Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాకు మనుషుల పట్ల ఏ భేదాలూ లేకపోయినా, దాని ప్రభావలకూ, ఫలితాలకూ, నివారణా ప్రయత్నాలకూ ఆర్థిక వ్యత్యాసాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు కరోనాను కట్టడి చేస్తుందనుకున్న వ్యాక్సిన్ ప్రజల ప్రాణాల కంటే కంపెనీల లాభాలే ముఖ్యమైపోయిన వైనాన్ని కండ్లకు కడుతోంది.
కొనసాగుతున్న కరోనా సెకెండ్వేవ్ ఉధృతి దేశాన్నే కాదు ప్రపంచాన్నీ కలవరపెడుతోంది. రోజువారీ కేసుల నమోదు చూస్తే గత అక్టోబర్ నాటి పరిస్థితులను తలపిస్తుండటం గమనార్హం. మరోవైపు ఆర్థికరంగాన్ని కుదేలు చేసిన కరోనా మరో కొత్తరకం అసమానతను సృష్టిస్తోంది. ప్రపంచమంతటా ఆర్థిక అసమానతలు మున్నెన్నడూ లేనంత తీవ్రరూపం దాల్చగా కొత్తగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలోనూ ఈ అసమానతలు కొనసాగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని దేశాలు తమ జనాభాకు మించి వ్యాక్సిన్ దిగుమతి ఒప్పందాలు చేసుకుంటే అనేక దేశాలలో అసలు వాక్సినేషన్కు అవకాశమేలేని పరిస్థితి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ వికృతరూపాన్ని మరింత బట్టబయలు చేస్తోంది.
ఇప్పటికే కోవిడ్తో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దేశాల మధ్య, దేశంలోని వివిధ వర్గాల మధ్య విపరీతమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా అసంఖ్యాకులైన పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు దీని ప్రభావం నుంచి ఎప్పుడు బయటపడతారన్నది ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉన్నది. ఇటువంటి తరుణంలో టీకా పంపిణీలో కూడా సమతుల్యత లోపించడం సమస్యను మరింత జటిలం చేస్తున్నది. డబ్ల్యూటీఓ చెపుతున్న సమాచారం ప్రకారం కేవలం 49 సంపన్న దేశాలు 39మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఆర్డర్ చేస్తే, ఓ పేద దేశం కేవలం 25 డోసుల వ్యాక్సిన్ మాత్రమే ఆర్డర్ చేయగలిగింది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ ప్రపంచంలో దాదాపు 135 దేశాలు సింగిల్ వ్యాక్సిన్కూ నోచుకోలేదంటే ఈ అసమానత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహమ్మారిపై యుద్ధంలో తక్కువ సమయంలోనే యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేయడం గొప్ప విషయమే అయినా, ఆ వ్యాక్సిన్ పంపిణీ అందరికీ అందుబాటులోకి రాకపోవడం ఆందోళనకరం. సంపన్న దేశాలు, ఉత్పత్తి అయిన మొత్తం వ్యాక్సిన్ను తీసేసుకుంటున్నాయి. తమ జనాభాకంటే నాలుగు నుంచి పదిరెట్లు అధిóకంగా వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇందులో ఔషధ కంపెనీల లాభాపేక్ష, దానికి ప్రభుత్వాల వత్తాసు తప్ప ప్రజా ప్రయోజనాలేమి లేకపోవడం విషాదం. ప్రజల ప్రాణాలకన్నా కంపెనీల లాభాలకే ప్రధాన్యతనిచ్చే ఈ విధానం ఇలాగే కొనసాగితే పేద దేశాలకూ, ధనిక దేశాల్లోని పేదలకూ ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కలగానే మిగిలిపోతుంది. అప్పుడు ప్రపంచంలో వైరస్ మ్యుటేషన్లు పెరిగి కరోనా మరింత విజృంభిస్తుంది. ఈ విజృంభణకు ధనిక దేశాలు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు విడివిడిగా లేదు. ఒక ''కుగ్రామం''గా మారింది. విస్తృతమైన వాణిజ్య, పర్యాటక ప్రయాణాల నేపథ్యంలో ఏ దేశంలో కరోనా మిగిలి ఉన్నా అది అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. అందుకని ఏ దేశానికాదేశం విడివిడిగా కాకుండా ఉమ్మడిగా కృషి చేస్తే తప్ప మనమీ మహమ్మారిని అరికట్టలేం. అత్యంత కూృరమైన ఆరోగ్య సంక్షోభం కోరలు చాచిన దారుణమైన సందర్భంలో మనమున్నాం. ఈ కనీవినీ ఎరుగని విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవటమే లక్ష్యం కావాలి తప్ప వారి ఆరోగ్యాలను వ్యాపారం చేసుకోవడం కాకూడదు.
