Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మర్మమెరుగకలేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖమొందుచుండ్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి' అని ఏనాడో పదిహేడవ శతాబ్దంలో వేమన చెప్పాడు. మతము అంటే అందులో ప్రధానంగా ఉండేది దేవుడు. మానవులు దేవుడిని సృష్టించుకోవడానికి, ఆ భావనలోకి రావడానికి ఒక చారిత్రక సందర్భముంది. ఏ విధమైన ఆలోచనయినా అది మనకు మంచి చేసేదయినా, చెడు చేసేదయినా ఆవశ్యక అవసరాలనుండే జనిస్తుంది. మతమూ దేవుడూ అంతే.
అనేక సంకెళ్ళ నడుమ, నిర్భంధాల మధ్య, అమానవీయతల మధ్య, హింసల, దోపిడీల, దుర్మార్గాల, మానసిక, భౌతిక ఒత్తిడుల మధ్య దేవుడు మానవీయ సాంత్వన, తనకు తానే ఆత్మిక ఓదార్పుకు అవసరమైన భావనల రూపం. అందుకే మార్క్స్ మహనీయుడు కూడా మతాన్ని హృదయం లేని సమాజంలో హృదయం, చైతన్యంలేని సమాజంలో చైతన్యం, అనేక బాధలను మరిచిపోగలిగిన మత్తుమందు లాంటిదని దాని చారిత్రక సందర్భాన్ని వివరిస్తాడు. శైశవ దశలో ప్రజలు ప్రకృతిని చూసి భయపడ్డారు. సంభ్రమం చెందారు. ఆరాధననూ కనబరిచారు. ప్రకృతి ప్రళయాల నుంచి ఆత్మరక్షణలలో కేవలం ఉట్టి చేతులు మాత్రమే గల మానవుడు తనకు తానుగానే ఒక సమాధానంగా మతాన్ని, దేవున్ని సృష్టించుకున్నాడు. ప్రకృతిపై ఘర్షణపడి విజయాలు సాధించిన సామూహిక శక్తులతో బలాఢ్యుడైన వాన్ని నాయకుడుగా భావించి దేవుడిగా కొలిచాడు. అంటే నిజమైన, శక్తిమంతమైన మానవుడే అసలు దేవుడు. దేవుడంటే అందరి బాధలను, వేదనలను తనవిగా భావించి పరిష్కారానికి పూనుకునేవాడని అర్థం. మనిషి వాస్తవంగా ఇలా ఉండాలని ఊహించుకున్న రూపమే దేవుడు అంటారు గోర్కీ మహాశయుడు.
దేవుడిని ఆలంబనగా పెట్టుకుని మానవుని ప్రయాణం ఎన్నో విజయాలను అందుకుంటూ సాగింది. భౌతిక వాస్తవికతతో నిత్యం ఘర్షణ పడుతూ తనకనుకూలంగా మార్చుకుంటూ ప్రకృతిపై నియంత్రణకు పాటుపడుతూనే ఉన్నాడు. ఎన్నో తెలియని విషయాలు ఛేదించాడు. సవాళ్ళను అధిగమించాడు. అందుకే 'మానవుడే మహనీయుడు, శక్తి హితుడు యుక్తిపరుడు, మానవుడే మానవీయుడు' అని పాటకట్టారు ఆరుద్ర. సర్వశక్తిమంతుడుగా దేవున్ని సృష్టించుకున్నదీ మానవుడే. అంతటి శక్తిని సముపార్జించు కుంటున్నదీ మానవుడే. నిరంతర శ్రమ, మేథోపరిశోధన మానవుడి విజయాలకు కారణాలు. నేటి సకల సౌకర్యాలకూ సమస్త విజ్ఞాన భాండాగారాలకు మూలం మానవుడు. మానవ నిత్య కార్యాచరణ లేకపోతే ఏవీ సాధ్యం కావు. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్య విషయం. మనిషి ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. విముక్తి కావాల్సిందీ చాలా ఉంది. వీటికోసం శోధిస్తూనే ఉన్నాడు. బాధలు పోలేదు, వేదనలు తొలగలేదు, దుఃఖం అంతం కాలేదు, దుర్మార్గాలు నిర్మూలించబడలేదు. అందుకే దేవుడు కొనసాగుతున్నాడు. విశ్వాసం కొనసాగుతోంది.
కానీ విశ్వాసాల చుట్టూ మూఢత్వమూ చుట్టుముడుతోంది. అనేక ద్వైదీయ భావనలు, అసంబద్ధ తర్కాలు, మూర్ఖమైన ఆచరణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణలు మన కండ్లముందు ఎన్నో జరుగుతుంటాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటన మచ్చుతునకగా నిలుస్తుంది. 'దేవుడిపై భయభక్తులు ఎంత పెరిగితే రోగ నిరోధక శక్తి అంత పెరుగుతుందని త్రిదండి చినజీయరుస్వామి సెలవిచ్చారు. భక్తిలో అగ్రగణ్యులైన స్వామివారు, భక్తి కలిగి ఉండాలని నిత్యం మనందరికీ బోధించే స్వామివారు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి దేవునిమీద భక్తి పెంచుకోకుండా కరోనా వాక్సిను వేయించుకున్నారు. అంటే ఆయనగారికి భక్తి సరిగాలేదని అర్థమా! భక్తి భక్తే, వాక్సిన్ వాక్సినే అని అర్థమా! కచ్చితంగా ఆయనగారికి తెలిసన విషయమేమంటే భక్తిపెరిగినంత మాత్రాన రోగనిరోధక శక్తి పెరగదని. అందుకే శాస్త్రవిజ్ఞానంపైనే, మానవ మేథస్సుపైనే ఆధారపడి ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఉల్లిగడ్డ తినడం తామసగుణాన్ని పెంచుతుందని ప్రేక్షకులకు చెప్పాను గానీ నీకేమైనా చెప్పానా! అని హరిదాసుగారు భార్యను గద్దించాడని జనవాక్యంగా చెబుతుంటారు. జీయరుస్వామిది కూడా ఇదే వరుస. కలియుగ దైవంగా భావించే తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడుగా పనిచేసిన డాలర్ శాస్త్రిగారికి గుండెనొప్పిరాగనే కొండపై నుంచి కిందకు దింపి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. డాక్టర్లు వైద్యం చేశాకే తిరిగి మంత్రాలు చదవగలిగాడు.
అంటే దైవభావన మనిషికి సాంత్వన కలిగిస్తున్నప్పటికీ భక్తులైనా, గురుబోధకులైనా భౌతిక వాస్తవికతపైనే ఆధారపడి సవాళ్ళను ఎదుర్కొంటారు తప్ప భారాన్ని దేవుడిపైకి తోసేయరు. దైవభక్తి వ్యక్తిగతమైనది. కానీ దానిచుట్టూ పోగయ్యే మూఢవిశ్వాసాలు అనేక వైపరీత్యాలకు దారితీస్తాయి. దీన్ని గమనించి ప్రజలు వ్యవహరించాలి.