Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాంప్రదాయక పెండ్లిలో బంతాట ఓ ఘట్టం. పూదండలను బంతిగా చేసి దాంతో వధూవరులను కాసేపు ఆడిస్తారు. తగలమన్నా ఎవరికీ దెబ్బతగలదు. దాదాపు చివర్లో సాగే ఒక చిన్న తతంగమది. కానీ అదే పదిరోజులు సా....గితే! దానికి అసెంబ్లీ వేదికైతే? సగటు తెలంగాణ ప్రజ పళ్లుకొరుకుతున్నారు. గులాబీ దళం సైతం ఏడ్వలేక నవ్వుతున్నారు. అపర వ్యూహకర్తగా వందిమాగధులచే కీర్తించబడే ''కారుసారు'' వ్యూహం వెలవెల పోయింది.
తెలంగాణ సాధించిన వ్యక్తి గనుక రాష్ట్ర ప్రజలు తనకు శాశ్వత పట్టా రాసిచ్చారనుకుంటే అధినాయకుడు తప్పులో కాలేసినట్టే! సరళీకృత ఆర్థిక విధానం ముదిరి పాకానపడ్డది. వ్యవసాయం దెబ్బతినింది. వృత్తులు నాశనమవుతున్నాయి. దేశ, విదేశ కార్పొరేట్ల కబ్జాలోకి దేశం, రాష్ట్రం చేరుకుంటోంది. రాష్ట్రంలో వేల పరిశ్రమలు మూతబడుతున్నాయి. ఫలితంగా ఉపాధి లేమి, పేదరికం విశ్వవ్యాపితమయ్యాయి. అప్పటికే ఆ విధానాన్ని వేగవంతం చేసిన కాంగ్రెస్, టీడీపీ మొదటి పాపాల భైరవులు, అయితే ఆ రెండు పార్టీలు అమలు చేసిన విధానాలను కప్పిపెట్టి ఆ పార్టీలను మాత్రమే విలన్లను చేశాడు కేసీఆర్సాబ్. వచ్చిన, తానే తెచ్చానను కుంటున్న తెలంగాణలో అదే విధానాలను అమలు చేస్తే జనాన్ని తిరగబడకుండా ఆపసాధ్యమా? 'పోరే' బతుకుగా, 'పోరే' ఒకదారిగా మలుచుకున్న తెలంగాణ ప్రజలు 'అధినేత' డైలాగులతోనే కడుపు నింపుకోమంటే వారు కన్న కలలేమవుతాయి?
వారి కలల్లో పచ్చటి మాగాణి పొలాలు, రాష్ట్రంలో విస్తరించిన పరిశ్రమలు, పంచరంగుల నేతన్న బతుకులు, అందరికీ ఉపాధి... తెలంగాణ కలల ఇంద్రధనస్సు ఇది. బీజేపీ నేడు దేశంలో అమలు జరిపే విధానం ఈ ఇంద్రధనస్సును ధ్వంసం చేసేది. ప్రత్యక్షంగా లక్షమందికి, పరోక్షంగా మరెన్నో లక్షల మందికి ఉపాధినిచ్చే కల్పవల్లి మన రాష్ట్రంలోని సింగరేణి. దాన్ని నేడు వధ్యశిలపై నిలబెట్టింది మోడీ సర్కార్. అతి సుతారంగా బంతాట ఆడితే మోడీ రోడ్ రోలర్ని అడ్డుకోగలమా? ''ఈరోజు స్టీల్ ప్లాంట్, రేపు సింగరేణి! మేమూ విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని ''జూనియర్'' తొడగొట్టి ఊకుంటే విశాఖ ఉక్కు ఉద్యమానికీ, మన సింగరేణికీ ప్రమాదం ఆగుతుందా? కోలిండియా ప్రయివేటీకరణకు మోడీ ముహూర్తం పెట్టేశాడు. 2020 నవంబర్ 26 ఆలిండియా సమ్మెలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం పాల్గొనలేదు. ''అవసరమైతే కేంద్ర ప్రభుత్వ 49శాతం వాటాను కూడా మా కేసీఆర్ సర్కారే కొనేస్తుందనే''ది ఆ సంఘం వాదన. ఇంతకంటే ఘోరమైన 'బంతాట' మరొకటి కేసీఆర్ ఆడుతున్నారు. మన తెలంగాణలో సుమారు 73లక్షలమంది రైతులు ఉన్నారు. వీరందరికీ ''మార్కెట్టే'' దేవుడు! అని మోడీగారి పాట! దానికి వంతపాడితే తెలంగాణ కల భగమైపోదా?! ''ఈ యాసంగి పంటలను తప్పక కొంటాం'' అని కేసీఆర్ చెప్పినదాని లోగుట్టేమిటి? దాని తర్వాత కొనం అనా? మళ్ళీ కొనాలంటే మరో ఉప ఎన్నిక రావాలా? ఆ మద్దతు ధర కోసమేగా ఢిల్లీలో రైతుల ఆందోళన! ఆ ఉద్యమాన్ని మోడీ తొక్కేసిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి ఆసరా ఏది?
మొన్న ముగిసిన అసెంబ్లీలో శాసనసభ్యులంతా కేంద్రంపై ఒంటికాలిపై లేస్తారు. రిజర్వేషన్లకు ఎసరుపెట్టడానికే ప్రభుత్వ రంగాన్ని మోడీ సర్కార్ నీరుకారుస్తోందని, రైతుల పొట్టకొట్టడానికే కేంద్రం రైతు చట్టాలు తెచ్చిందని శాసనసభ్యులంటారు, మంత్రులంటారు. చివరికి పుత్రరత్నం ''యుద్ధమే'' చేస్తానంటాడు. కేంద్రంతో అవసరాలుంటాయి కాబట్టి మూలవిరాట్ ''బంతాటే'' ఆడతాడు. రాష్ట్రమంతా బీడీ కార్మికులు పోరాడుతుంటే 'తనయ' కౌన్సిల్లో జీఎస్టీ భారం తగ్గించాలని ఒక 'ప్రశ్న' పడేస్తారు. జీడిపప్పుమీద, డ్రైఫూట్స్ లడ్డూమీద 5శాతం జీఎస్టీ ఏమిటి? పేదోడు తాగే బీడీ మీద 28శాతం జీఎస్టీ ఏమిటి? ఉత్తర తెలంగాణలోని ఆరేడు లక్షల మందిని ప్రభావితం చేసే అంశంపై కేంద్రంతో బంతాట ఆడితే సమస్య పరిష్కారమ వుతుందని కేసీఆర్ అభిప్రాయ పడటమే తెలంగాణ ప్రారబ్దం.
రైతు చట్టాలైనా, ప్రయివేటీకరణ అయినా ఒక విధానంగా కేసీఆర్కు అంగీకారముంటే అదే తన విధాన విధానమని ప్రకటిం చాలి. లేకుంటే ఆ విధానాలపై పోరాడాలి. కనీసం ఆ విధానాలపై పోరాడేవారి వెన్ను కాయాలి. ప్రజల్ని కాపాడటం, అదీ కోట్లాది సామాన్యులకు అండగా నిలవడం ఎన్నికల జిమ్మిక్కులు కావు. కొండంత బండరాయి వాలుకి దొర్లిస్తున్నాడు మోడీ. ఒకళ్లిద్దరు కాదు. వేలు, లక్షలు, కోట్ల మంది ఒక్కటై నిలవకపోతే, దాన్ని అడ్డుకోలేమని రాష్ట్ర నేతలకు ఎంత తొందరగా అర్థమైతే రాష్ట్రానికి అంత మంచిది.