Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనం ఇంకెంత కాలం....!? నేడు సామాజిక మాధ్యమాల్లో ఈ సమాజానికి యువత సంధిస్తున్న ప్రశ్న ఇది. నిజమే కదా...! సహజీవనం, సమ భావనం మంటగలిసి పోతుంటే, జాతీయ వాదానికీ, ప్రజా స్వామ్యానికీ, లౌకిక భావనలకు విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ మన భారతీయతనే ధ్వంసం చేయచూస్తుంటే మౌనం ఇంకెంత కాలం..? దేశంలో అసహనం బుల్లెట్లతో పలకరించి వెళుతున్నది. అక్షరాలు నెత్తురోడుతున్నవి. మొన్న ధబోల్కర్, నిన్న పన్సారే, కల్బుర్గీ నేడు గౌరీ లంకేశ్... మరి రేపు...? ''రేపు నన్ను చంపండి కాదు నన్ను చంపండి. నన్నంటే నన్ను చంపండి మేం గౌరీ వారసులం..'' అంటూ వేల గొంతులు సోషల్ మీడియాలో ఘోషిస్తుండగానే, గౌరీ లంకేశ్ కిరాతక హత్యకు దేశం నలుమూలలా నిరసనలు పెల్లుబుకుతుండగానే మరో ఐదు కలాలపై దేశద్రోహం ముద్రవేసి చంపేస్తామంటూ బెదిరింపులు వెలువడుతుంటే మౌనం ఇంకెంత కాలం..? శోభాడే, అరుంధతీరారు, సాగరికా ఘోష్, కవితా కృష్ణన్, షెహ్ల రషీద్లను అంతమొందిస్తామని సోషల్ మీడియాలో యథేచ్ఛగా హెచ్చరికలు జారీ చేస్తుంటే మౌనం ఇంకెంత కాలం...? గిరీష్ కర్నాడ్ సహా మరో 18మంది రచయితలకు కర్నా టక పోలీసు రక్షణ అవసర మయిందంటే మనం ఏ కాలంలో ఉన్నాం...? అక్షరాలకు రక్షణ కరువైన కాలంలో ఉన్నాం....! ఇంతకీ ఈ అక్షరాలు చేసిన నేర మేమిటి! ప్రశ్నించడమేనా..? ఆలోచనలు రగిలించడమేనా...? అసలు ప్రజాస్వామ్య స్వభావమే ప్రశ్నించడం నిరసించడం కదా...! అదే దేశ ద్రోహమైతే ఇక ప్రజాస్వామ్యానికి తావేదీ...!
ప్రశ్నను,హేతువును విశ్వసించేవారు ఇప్పుడు ఆలోచించుకోవాలి. మనం ఏ కాలంలో బతుకుతున్నామనీ..! ఆదిమ కాలం నుండి ఆధు నిక కాలం దాకా మానవజాతి ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఆదిమ, బానిస, మధ్య యుగాలను దాటి నేటి ప్రజాస్వామిక వ్యవస్థ దాకా సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేటికీ అందరికీ అన్నం, ఆత్మగౌరవం అందని ద్రాక్షలే కావొచ్చు. దోపిడీ ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకొని మానవ శ్రమను హరిస్తూనే ఉండొచ్చు. సరిహద్దు యుద్ధాలు సాగుతూనే ఉండొచ్చు. అయినప్పటికీ మనం ప్రయాణం సాగిస్తూనే ఉన్నాం. ఆదర్శాలను సాధించడానికి అడుగులు వేస్తూనే ఉన్నాం. వదిలించుకోవాల్సిన వాటన్నిటి మీదా పోరాడుతూనే ఉన్నాం. చరిత్ర గమనంలో ముందుకు సాగుతూ లక్ష అపజయాల తరువాతనైనా ఒక విజయం సాధిస్తున్నాం. ఈ కాసింత విజయాన్ని కూడా తన్నుకు పోవడానికి, అనాదిగా ఆలోచనల అగ్గిలో పుటం పెట్టుకున్న అపారమైన మానవ మేధను తిరిగి అజ్ఞానంలో తుప్పు పట్టించడానికీ ప్రతీఘాత శక్తులు కోరలు చాస్తుంటే ఇంకా మౌనం ఎంత కాలం...? హేతువుకు నిలబడలేక, వాదనకు గెలవలేక చివరకు భౌతిక నిర్మూలనకు సైతం తెగబడుతుంటే మౌనం ఇంకెంత కాలం..?
