Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపారమైన మానవ వనరులకు నిలయం భారతదేశం. 130 కోట్లకు పైగా జనాభాతో చైనా తరువాత అత్యధిక జనాభా కలిగిన దేశంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నది. అయినప్పటికీ మానవ నరులలో మనదేశమే నెంబర్వన్. ఎందుకంటే మన దేశ జనాభాలో 40శాతానికి పైగా యువజనులే...! ప్రపంచంలో మరే దేశానికి ఇంతటి యువ సంపత్తి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇంత మానవ వనరులు ఉంటే మానవవనరుల అభివృద్ధిలో మాత్రం ఆ దేశానికి అట్టడుగు స్థానం..!? 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించిన గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారత్ 103వ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాపితంగా మానవ వనరులను అభివృద్ధి చేసుకుని, ఆ అభివృద్ధినే పెట్టుబడిగా ఉపయోగించు కోవడంలో వివిధ దేశాల స్థితిగతులను తెలియజేస్తూ విడుదలైన ఈ సూచిలో భారత్ కంటే వెనుకబడినవి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మాత్రమే..! శ్రీలంక, నేపాల్ సైతం మనకంటే ముందుండటం గమనార్హం. మానవవనరులకు నైపుణ్యాలను అందించి, విశ్వవిపణిలో సత్తా చాటుతున్న దేశాల్లో మనకంటే చాలా చిన్న దేశమైన నార్వే అగ్రస్థానంలో ఉండగా, అపారమైన మానవ వనరులు, వాటి అభివృద్ధికి అంతులేని సహజ వనరులు కలిగిన భారత్ అట్టడుగు స్థానానికి పడిపోవడం విచారకరం.
ఈ దేశంలో అత్యధికులు నైపుణ్యం అవసరం లేని ఉపాధిలోనే గడిపేస్తున్నప్పుడు ''హ్యూమన్ క్యాపిటల్'' అనేదానికి అవకాశమెక్కడుంటుంది..! నైపుణ్యాలనే ఇవ్వలేని దేశం ఇక ఆ నైపుణ్యాలను పెట్టుబడిగా ఉపయోగించడానికి ఆస్కారమెక్కడుంటుంది...? ప్రాథమిక స్థాయి విద్యావాప్తిలో సైతం 110వ స్థానంలో ఉన్న దేశం నైపుణ్యాలనేమి అందించగలదు. విద్యారంగం నుండి ప్రభుత్వం తప్పుకుని, ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలన్న ప్రపంచబ్యాంకు ఆదేశాల పట్ల ఉన్న విధేయత ప్రజల పట్ల కనీసంగా లేని ప్రభుత్వాలున్నచోట వనరుల దోపిడీయే తప్ప వనరుల అభివృద్ధి ఎందుకుంటుంది...? గత రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతున్నాయి. ప్రయివేటు రంగంలో ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, బీఈడీ మొదలైన ప్రొఫెషనల్ కాలేజీలు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. వీటిద్వారా విద్యాభివృద్ధి కాకుండా కోట్లకు పడగలెత్తాలనే యాజమాన్యాలు అర్రులు చాస్తుంటాయి. ఇక నైపుణ్యాలు ఎక్కడి నుండి వస్తాయి...! ఈ ప్రొఫెషనల్ విద్యా సంస్థలకంటే ముందే ఇంటర్ మీడియట్ స్థాయిలోనే ప్రారంభమైన ప్రయివేటు రెసిడెన్షియల్ కళాశాలలు ఇంతింతై వటుడింతై అన్నట్టు బడా కార్పొరేట్ సంస్థలుగా ఎదిగి ప్రభుత్వాలనే శాసించే స్థితికి చేరాయి. విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వ కళాశాలల్లోనూ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట చదువును వ్యాపారమయం చేసారు. దీంతో ఉన్నత విద్య మొత్తం వ్యాపారుల చేతుల్లోకి పోయింది. సామాన్యుడికి ఉన్నత విద్య ఎండమావిగా మారింది.
ప్రాథమిక, మాధ్యమిక విద్యలో కూడా ప్రభుత్వం పాఠశాలల బాధ్యత విద్యాకమిటీల పేరుతో క్రమంగా తల్లిదండ్రులపైకి నెడుతున్నది. సరైన బడ్జెట్ కేటాయింపులు లేక ప్రభుత్వ విద్యారంగంలో కనీస సౌకర్యాలు కూడా బలహీన పడుతున్నాయి. ప్రయివేటురంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు బుద్ధిపూర్వకంగానే ఈ పద్ధతి అనుసరిస్తున్నాయి. సహజంగానే తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపట్ల విముఖత, ప్రయివేటు విద్యపట్ల సుముఖత పెంచుకుంటున్నారు. కానీ ప్రయివేటు విద్యను ఆశ్రయించే శక్తి ఈ దేశంలో ఎంతమందికి ఉంది...? కొనుక్కోగలిగినవాడిదే విద్య...! కొనుక్కోలేని అసంఖ్యాకులైన పేదల పిల్లలంతా ఉన్నత విద్యకు దూరమవుతుంటే ఇక మానవవనరుల అభివృద్ధి ఎలా సాధ్యం...? ఈ దేశంలో భాగమైన గిరిజనులు, దళితులు, మహిళలు, వెనుకబడిన తరగతులు నేటికీ ఉన్నత విద్యకు నోచుకోకుంటే మానవవనరుల అభివృద్ధి ఎట్లా సాధ్యం...? ఉన్నత విద్య అందుబాటులో ఉన్నవారికి కూడా సృజనాత్మకతా, ఆలోచనాశక్తీ పెంపొందించకుండా విద్యార్థులను రుబ్బుడు యంత్రాలుగా మార్చేస్తుంటే మానవవనరుల అభివృద్ధి ఎలా సాథ్యం...?
మన దేశంలో ప్రతి వెయ్యి కుటుంబాలకు 331 కుటుంబాల్లో చదువుకున్నవారు ఒక్కరూ లేరు... ప్రతి వెయ్యికి 633 కుటుంబాల్లో చదువుకున్న మహిళలు లేరు... 50శాతం బడులు ఒకే ఒక్క గదిలో నడుస్తున్నాయి. 92శాతం బడుల్లో ఆడపిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. ఈ పరిస్థితి మెరుగు పడకుండా మానవవనరుల అభివృద్ధి సాధ్యమా...? నోరు తెరిస్తే సమాచార, సాంకేతిక విప్లవం గురించి, కంప్యూటర్ల గురించి, హైటెక్ పాలన హంగుల గురించీ నిరంతరం జపం చేసే మన ఏలికలకు ఈ ''వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్'' నివేదిక ఓ కనువిప్పు కావాలి.
ఒకవైపు నైపుణ్యాన్ని అందించడంలోనూ, చదువుచెప్పడంలోనూ విఫలమవుతున్న ప్రభుత్వం చదువుకున్న మేరకైనా యువతకు ఉపాధి కూడా చూపించలేకపోతోంది. యువత శక్తిసామర్థ్యాలను అభివృద్ధికి వినియోగించుకోలేకపోతున్నది. నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్ల యువత శక్తిసామర్థ్యాలు వృథా అవుతున్నాయి. మొత్తం మీద మానవనరుల అభివృద్ధిలోనూ, దేశంకోసం వాటిని వినియోగించు కోవడంలోనూ ప్రపంచంలోనే మనదేశానికి మించిన అసమర్థపాలకులు లేరని తేలింది. మన పాలకవర్గాలకిది సిగ్గుచేటు.