Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ముందుగా నా ఉద్యోగం పోయింది.. మరో మూడు వారాలకు మా నాన్నదీ ఊడింది.. కుటుంబాన్ని ఏలా నడపాలో తెలియలేదు'' ఇది ఒక బెంగళూర్ ఐటీ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి ఆవేదన. కోవిడ్-19 వైరస్ను నివారించేందుకు కేంద్రం తీసుకొచ్చిన అనాలోచిత లాక్డౌన్ ప్రతిఫలమది. చిన్నా, చితకా ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి ఇలా ఉంటే పొట్టచేతపట్టుకుని జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటిపోయే వలసకూలీల బతుకులు ఎలా ఉంటాయో ఉహించుకోవచ్చు. కరోనాను నియమంత్రించే పేర మోడీ సర్కార్ గత మార్చి 23, 2020న లాక్డౌన్ను దేశంపై రుద్దింది. కనీసం ప్రతిపక్షాలతోగానీ, తన సచివాలయ ఉన్నతాధికారులతోనూ విస్త్రృత సంప్రదింపులు, చర్చలు చేయకుండానే ఈ భారీ చర్యకు పూనుకుంది. ఫలితంగా వలసకూలీలు, ప్రజలు అవకాశాలు, సదుపాయాల్లేక రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇది ఏ ఒక్క రాష్ట్రం సమస్యోకాదు, యావత్దేశానిది. దేశంలో దాదాపు 11 కోట్ల మంది వలసకార్మికులు ఉన్నట్టుగా ఒక అంచనా. కాదు 8 కోట్లేనని కేంద్రం చెబుతున్నది. ఏడాది గడిచినా కేంద్రం వలసకూలీల లాక్డౌన్ గాయాలకు మందురాసే ప్రయత్నమేది చిత్తశుద్ధితో చేయట్లేదనేది నగసత్యం. వారి జీవన ప్రమాణాల మెరుగుకు అవసరమైన చర్యలూ మృగ్యం. సరికదా ఉన్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను తన విధానాలతో హరిస్తూ, తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన(ఏఎన్ఆర్వై) ద్వారా వచ్చే రెండేండ్లలో 50 నుంచి 60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆర్భాటంగా చెప్పిన బీజేపీ, అలా చేయకపోగా ఉన్నవాటినీ ఊడగొడుతున్నది.
కార్పొరేట్ అనుకూల పెట్టుబడిదారి విధానాలతో పబ్లిక్ సెక్టార్ వ్యవస్థను కుప్పకూలుస్తున్నది. తద్వారా ఇప్పటికే దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు తోడు మరిన్ని కొత్త వాటిని సృష్టిస్తున్నది. ఈ ప్రభావం సహజంగానే ప్రజలపై ప్రధానంగా వలసకూలీలపై పడుతున్నది. ఉత్తరప్రదేశ్లోని లక్నో, గుజరాత్లోని సూరత్, మహారాష్ట్రలోని పూణే లాంటి నగరాల్లోని లేబర్ మార్కెట్లల్లో నేటికి ఉపాధి అవకాశాలు పుంజుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నిటిఅయోగ్ సిఫారసులను అమలుచేస్తామన్న మోడీ సర్కారు, ఇప్పుడు ఆ మాటనూ విస్మరిస్తున్నది. వలసకూలీల సమస్యలను కడతేర్చేందుకు నిటిఅయోగ్ నిపుణులతోకూడిన ఒక ఉపసంఘాన్ని నియమించిందనీ, వారి ఇబ్బందులను అధ్యయనం చేసి పరిష్కరిస్తామనీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ గత ఫిబ్రవరి ఎనిమిదిన లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ ఉప సంఘం విధివిధానాలు ఇప్పటివరకు ఏమైనా కసరత్తు చేసిందా, చేస్తే వలస కార్మికుల కోసం ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందనేది ప్రశ్నార్థకమే. లాక్డౌన్ కాలంలో వలస కార్మికులు కుటుంబాలను వెంటేసుకుని పిల్లాపాపలతో జాతీయ రహదారుల వెంట చెప్పుల్లేని కాళ్లతో వందలాది మైళ్లు నడుస్తుంటే, ఆ హృదయ విదారక దృశ్యాలను చూసి ఈ దేశమే కన్నీరు కార్చింది. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగుకోడ్లుగా మార్చిన నేపథ్యంలో వలసకూలీల కోసం ప్రత్యేక చట్టం తెచ్చామనీ, దాంతో వారి సమస్యలకు చెల్లుచీటి పాడతామనీ కేంద్ర కార్మిక శాఖ చెప్పుకొచ్చింది. కానీ అలాంటి భారీ మార్పులేవీ కూలీల జీవితాల్లో కానరాకపోవడం కేంద్రం నిష్క్రియాపరత్వానికి పరాకాష్ట. కొత్త కోడ్-2020తో వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని ప్రమాణాలు పెంచుతామనీ, కనీసవేతనాలు, ఉత్తమమైన ప్రమాణాలు, ఫిర్యాదులను పరిష్కరించే విభాగం, పనిచేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి రక్షణ, పని సామర్థ్యాలను అధికం చేయడంతోపాటు సామాజిక భద్రతా లభిస్తుందని ఆ శాఖా అమాత్యులు పదే పదే సెలవిచ్చారు. అయితే అవేవి కార్యరూపం దాల్చకపోవడంతో బీజేపీ సర్కార్ చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
లాక్డౌన్ దేశంలో కోట్లాది మందిని నిరాశ్రయులను చేసింది. సుమారు 80 లక్షల మందిని తమ ఉపాధి చోటు నుంచి ఇండ్లకు తరిమింది. కాగా వలసకూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా నిధి(ఎస్డీఆర్ఎఫ్)ని వాడుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన ఉచిత సలహాతో ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ ''వలస కూలీల మనుగడ కోసం వెంటనే వారికి డబ్బును చేర్చడం చాలా ముఖ్యం. పాలు, కూరగాయలతోపాటు వారు నివసించే ఇంటికి కిరాయి కట్టడానికి అది తప్పనిసరి'' అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పనిని ఒక్క ప్రధానమంత్రి కార్యాలయమే చేయలేదనీ, సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సమన్వయంతో అమలుచేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో లేబర్ కాంట్రాక్టర్ల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఒప్పందం పేర బీహార్ తదితర రాష్ట్రాల నుంచి బలవంతంగా తీసుకొచ్చి నామమాత్రపు వేతనాలతో పనిచేయించుకోవడం ప్రభుత్వాల అలసత్వానికి మచ్చుతునక. ఇది పేదల పట్ల నిర్లక్ష్యాన్ని తెలియజేసేదే. ఏడాది పూర్తయినా వలస కూలీలు, ప్రజలకు లాక్డౌన్ చేసిన గాయాలను మాన్పలేకపోవడం అన్యాయం చేయడమే.