ఇప్పుడు కావాల్సింది వాక్సిన్ ప్రపంచమానవాళి అందరికీ అందుబాటులోకి రావడం. ఇది జరగాలంటే టీకా ఉత్పత్తి విస్తృతం కావాలి. సరఫరా వేగం పుంజుకోవాలి. దీనికి అడ్డుపడుతున్న పేటెంట్ హక్కుల సంకెళ్లు తెగిపోవాలి. కానీ ఈ దిశగా ప్రపంచ ఆరోగ్య సంస ్థ(డబ్ల్యూహెచ్ఓ) చేసిన ప్రయత్నాలన్నిటినీ ధనికదేశాల పెట్టుబడి అడ్డుకోవడం అమానవీయం. ఎప్పుడూ లాభాలే కాదు, ప్రజాక్షేమం గురించి కూడా అలోచించాలన్న కనీస స్పృహ కొరవడటం పెట్టుబడికి సర్వసాధారణమే. కానీ ప్రభుత్వాలకేమయింది? ఎవరు బతకాలో ఎవరు బతకకూడదో పెట్టుబడిదారుల లాభనష్టాలు నిర్ణయించడం ఎంత దారుణం? డబ్బుంటే తప్ప ప్రాణాలు దక్కని స్థితి ఎంత నీచం? చైనా ప్రభుత్వం బాధ్యతగా తన 140కోట్ల ప్రజలకూ వ్యాక్సిన్ అందిస్తోంది. క్యూబా, వియత్నాం, లావోస్లలో కోవిడ్ మరణాలే తక్కువ కాగా, అవి తమ ప్రజలందరికీ టీకాను అందుబాటులోకి తెచ్చాయి. క్యూబా చైనాలు ఇతర దేశాలకూ వ్యాక్సిన్ ఇస్తామని చెబుతున్నాయి. ఇవన్నీ సోషలిజం గొప్పతనాన్ని రుజువు చేస్తున్నాయి.
ఇందుకు భిన్నంగా గుత్తసంస్థల లాభాపేక్షకు ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నాయి పెట్టుబడిదారీ ధనిక దేశాల ప్రభుత్వాలు. లాభార్జనే ధ్యేయంగా మా వాక్సినే గొప్పదంటే మాదే గొప్పదని మహమ్మారిని సైతం మార్కెట్ చేసుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నాయి. మన దేశంలో దీనికి తోడు జాతీయ దురభిమాన్ని రెచ్చగొట్టడంలో కూడా ఆరితేరిన బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ తక్కువ తినలేదు. చైనా ప్రపంచానికి వైరస్ను ఎగుమతి చేస్తే మేం వ్యాక్సిన్ను ఎగుమతి చేస్తున్నామని బీరాలు పలుకుతోంది. ఇంతటి సంక్షోభంలో కూడా తన ప్రజలను కాపాడుకోవడం, తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడంతో పాటు కోవిడ్ను ఎదుర్కోవడంలోనూ ప్రపంచానికి చైనా అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని కావాలనే విస్మరిస్తోంది. వాక్సిన్ ఏ దేశానిదైనా దాని లక్ష్యం ప్రజల ప్రాణాల్ని కాపాడటం కావాలిగానీ, పెట్టుబడికి లాభాలు పోగేయడం, ప్రభుత్వాలకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడం కాకూడదు కదా..!