Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సమావేశాలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిచ్చింది. 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులూ సంబంధిత శాఖల ఉన్నతాధికారులూ పాల్గొన్నారు. అది అమల్లోకి వచ్చిన తర్వాత ద్వితీయ సమావేశాన్ని భాగ్యనగరంలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జీఎస్టీ అమలు అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు భారంగా తయారైంది. ప్రాజెక్టులకు 5 నుండి 11 శాతం పన్ను పెంచడం వలన రూ 9వేల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి పాత పన్నుల విధానాన్నీ నడుస్తున్న ప్రాజెక్టులను కొనసాగించాలనీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని అడిగారు. ఆయన కుదరదన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి జీఎస్టీ సమావేశాలు ఇక్కడ పెట్టారో ఆ లక్ష్యం నెరవేరలేదు. పైగా మంత్రి అరుణ్జైట్లీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించినా, మినహాయించినా అది ఆ రాష్ట్రాలకే నష్టం చేకూరుతుందని హితబోధ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన అంచనాలూ లెక్కలూ సరిచూసుకోవాలని ఆయన సూచించారు. అరుణ్జైట్లీ సూచనను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల ఖండించలేదు. మా లెక్కలు వాస్తవాలేనని ప్రకటించలేదు. మొదట జీఎస్టీ వ్యతిరేకించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైంది. అప్పుడు కేంద్రానికి వత్తాసు పలికింది. ఇప్పుడు తగ్గించాలని కోరితే అవహేళనగా మాట్లాడినా ప్రతిఘటించలేదు. అడుక్కుంటే వచ్చేది హక్కులు కావు అన్న సంగతి ఉద్యమ పార్టీకి, ప్రభుత్వానికీ తెలియంది కాదు.
ఇంత జరిగినా మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్టోబర్ 24 నాటికి జీఎస్టీ మీద స్పష్టత వస్తుంది అని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరింది పన్ను మినహాయింపు. అది వచ్చే సమావేశంలో ఎట్లా స్పష్టత వస్తుందో పాలకులకే తెలియాలి. జీఎస్టీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదులు చేశాయి. వినతి పత్రాలిచ్చాయి. వాటిని ఫిట్మెంట్ కమిటీ పరిశీలిస్తుందనీ, దానికి ముందే కమిటీ వేస్తామనీ ప్రకటించారు. అభివృద్ధి పనులకు ప్రాజెక్టులను తగ్గించేదే అయిుతే ఈ సమావేశంలోనే తగ్గించేవారు. ఒక వేళ వచ్చే సమావేశంలో తగ్గిస్తారూ అని అనుకుంటే అప్పటి వరకూ అభివృద్ధి పనులను ఆపుతారా? కొనసాగిస్తారా? జీఎస్టీ పన్ను సాకుతో పనులు ఆగుతున్నాయని నెపం కేంద్రంపై తోసేసి ప్రజావ్యతిరేకత నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది తప్పని అరుణ్జైట్లీ అంటున్నారు. జీఎస్టీ అభివృద్ధికి ఆటంకమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ లెక్కలు తేల్చి కేంద్ర ఆర్థిక మంత్రి అబద్ధాలను బయటపెట్టాలి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా భావించాల్సి వస్తుంది.
జీఎస్టీ 63 కేటగిరీలుగా పన్నులు విభజించింది. 70 వస్తువులను ఒక కేటగిరీ నుండి మరొక కేటగిరీకి మార్చాలని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమావేశంలో 30 వస్తువుల కేటగిరీని మార్పులు చేశారు. చింతపండు, ఇడ్లీపిండి, చీపురుకట్టల పన్నులు తగ్గించి, లగ్జరీ కారు టాక్స్ పెంచారు. హస్త కళలో గ్రామీణ ఖాదీ ఉత్పత్తులను, పన్నుల పరిధి నుండి మినహాయించి ఊరట కలిగించారు. గ్రానైట్, బీడీ పరిశ్రమపై చర్చించ లేదు. ఎజెండాలో లేదని దాటవేశారు. అది కూడా ఫిట్మెంట్ కమిటీకి అప్పగిస్తామని చేతులు దులుపుకున్నారు. రైతులూ చేనేత కార్మికుల ఊసే లేకపోవడం అన్యాయం. దేశంలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. జీఎస్టీ భారంతో వీరి జీవితాలు ఒడ్డున పడ్డ చేపల్లా తయారవుతాయి. ఈ ఉభయ రంగాల్లో ఇంకా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం లేక పోలేదు. వచ్చే సమావేశాల్లోనైనా ఈ రంగాలపై చర్చించాల్సిన అవసరం ఉంది.
జీఎస్టీ పన్ను విధుల వరకే పరిమితం కాదు. ఇది ఆర్థిక విధానంలో భాగం. ఎవరి మీద పన్నులు వేయాలి. ఎవరి మీద పన్నులు తగ్గించాలనే నిర్ణయం దేశాన్ని ఏ దిక్కు నడిపించాలనే నిర్ణయాలలో జీఎస్టీది కీలక పాత్ర. వచ్చే వారం నుంచీ కేంద్ర బడ్జెట్ రంగం సిద్ధం చేయబోతున్నట్టు తెలుస్తున్నది. 2019లో సాధారణ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఇదే బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కానుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తూ తొలిసారిగా ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా ఇదే కానుంది. జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసి ట్రేడ్ మార్క్ ఉన్న వాటికే బ్రాండెడ్ ఐటెమ్స్గా పరిగణిస్తామని చెబుతున్నారు. బ్రాండెడ్ వస్తువులకు పన్ను మినహాయింపు ఉండదు.
వస్తుసేవల పన్ను తమ బ్రతుకులను చిóదం చేస్తుందని పలు రాష్ట్రాలకు చెందిన ఆందోళనకారులు హైదరాబాద్కు తరలివచ్చారు. జీఎస్టీని ఎత్తివేయాలని నిరసన తెలిపారు. నిరసనకారులతో ఈ పన్నుల విధానం వలన చిన్న వ్యాపారులు దెబ్బతిని కార్పొరేట్ శక్తులను బలిపించడానికి జీస్టీని రంగం మీదకు తెచ్చారని వామపక్షాలు చెప్పినదాంట్లో వాస్తవం కనిపిస్తోంది. 2019 బడ్జెట్తో గానీ ప్రజల మీద ఎంత భారం పడుతుందనే రహస్యం బయటపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ దిశా దశా మార్చే జీఎస్టీని వ్యతిరేకించాలి. ఇందుకు వత్తాసు పలికే పార్టీల గుట్టు రట్టు చేయాలి. ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయాలి.