనే ఉంది. 'ప్రపంచమొక పద్మవ్యూహ మైనా కవిత్వమొక తీరని దాహం'లా మానవీయ సమాజం కోసం పరుగెడుతూనే ఉంటుంది.