Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరేబియన్ దీవులను నాశనం చేసిన తరువాత ఇర్మా పెనుతుఫాన్ అమెరికా తీరాన్ని తాకింది. 130 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో ఫ్లోరిడా కీస్ ప్రాంతం అతలాకుతలమైంది. తుఫాను తాకిడికి లోతట్టు దీవులు 10 అడుగుల నీటిలో మునిగిపోయాయి. 400 మైళ్ళ వెడల్పున వ్యాపించిన ఈ పెనుతుఫాను ఫ్లోరిడా రాష్ట్రం మొత్తాన్ని ఆవహించింది. అది ఫ్లోరిడా దక్షిణ తీరం నుంచి టంపా ప్రాంతాన్ని అర్థ రాత్రికల్లా చేరుకుని తీవ్రస్థాయిలో దెబ్బతీసింది. ఆగేయప్రాంతంలోని మియామిలో వర్షం విపరీతంగా కురియటంతో ద్వీపకల్పానికి ఇరు వైపులా కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు ముంచెత్తాయి. ఇర్మా పెనుతుఫాను చాలా తీవ్రమైనది. ఇది కోట్లాది ప్రజల జీవనాన్ని దారు ణంగా దెబ్బతీసింది. ఫ్లోరిడాలో 65లక్షల మంది ప్రజలను, జార్జియాలో దాదాపు ఆరు లక్షలమంది ప్రజలను తమ ఆవాసాలు వీడి వెళ్ళాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని లోపలి ప్రాంతాలలోగల హౌటళ్ళలో వేలాది గదులను ప్రజలు బుక్ చేసుకున్నారు. ఈ తుఫానులో అనేకమంది మరణించారు. కానీ 50మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఆరంభ అంచనాల ప్రకారం ఇర్మా పెనుతుఫాను వల్ల సంభవించిన నష్టం విలువ 200 బిలియన్ డాలర్ల (ఇది 13లక్షల కోట్ల రూపాయలకు సమానం) వరకూ ఉంటుందని అనుకుం టున్నారు. ఈ నష్టం అంతకుముందు వారం టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరాన్ని తీవ్రంగా దెబ్బతీసిన హార్వే తుఫాన్ వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ.
ఇర్మావంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల సామాజిక, రాజకీయ జీవనానికి సంబంధించిన మౌలిక నిర్మాణాల తీరుతెన్నులు ఎలా వున్నాయో తెలుస్తుంది. సమాజ మౌలిక అవసరాలను పట్టించుకోని పాలకవర్గం గల దేశంలోని సామాజిక అసమానతలను, క్షీణిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ఇర్మా, హార్వే పెనుతుఫాన్లు నగంగా నిలబెట్టాయి. హూస్టన్ నగరంలోని పేదలకు బీమాలేని కారణంగా తమ గృహాలను పునఃనిర్మించు కోవటానికి ప్రభుత్వం నుంచి కనీస సహాయం అందటం లేదు. ఈ పెనుతుఫాను తీవ్రతవల్ల చాలామంది తమ ఆవాసాలను వదలి రాలేక పోయారు. ప్రజలను తమ నివాసాలను వదలి రావాలని ఆదేశించిన ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహకారం లభించలేదు. విమానాల్లో, రైళ్ళలో ప్రయాణించటానికి డబ్బులేక ఎంతో మంది ఇర్మా పెనుతుఫానులో చిక్కుకు పోయారు. తగిన ప్రణాళిక లేకపోవటం, కార్లకు కావలసిన చమురు అందుబాటులో లేక పోవటం, నివాస సౌకర్యం తగినం తగా లేకపోవటంతో కార్లు ఉన్నవారు కూడా ఇర్మాకు దూరంగా వెళ్ళలేకపోయారు. ప్రస్తుతం 20 లక్షల మంది ప్రజలకు కరెంటు సదుపాయం లేదు. అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ కరెంటు భూగర్భంలో వేసిన కేబుల్స్ ద్వారా కాక నేలపైన స్తంభాలపై వేసిన కరెంటు తీగల ద్వారా సరఫరా అవుతున్నది. దానితో అనేక వారాలపాటు లక్షలాదిమంది కరెంటు సరఫరా లేకుండా గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. అశేష సంఖ్యలో ప్రజలు తమ తక్షణ సమస్యలకు ఆవల ఆలోచించ గలుగుతున్నారు. రైళ్ళను ఉపయోగించి ప్రజలను ఇర్మా ప్రభావం చూపగల ప్రాంతాలకు దూరంగా ఎందుకు తీసుకుపోలేక పోతున్నారని వారు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు స్పందన ప్రధాన స్రవంతి మీడియాలో గానీ, ప్రభుత్వ వర్గాల నుంచి గానీ, రాజకీయ నాయకుల నుంచి గానీ రాలేదు. ఇర్మావంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవటానికి సమాజంలోని వనరులను ప్రణాళికాబద్ధంగా ఎందుకు సమీకరించ లేకపోతున్నారు? రైళ్ళతోనే కాకుండా రోడ్డు మార్గంలో బస్సులు, జల మార్గంలో నౌకలను ఉపయోగించి జనాలను తరలించవచ్చు. అలాగే హోటళ్ళను, అనేక రకాల ఇతర ఆవాసాలను తాత్కాలిక నివాసాలుగా మార్చవచ్చు. నిజానికి వీటన్నింటికీ సరిపడా వనరులు లేక కాదు. ఈ వనరులను ఇతర లక్ష్యాలకోసం తరలించటం జరుగుతున్నది.
అనేక దశాబ్దాలుగా ప్రపంచాన్ని ప్రపంచీకరించి, నయా ఉదారవాద విధానాలను ప్రవేశపెట్టి అమెరికా పాలక వర్గాలు ప్రజలను కౄరమైన దోపిడీకి గురిచేస్తూ ఒక ధృవంవైపు అంతులేని సంపదను, మరో ధృవంవైపు దారుణమైన పేదరికం పోగుపడటానికి కారణమౌతున్నాయి. తుఫాన్లవంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడటానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయకుండా ప్రజలను దోపిడీ చేయగా వచ్చిన ధనాన్ని పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం తరలిస్తున్నది. ఇలా వనరులను స్వీయ ప్రయోజనాల కోసం తరలించటం, అవసరానికి మించి వున్న సైనిక బలంతో ఇతర దేశాలను కబళించటమే అమెరికా పాలకవర్గాలకు తెలుసు. అంతేగానీ ప్రజా సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేయటం ఈ వర్గాల ఊహల్లో కూడా ఉండదు. అమెరికాలోని అపార వనరులను ఆ దేశ పాలక వర్గాల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయకపోతే ప్రజల సామాజిక అవసరాలకు ఎల్లవేళలా కొరత ఉంటూనే ఉంటుంది. బ్యాంకులను, పరిశ్రమలను ప్రభుత్వ యాజమాన్యంలో వుంచి వాటిపై ప్రజాస్వామిక నియంత్రణ ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారమౌతాయి. అంటే పాలక వర్గాల చేతుల్లో బందీ అయిన ప్రజల సంపదను సమాజ శ్రేయస్సుకోసం తరలించటమే ప్రజల ముందున్న కర్తవ్యం.