Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారులు ఉత్తర కొరియాను బెదిరిస్తున్న తీరును గమనిస్తే ప్రపంచం అణుయుద్ధ మారణహోమం అంచుకు చేరిందనేది స్పష్టమౌతుంది. 'ప్రపంచం గతంలో కనీవినీ ఎరుగని భయానక అగ్నిజ్వాలను చూడబోతున్నది' అని అమెరికా అధ్యక్షుడు తరచుగా యుద్ధోన్మాద ప్రకటనలను విడుదల చేస్తున్నారు. ఉత్తర కొరియా అమెరికాను అణ్వస్త్రాలతో బెదిరించకుండా ఉండటానికి 'నిరోధక యుద్ధాన్ని' చేయటానికి అమెరికా సన్నద్ధమౌతున్నదని ఆయన జాతీయ భద్రతా సలహాదారు జనరల్ హెచ్ఆర్ మెక్మాస్టర్ హెచ్చరిస్తున్నారు. ఉత్తర కొరియాను సంపూర్ణంగా సర్వనాశనం చేయటానికి అందుబాటులోగల అనేక ప్రత్యామ్నాయాలను ట్రంప్ ముందు ఉంచామని అమెరికా రక్షణ మంత్రి మాట్టిస్ ప్రకటించారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ 'యుద్ధాన్ని యాచిస్తున్నాడు' అని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హాలే సోమవారంనాడు భద్రతా మండలిలో ప్రకటించింది.
సిరియాపై యుద్ధాన్ని ప్రకటించకుండా సంకోచించి గత అమెరికా అధ్యక్షుడు ఒబామా అంతర్జాతీయంగా అమెరికా పరువును దిగజార్చాడని అమెరికాలో ప్రభావశీలురుగా వున్న సైనికాధికారులు, అమెరికా పాలక వర్గానికి ద్రవ్య పెట్టుబడిదారీ సమూహం, రాజ్య యంత్రాంగంలో పై స్థాయిలో పనిచేస్తున్న అధికారులు భావిస్తున్నారు. అలా కోల్పోయిన అమెరికా పరువును తిరిగి పునఃప్రతిష్టించాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒకటి చెయ్యాలి. అమెరికా అలా చెయ్యాలని అనుకుంటున్న ఏదో ఒకటి కొరియా ద్వీపకల్ప సంక్షోభం రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సంక్షోభాన్ని వర్తమానంలో అమెరికా ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యగా అమెరికా పాలక వర్గాలు భావిస్తున్నాయి. అందుకే మంగళవారంనాడు అమెరికా ద్రవ్య పెట్టుబడికి కేంద్ర స్థానమైన వాల్స్ట్రీట్లో షేర్ల ధరలు పడిపోయాయి. అంతేకాకుండా గత ఏడాదికాలంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతున్నది.
అమెరికా అధ్యక్షుడి యుద్ధోన్మాద ప్రేలాపనలతో మాత్రమే ఈ యుద్ధ ప్రమాదం రావటం లేదు. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి ఎటువంటి సంఘటిత ప్రతిఘటన లేదు. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ వైపునుంచి ఎటువంటి వ్యతిరేకతా మనకు కనపడదు. కొరియా ద్వీపకల్పంలో యుద్ధమే గనుక సంభవిస్తే ఎటువంటి పర్యవసానా లుంటాయనే విషయంపై అసలు చర్చే జరగటం లేదు. ఈ ఘర్షణకు చారిత్రక, భౌగోళిక రాజకీయ సందర్భం ఉన్నదనీ, దానితో ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమానికి సంబంధం ఉన్నదనే విషయాన్ని యుద్ధోన్మాదానికి బాకాగా మారిన కార్పొరేట్ మీడియా విస్మరిస్తున్నది. 65ఏండ్ల క్రితం ఉత్తర కొరియాపై అమెరికా చేసిన యుద్ధంలో 30లక్షల మంది ప్రజలు హతులయ్యారనీ, ఆ దేశంలోగల 22నగరాలు నేలమట్టమయ్యేదాకా అమెరికా బాంబుల వర్షం కురిపించిందన్న వాస్తవాన్ని గుర్తుంచుకున్న ప్రజలు నేటికీ ఉత్తర కొరియాలో బతికి ఉన్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వారికి ట్రంప్ మాట్లాడుతున్న భయానక అగ్ని జ్వాలలు కొత్తకాదు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో వేలాది సైనికులను దించి, అణ్వయుధాలుగల యుద్ధ విమానాలతోను, జలాంతర్గాములతోను, యుద్ధ నౌకలతోను అమెరికా తరచూ బెదిరించటం ఆ దేశ ప్రజలకు నిత్యజీవితానుభవమే.
గత 25ఏండ్లుగా తాను దాడిచేయదలచిన దేశాధినేతను 'మూర్ఖుడైన నియంత'గా అభివర్ణించటం అమెరికాకు అలవాటు. ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్-ఉన్పై మోపుతున్న నేరారోపణలు అంతకుముందు నొరీగా, మిలోసవిక్, సద్దామ్ హుస్సేన్, గడాఫీలమీద మోపినటువంటివే. ఇరాక్, అఫ్ఘానిస్థాన్, లిబియా, ఇతర ప్రాంతాలలో గతంలో చేసిన యుద్ధాలు మొదలెట్టటానికి ఆయా దేశాలలో 'మానవ హనన ఆయుధాలు' ఉన్నాయనో లేక టెర్రరిజానికి వనరుగా ఉందనో లేక 'మానవ హక్కుల'కు భంగం కలిగిందనో అమెరికా సాకుగా చూపేది. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశంగా ఉందనే ఆరోపణ కూడా అలాంటిదే. ఒకవైపు ఇజ్రాయిల్, పాకిస్థాన్, భారత్ అణ్వస్త్ర ఆయుధాలను కలిగి వున్నప్పుడు అమెరికాకు లేని ప్రమాదం ఉత్తర కొరియా అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటే అమెరికా భద్రతకు ఏర్పడిన ప్రమాదం ఏమిటి? ఈ సంక్షోభం అమెరికా వైఖరి కారణంగా సృష్టించబడింది. గతంలో ఉత్తర కొరియాపై అమెరికా చేసిన యుద్ధం ప్రభావం ఆ దేశ నాయకత్వంపై బలంగా ఉన్నది.
అంతిమంగా చెప్పాలంటే కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుత అణ్వస్త్ర యుద్ధ ప్రమాదం అమెరికా రాజకీయ వ్యవస్థ వైఫల్యం కారణంగా ఏర్పడింది. ఈ వైఫల్యం మూలాలు అమెరికా, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంలో ఉన్నాయి. ఈ సంక్షోభమే ప్రపంచాన్ని అణ్వస్త్ర యుద్ధం వైపు లాగుతున్నది. అలానే ఇదే సంక్షోభం ప్రజాపోరాటాలకు పునాదిగా ఉంటుంది. ఈ పరస్పర విరుద్ధ శక్తుల జయాపయాలపైనే మానవ జాతి భవిత నిర్ధారింపబడుతుంది. అంటే పెట్టుబడిదారీ శక్తులపై విజయమా లేక అణ్వస్త్ర యుద్ధంలో వినాశనమా అనే ప్రశ్న మరోసారి ఉత్తర కొరియా రూపంలో మానవాళి ముందుకు వచ్చింది!