Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని పలు ప్రపంచ నివేదికలు ఘోషిస్తుండగా, దానిని పదే పదే రుజువు చేస్తూ, ప్రమాదాన్ని మరింత వేగవంతంగావిస్తోంది మోడీ ప్రభుత్వం. అందుకు మరో సరికొత్త ఉదాహరణ ''గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) చట్టం-2021''. సోమవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య, కేంద్రం ఏకపక్షంగా ఆమోదించుకున్న ఈ బిల్లు ఢిల్లీలో ప్రజాతీర్పును పరిహాసం చేస్తోంది. ప్రభుత్వం ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇంతకంటే అప్రజాస్వామికం ఏముంటుంది?
ఢిల్లీది ఓ ప్రత్యేకమైన పరిస్థితి. అది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతమూ కాదు, పూర్తిగా రాష్ట్రమూ కాదు. పూర్తిస్థాయి రాష్ట్ర హౌదా లేని కేంద్రపాలిత ప్రాంతం. దేశ రాజధాని గనుక రాజ్యాంగం ఢిల్లీకి ఈ ప్రత్యేక స్థితిని నిర్దేశించింది. ఆమేరకు ''నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ'' చట్టం ఏర్పడింది. దీని ప్రకారం ప్రజా భద్రత, పోలీసు, భూ నిర్వాహణా అంశాలు కేంద్రంచే నియమింపబడిన లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి. మిగిలిన సాధారణ పరిపాలనా వ్యవహారాలన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఏదైనా అంశంలో ప్రభుత్వానికీ లెఫ్టినెంట్ గవర్నర్కూ భిన్నాభిప్రాయాలుంటే రాష్ట్రపతికి నివేదించి వారి నిర్ణయానికి కట్టుబడాలి. అయితే ఇప్పటికే ఈ అవకాశాన్నీ ఒక సాకుగా తీసుకుని కేంద్రం తన లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది ఇప్పుడు ఈ చట్టానికి సవరణ చేస్తూ సర్వాధికారాలనూ లెఫ్టినెంట్ గవర్నర్కు ధారాదత్తం చేస్తోంటే... ఇక ఆ ప్రభుత్వానికి ఉనికేముంటుందీ, ప్రజాతీర్పుకు అర్థమేముంటుంది?
జాతీయ రాజధానిగా ఢిల్లీ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం, సామరస్యంతో కూడిన పాలనా వ్యవస్థను రాజ్యాంగం ఆశించింది. ఆ మేరకు ''ఆర్టికల్ 239 ఏఏ'' ద్వారా ఈ ప్రత్యేక పాలనా విధానాన్ని నిర్దేశించింది. ఈ విధానం ఆచరణలో తురచూ గందరగోళానికీ, దుర్వినియోగానికి గురవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తన తీర్పుద్వారా స్పష్టతనిచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే అధికారముంటుంది తప్ప, కేంద్ర నియమిత లెఫ్టినెంట్ గవర్నర్కు ఉండదని తేల్చి చెప్పింది. ల్యాండ్, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ మినహా మిగిలిన పాలనా వ్యవహారాలన్నింటిలో రాష్ట్ర మంత్రిమండలి ప్రతిపాదనల ప్రకారమే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాలని సూచించింది. ఈ సందర్భంలోనే ''ఏదైనా అంశంలో 'భిన్నాభిప్రాయం' అంటే దానర్థం ప్రతి అంశంపై భిన్నంగా స్పందించడం కాదు'' అని కూడా వ్యాఖ్యానించింది. కానీ కేంద్రం నిస్సిగ్గుగా ఈ తీర్పునూ, రాజ్యాంగ స్ఫూర్తినీ కాలరాస్తూ ఈ సవరణ బిల్లును ఆమోదింపజేసుకుంది. తద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలన్నిటిని హస్తగతం చేసుకుంటోంది.
ఈ బిల్లు చట్టమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వ స్థాయి మున్సిపాలిటీ స్థాయికి దిగజారుతుందనడంలో అతిశయోక్తిలేదు. ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతి ఫైలూ లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్ళాల్సిందే. ప్రతి నిర్ణయానికీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కావాల్సిందే. మంత్రుల రోజువారీ కార్యాచరణకు కూడా వారి సమ్మతి తప్పనిసరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే అని ఖరారు కానున్నది. అటువంటప్పుడు ఇక ఆ శాసనసభకూ, ఆ ప్రభుత్వానికీ ఉన్న ప్రయోజనం ఏమిటి? తమవి కాని ప్రభుత్వాలను ఏ రూపంలోనైనా అడ్డుకోవాలనే కుతంత్రం తప్ప ఇందులో మరే తంత్రమూ కనిపించడం లేదు. ఫిరాయింపుల ద్వారా పడదోయడానికి వీలులేకుండా ఆప్ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీనిచ్చారు ఢిల్లీ ప్రజలు. అందుకే కేంద్రం ఈ మార్గాన్ని ఎంచుకుందన్నది సర్వత్రా వెల్లడవుతున్న విమర్శ.
చూస్తుంటే ఢిల్లీలో తమ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలే లేవని బీజేపీ భావిస్తోందా? ఇక ఢిల్లీ ప్రజలు తమను ఎప్పటికీ ఆమోదించరేమోనని ఆందోళన చెందుతోందా? అందుకే ఇంతకు దిగజారుతోందా? అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. నిజానికి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదించే ఈ విధానాన్ని బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఢల్లీీకి పూర్తిస్థాయి రాష్ట్ర హౌదా కావాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోంది. తమకు అధికారమిస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హౌదా కల్పిస్తామని కూడా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఇప్పుడేమో విచిత్రంగా అధికారంలో ఉండి కూడా దానిని బుట్టదాఖలు చేస్తోంది. ఢిల్లీని సంకెళ్ళలో బంధించజూస్తోంది. దీని పరమార్ధమేమిటి?! వీరి ద్వంద నీతికి, రాజకీయ అవకాశవాదానికీ, అనైతిక - అప్రజాస్వామిక విధానానికీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇది కేజ్రీవాల్ చెప్పినట్టు ప్రజాతీర్పుకు అవమానం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదం.