Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు తాను ప్రత్యామ్నాయం కాజాలదని కాంగ్రెసు మరోసారి రుజువు చేసుకున్నది. రాష్ట్ర ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. అయినా శాసనసభ వేదికగా ప్రజా సమస్యలు చర్చనీయాంశాలు చేయటంలో విఫలమవుతున్నది. బరిలోకి దిగకుండానే చేతులెత్తేసే దయనీయమైన స్థితిలో కాంగ్రెసు కొట్టుమిట్టాడుతున్నది. ప్రజల గుండె చప్పుడుగా నిలిచే వామపక్షానికి తగిన బలం లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. టీడీపీ, బీజేపీలు అనధికార మిత్రపక్షాలు గానూ, అధికారపార్టీ భజనతో ఎంఐఎం తరిస్తున్నాయి. మొత్తం మీద విపక్షాల బలహీనతలే అధికార పక్షం బలంగా ఉన్నది.
యాభైరోజులు శాసనసభ నడుపుదామని ముఖ్యమంత్రి ప్రకటించగానే కాంగ్రెసు నాయకత్వం గుడ్లు తేలేసింది. గత కొన్నేండ్లుగా శాసనసభను తగినంత కాలం సమావేశపరచకుండా, ప్రజా సమస్యలు చర్చించకుండా, చట్టసభలను నామమాత్రపు ఆభరణాలుగా మార్చేసారు. ఎన్ని రోజులైనా నడుపుదామని ముఖ్యమంత్రి ప్రకటించటంతో కాంగ్రెసుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు అధికార పక్షం పని సులభమైంది. అప్రజాస్వామిక విధానాలు అమలు చేస్తూనే... ఆచరణలో ప్రజాస్వామిక చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ప్రజలను మభ్యపెట్టగలుగు తున్నది. సీపీఐ(ఎం) ప్రతినిధికి సమయం ఇవ్వరు. కాంగ్రెసు ప్రతినిధులు సమయం తీసుకోరు. మిగతావారు లాలూచీ కుస్తీలతో పాలకుల కనుసన్నల్లో మెదులుతారు. ఇదీ నేటి సభాపర్వం తంతు. యాభైరోజులు సమావేశాలనగానే కాంగ్రెసు గుండెలు జారిపోయాయి. ఇప్పుడు ఇరవై రోజులతో ముగించుదామని ముఖ్యమంత్రి చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు.
అత్యంత కీలకమైన సమస్యల మీద ప్రభుత్వాధినేత ప్రధాన ప్రతిపక్షానికి సవాలు విసిరారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ఎవరికైనా కానట్టు సమాచారం ఉంటే సభాముఖంగా దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. దీంతో కాంగ్రెసు శాసనసభా పక్షానికి నోటిలో తడి ఆరిపోయింది. గ్రామ గ్రామాన రుణమాఫీ సక్రమంగా అమలు కాక ఇబ్బందులు పడుతున్న రైతులున్నారు. వడ్డీ మాఫీ కాక రుణవిముక్తులు కానివారు కోకొల్లలు. వడ్డీ కట్టుకోగలిగిన వారు వారే చెల్లించి పాస్ పుస్తకాలు బ్యాంకుల నుండి వెనక్కి తీసుకున్నారు. పేద రైతుల పరిస్థితి మొదటికొచ్చింది. వడ్డీ మాఫీ కాదు. పాస్పుస్తకాలు తిరిగిరావు. కొత్త అప్పుల కోసం వడ్డీ వ్యాపారులే దిక్కు. రైతు సమన్వయ సమితుల విషయంలోనూ చర్చకు సిద్ధమేనని అధికార పక్షం ఆహ్వానిస్తే కాంగ్రెసు తోక ముడిచింది. తెలంగాణ ఉద్యమకాలంలో దద్దరిల్లిన నినాదం 'నీళ్ళు, నిధులు, నియామకాలు' ఇప్పుడు కొత్తరాష్ట్రంలో కూడా కొలువులకోసం కొట్లాడక తప్పటం లేదు. ఈ సమస్యనూ, చర్చకు పెట్టి అధికార పక్షాన్ని బోనులో నిలబెట్టవచ్చు. క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకునేందుకు గ్రామ గ్రామాన కార్యకర్తలున్న పార్టీ అది. అయినా చేష్టలుడిగి జబ్బలు జారేసింది. అంతేకాదు, రాష్ట్రమంతా నేడు సమస్యల పుట్ట. యాభైకాదు... వందరోజులైనా తెగని చేంతాడు లాంటి సమస్యల కుప్ప. అయినా కాంగ్రెస్ చేతులెత్తేసింది. కాంగ్రెసు విధానాల డొల్లతనం ఒక కారణం కాగా, నేతల లొసుగులు మరో కారణంగా చర్చ సాగుతున్నది.
కాంగ్రెసు శాసనసభాపక్ష నేత మెతకదనం మర్మమేమిటని గత కొంతకాలంగా కాంగ్రెసు శ్రేణులే చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకత్వం నోరులేని, చొరవలేని స్థితి గురించి గొణుగుతున్నారు. ప్రస్తుత నాయకత్వమైనా, నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న వారైనా వ్యాపార లావాదేవీల కారణంగానే అధికారపార్టీని నిలదీయలేక పోతున్నారని కాంగ్రెసు శ్రేణుల్లో గుసగుసలు. అసలు వీరూ... వారూ... అన్న తేడా లేకుండా ప్రధాన నేతల అక్రమ లావాదేవీల చిట్టా పాలకుల చేతుల్లో ఉన్నదనీ, అందుకే కాంగ్రెసుకు నోరాడటం లేదని కాంగ్రెసు కార్యకర్తలే చెవులు కొరుక్కొంటున్నారు. కాంగ్రెసు చరిత్ర అవినీతి పుట్ట అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అధికారంలో ఉన్నకాలంలో కక్కుర్తి కేసుల చిట్టా చేతిలో పట్టుకుని అధికారపక్షం కాంగ్రెసు పార్టీని ఆడిస్తున్నదన్న భావన బలపడుతున్నది. ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఎక్కడో నొక్కుతారన్న భయం కాంగ్రెసును వెన్నాడుతున్నది. వీటన్నిటినీ మించి, కాంగ్రెసు విధానాలనే అమలు చేయటంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా తప్పుపట్టగల స్థితిలో కాంగ్రెసు లేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం వెతుకుదామని గతంలో రెండు రోజులు సమావేశమైన శాసనసభలో నిర్దిష్ట పరిష్కారాలు చూపలేక చతికిలబడింది. విపక్షం విఫలమైందని సభాముఖంగానే ప్రభుత్వాధినేత ప్రకటించటంతో దిక్కుతోచని స్థితిలో పడింది. జవాబు చెప్పుకోవాల్సిన పాలకపక్షమే ఎదురుదాడికి దిగితే నోరు మెదపలేక పోయింది. ఈ పరిస్థితులే ప్రజలు మరో ప్రత్యామ్నాయం కోసం వెతికే అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ప్రజలే. ప్రజాసమస్యలే ఎజెండాగా పనిచేసే వామపక్షాలతో కూడిన ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాలి.