Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎన్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా... మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం'' అంటారు సూఫీ కవి కబీర్. నిజంగా మంచి మనిషిగా బతకడం కన్నా ఉదాత్తమైన ఆశయం ఏమీ లేదు. మంచిగా బతకడమంటే చెడు మీద తిరుగులేని పోరాటం చేయడం, దుర్మార్గాన్ని ప్రతిఘటించడం, తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పగలగడం, అభిప్రాయాల కోసం కలబడడం. గొప్ప ఆశయాలని వల్లిస్తూ అందుకు విరుద్ధంగా బతకడం కపటత్వం. నమ్మిన విలువల కోసం నిలబడటం సాహసం. ఎంచుకున్న పథంలో నడవటం అసామాన్యం.
కొండంత ఆశయాన్ని ప్రవచించగానే సరిపోదు రవ్వంత ఆచరణయినా ఉండాలి. కుల నిర్మూలన గురించి గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు, స్వయంగా తమ కుటుంబసభ్యులే కులం గోడల్ని దాటితే సహించలేక పోవడం వైచిత్రి. ''మతములన్నియూ మాసిపోవును, మంచి ఒక్కటి నిలిచి వెలుగును'' అన్న గురజాడ మాటని వచిస్తారు. కానీ నిత్యజీవన వ్యవహారాల్లో మతాచారాల తంతులన్నీ పాటిస్తారు. గురజాడ సూక్తుల్ని ఉటంకిస్తే సరిపోతుందా? ఆచరణలో అడుగు ముందు పడకపోతే మాటల్లో ఒలికే ఆశయాలు నీటిమూటలవుతాయి. మాటలు కోటలు దాటడం కాదు, చేతల్లో ఏం చేసారన్నదే ప్రధానం. ఆశయాలకీ, ఆచరణకీ పొంతన లేనప్పుడు ఉదాత్త ఆశయాల ప్రకటనలన్నీ ఊకదంపుడుగా మిగిలి పోతాయి.
సామాజిక జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ పరుల కోసమే బతుకుతున్నామని కబుర్లు చెప్పేవారు అనేకులు. ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసమే తమ జీవితాల్ని అంకితం చేస్తున్నామని చెప్పే నేతలు ఎందరో. అద్భుతమైన ఆశయాల్ని, అందమైన ఆదర్శాల్ని పదాడంబరంతో గంభీరస్వరంతో ప్రకటిస్తారు. కానీ అధికారమే పరమావధిగా, అందలాలే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలతో మంత్రాంగం నిర్వహిస్తారు. మాటల్లో మాత్రం జనహితమే తమ హితమంటారు. ఈ ద్వంద్వాలు సామాజిక, రాజకీయ, సాంస్క్తృతిక రంగాలన్నిటా పరివ్యాప్తమై ఉండటం గమనార్హం.
మాటలకీ, చేతలకీ నడుమ తేడా అనంతం. విలాసవంతమైన జీవితం అనుభవిస్తూనే పేదరికాన్నించి జనాన్ని గట్టెక్కిస్తామని చెబుతుంటారు. ఉద్యోగాల, కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎంతవరకయినా వెళతామని మాటల్లో వీరావేశాన్ని ప్రదర్శిస్తారు. చాటుమాటుగా ప్రభుత్వాలతో, యాజమాన్యాలతో లాలూచీ పడతారు. కార్మిక నాయకుడంటే శంకర్ గుహ నియోగిలా ఉండాలి. కార్మికుల హక్కుల కోసం చివరకు తన ప్రాణాల్ని కూడా అర్పించాడు. త్యాగశీలతకీ, ఉద్యమస్ఫూర్తికి సిసలైన దాఖలా శంకర్ గుహ నియోగి. జీవించినంత కాలం ఉద్యమంగా జీవించారు. ఎలాంటి ప్రలోభాలకీ, బెదిరింపులకీ లొంగక కార్మికోద్యమాన్ని నడిపాడు. చావు లేని ఆశయాల్ని ఆచరించిన నియోగి లాంటి వారి జీవితం గొప్ప పాఠం.
ఎవరి విధిని వారు నిర్వహించాలి. మనుషులుగా తమ పని తాము చేయాలి. తానొవ్వక, నొప్పింపక తప్పించుకు తిరిగే లౌక్యం నిజమైన మనుషులకు శోభనివ్వదు. చెప్పాలనుకున్నది చెప్పితీరాలి, రాయాలనుకున్నది రాసి తీరాలనే తత్వం కలం యోధులకు తప్పనిసరి. ఇది జర్నలిస్టు గౌరీ లంకేష్కు బాగా తెలుసు. ఎవరికో భయపడి తను రాయాలనుకున్నది ఎందుకు మానుకోవాలని తలపోసిందామె. మనం చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు మనుషులుగా మన అస్తిత్వానికి అర్థం ఏమిటని ప్రశ్నించిందామె. అందుకే కాషాయ ఫాసిస్టు మూకల బీభత్సాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రశ్నించిందామె. వ్యవస్థీకృత విలువలతో రాజీపడటమా? ప్రశ్నల్ని సంధించి మనిషిగా నిలబడటమా? అనుకున్నప్పుడు రెండో దానినే ఎంచుకుంది. కాషాయ ఫాసిజం ఆమె ప్రాణాల్ని బలి తీసుకున్నా, ఆమె లేవనెత్తిన ప్రశ్నల ప్రాసంగికత ఇనుమడించింది. చనిపోయి బతికింది. మాటకీ, చేతకీ అంతరం లేని జీవనశైలికి ఆమె బతుకు నడతనే పెద్ద ఉదాహరణ.
ఒకానొక దశలో మహోన్నత ఆశయాల్ని, ఆదర్శాల్ని నొక్కి వక్కాణించిన వారు అందుకు వ్యతిరేకంగా మసలుకోవడం చూస్తుంటాం. వ్యవస్థపై ధిక్కారాన్ని ప్రకటించిన వారు, దిగజారి ప్రభువుల ప్రాంగణాల్లో తచ్చాడటమే గొప్పగా తలపోస్తారు. అయినా జనం కోసమే జీవిస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఇలాంటి కవి పుంగవులు, పాటనీ, మాటనీ తాకట్టు పెట్టిన మహానుభావులు రసహీన పదాలతో, నిరర్థక వాక్యాలతో కాలం వెళ్ళదీస్తుంటారు. తామే కాదు, తమ చుట్టూ ఉన్నవారిని తమలానే దిగజార్చే కుటిల వ్యూహాల్ని అల్లుతారు.
మాయ చేసే ఇలాంటి జాదూల్నించి రక్షించుకోడం ద్వారానే మనుషులు మనుషులుగా మిగులుతారు. మంచి మనుషులుగా మసలుకునేందుకు ప్రయత్నిస్తారు. చెడు ఎక్కడ ఉన్నా నిరసిస్తారు. ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు గొంతు విప్పుతారు. హాని చేసే శక్తుల పట్ల నిర్లిప్తంగా ఉండరు. తమకెందుకు లెమ్మని మిన్నకుండిపోరు. మంచి మనుషుల జీవ లక్షణమిది. ఏ వయసులో వున్నా, ఎలాంటి స్థితిలో వున్నా అభిప్రాయాల కోసం బాధల్ని భరిస్తారు. వీళ్ళే లొంగని తరానికి ప్రతినిధులు. ప్రలోభాలకు అతీతులు. మృత్యుముఖాన నిలిచి జీవనగీతికల్ని ఆలపిస్తారు. ఆశయానికీ, ఆచరణకీ మధ్య వైరుధ్యాల్లేని మనుషులకు నిలువెత్తురూపాలుగా నిలిచిపోతారు.