''ఇతర విశ్వాసాలపై దాడి చేయడం కూడదు. నిజమైన విశ్వాసి ఇతర విశ్వాసాలలోని ఆదరణీయమైన అంశాలన్నిటినీ గౌరవిస్తాడు'' అని చెప్తాడు అశోక చక్రవర్తి. కానీ నేడు ఒక విశ్వాసం కలిగి ఉండటమే తప్పు. నిజం మాట్లాడటమూ తప్పు. ఓ లౌకిక భావనే తప్పు. హేతువు తప్పు. ప్రశ్నించడం తప్పు. తప్పని ఒప్పుకోకపోతే అసహనం చిమ్మే ద్వేషాన్ని ఎదుర్కోవాలి. హింసను ఎదుర్కోవాలి. ఇంట్లోకి చొరబడి మెత్తగా గుండెల్లోకి దించే తుపాకీ గుండ్లను ఎదుర్కోవాలి. ఇదే కదా ఇవ్వాళ జరుగుతున్నది...! దేశంనిండా జడలు విప్పుతున్న అసహనపు భూతం సృష్టిస్తున్న భయాందోళనలే కదా...!
మరి భయపడదామా...! మానవజాతి సుదీర్ఘ ప్రయాణంలో ఇటువంటి ప్రతీఘాత శక్తులు ఈ దేశానికి కొత్తేమీ కాదు కదా...? ఈ శక్తులకే భయపడితే దయానంద సరస్వతి విగ్రహారాధన వ్యతిరేకించేవాడా..? బ్రహ్మ సమాజం కుల వ్యవస్థను వ్యతిరేకించేదా..? మహాత్మా జ్యోతిబాఫూలే బ్రాహ్మణవాద దౌష్ట్యాన్ని ఖండించి బహుజనుల విముక్తి గురించి ఆలోచించే వాడా..? వీరేశలింగం వితంతు వివాహాలు జరిపేవాడా..? అంబేద్కర్ ఆశాకిరణమై అవతరించే వాడా...? ఇంకా చరిత్ర లోతుల నుండి చెప్పుకోవాలనుకుంటే గౌతమ బుద్ధుడి నుంచీ చార్వాకుల, సత్యకాముడి, ఆర్యభట్ట వరాహమిహిరుల నుంచి, ప్రశ్నల కంటకారణ్యం నుండే కదా ఈ ప్రపంచం నడుస్తూ వస్తున్నది...! మరి నేడు ఆ ''ప్రశ్నే'' దేశద్రోహమవుతుంటే మౌనం ఇంకెంత కాలం...?
ఓనం కార్యక్రమంలో బీఫ్ తిన్న నేరానికి జాతీయ ఉత్తమ నటి సురభి లక్ష్మి హిందూత్వ శక్తుల ఆగ్రహానికి గురవుతున్నది. ఈ దేశానికి తొలిసారి ''ఆస్కార్''ని మోసుకొచ్చిన ప్రఖ్యాత సంగీతకారుడు ఏ.ఆర్. రెహమాన్, ''ఇది నా భారతదేశం కానే కాదు'' అంటున్నాడు. కాళోజీ చెప్పిన ''ఏకీభవించని వారి పీక నొక్కు సిద్ధాంతం'' అమలవుతున్న కాలమిది. తమ అభిప్రాయాలతో, ఆలోచలతో ఏకీభవించని వారిపై నేడు ఓ అప్రకటిత యుద్ధ్దమే జరుగుతుందీ దేశంలో... ఈ యుద్ధంలో హేతువుపై మూఢత్వం దాడి చేస్తోంటే మౌనం ఇంకెంత కాలం...? ఇష్టమైన తిండి తినే హక్కుపై ఆహార సంస్కృతిని నియంత్రించే ఆధిపత్యం దాడి చేస్తోంటే మౌనం ఇంకెంత కాలం...? ప్రజాస్వామిక హక్కులపై నియంతృత్వ పోకడలు కత్తులు దూస్తుంటే మౌనం ఇంకెంత కాలం...? ఇప్పుడు మౌనం ఈ దేశానికి మరింత ప్రమాదకరం..!