Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబర్ 8 భారత ప్రజల జీవితంలో చీకటి రోజు. ఒక్క అనాలోచిత నిర్ణయం మొత్తం ఆర్థిక వ్యవస్థను అంధకారంలో ముంచిన తీరుకు నాందిగా నిలిచింది. నోట్ల రద్దు నిర్ణయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశమంతటా నిరసనల వెల్లువైంది. అయినప్పటికీ ప్రధాని మాయాజాలం కొనసాగుతూనే ఉంది. కండ్లముందర నిజాలు కనిపిస్తున్నా, ఆయన కనికట్టు గుట్టు రట్టయినా మోడీ గారడీ మాత్రం ఆగడం లేదు. యావత్ దేశం ఇది ప్రజలపై మోడీ దాడి అంటూ నవంబర్ 8ని చీకటి రోజుగా నిరసిస్తుంటే, ఆయన మాత్రం ఇది ప్రజలు పోరాడి గెలిచిన యుద్ధం అంటూ మాటలతో మాయజేయ చూస్తున్నారు. ఈ అనాలోచిత నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడటంతో లక్షలాది మంది నిరుద్యోగులయ్యారనీ ప్రజలు, ప్రతిపక్షాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతుండగా ప్రధాని మాత్రం ఇది అవినీతి, నల్లధనంపై విజయమని చెప్పుకుంటున్నారు. నిజానికి నోట్లరద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్య ప్రజలకు ఒరిగిందేమిటి..? బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడం ప్రజలు బాధితులుగా మిగలడం తప్ప అవినీతి ఆగిందీ లేదు, నల్లధనం దొరికిందీ లేదని రిజర్వు బ్యాంకు నివేదికలే స్పష్టం చేస్తుంటే ప్రధాని మాత్రం ఇంకా ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘోర వైఫల్యానికి నిరసనగా ప్రజలంతా నవంబర్ 8ని బ్లాక్ డేగా జరుపుకుంటుంటే, అందుకు పోటీగా యాంటీ బ్లాక్ మనీడేగా జరుపుకోవడం అధికార బీజేపీకే చెల్లింది. యాంటీ బ్లాక్ మనీ డేగా పేర్కొంటున్న పెద్దలంతా ఎంత బ్లాక్ మనీని పట్టితెచ్చారో చెప్పగలరా..!? నాలుగు లక్షలకోట్ల నల్లధనాన్ని బయటికి తీస్తామని చెప్పారు. కానీ రద్దు చేసిన డబ్బులో 98.96శాతం తిరిగి వచ్చింది. మరి నల్లధనం మాటేమిటి? ఎటువైపు నుండి చూసినా నల్లధనం తెల్లధనంగా మారిన జాడలే కనిపిస్తున్నాయి. నల్లకుబేరుల పట్ల మోడీ వల్లమాలిన ప్రేమే కనిపిస్తోంది. పార్లమెంట్ను, ప్రజాస్వామ్య నియమాలను కాదని ప్రధాని మోడీ ఒక్క నోటి మాటతో చేసిన ఈ దుస్సాహసానికి బలైంది నిస్సహాయులైన సామాన్యులే తప్ప సంపన్నులు కాదు. అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత, దొంగనోట్ల అడ్డుకట్ట, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన సర్కారే స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ముందు తన వైఫల్యాలను అంగీకరించింది. కోర్టు ముందు నల్లధనాన్ని వెలికి తీయలేక పోయామని తన అశక్తత వెల్లడించినవారు, ఇప్పుడు ఇది నల్లధనంపై మోడీ విజయమని చెప్పుకోవడం ప్రజలను మోసగించడమే కదా..! నోట్లరద్దుతో ఇక అవినీతి అంతం అన్నారు... కానీ రోజుకో అవినీతి ఉదంతం వెలుగుచూస్తూనే ఉంది. నిధులు నిరోధిస్తే ఉగ్రవాదం నిర్మూలించబడు తుందన్నారు. కానీ కొత్త కరెన్సీ ప్రజలకంటే ముందు ఉగ్రవాదులకే చేరింది. ఇంత దారుణమైన వైఫల్యాలను దాచిపెట్టాలనుకోవడం భావ్యమేనా..? ఎవరైనా తప్పులను గుర్తించి నిజాయితీగా ఒప్పుకోగలిగితేనే వాటిని సరిచేసుకోగలరు. అది చేతకానప్పుడు తప్పులు పునరావృతమవుతాయే తప్ప ప్రయోజనమేమీ ఉండదు. ప్రజల ముందు నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే పాలకపక్షానికే గౌరవం పెరుగుతుంది. దాటవేయడం ప్రజలను మోసగించడమే అవుతుంది.
ప్రధాని నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు అనే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని వెలువరించినప్పుడే పాల్ క్రూగ్స్ మెన్, అమర్త్యసేన్ వంటి పలువురు జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు ఇది సరైన నిర్ణయం కాదని హెచ్చరించారు. ఇప్పుడు అదే నిజమని రుజువవుతున్నది. జీడీపీ వృద్ధిరేటు 2 శాతం ఆవిరైపోయి 5.7శాతానికి పడిపోయింది. వృద్ధిరేటు పడిపోవడంతో దేశానికి రూ.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందనీ, రానున్న రెండేండ్లతో కలుపుకుంటే ఈ నష్టం రూ.9 లక్షల కోట్లకు చేరుతుందని ఓ అంచనా. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిగిందని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక నిపుణులు, విపక్షం, స్వపక్షంతో పాటు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయిష్టంగానైనా సరే ఆర్థిక వ్యవస్థ మందగించిన మాట నిజమేనని నిన్న గాక మొన్న అంగీకరించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఇది తాము సాధించిన అద్భుత విజయమని జబ్బలు చరుచుకోవడం ఆత్మవంచనా లేక ప్రజలను వంచించడమా..!
నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలుగా చెప్పుకున్న వన్నీ వట్టిమాటలే అని తేలిపోయినా తగుదునమ్మా అంటూ సంబరాలు చేసుకోవడంలో మతలబేమిటి..? ప్రజల ఆందోళనలను, నిరసనలను మరుగుపరచటానికా లేక మేం ఏ ఆందోళనలను, నిరసనలను లెక్కచేయం అని చెప్పటానికా...? ఈ విపరీత ప్రవర్తన దేనికి సంకేతం..!? ''దేశం మేలుకోరి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమిది. కష్టమైనా భరించండి. దేశభక్తి ప్రదర్శించండి. 50రోజుల్లో మీ కష్టాలన్నీ తీరుస్తాను. నా నిర్ణయం తప్పయితే శిక్షించండి..'' నోట్ల రద్దును ప్రకటిస్తూ ప్రధాని ప్రజలకిచ్చిన సందేశమిది... ప్రధాని మాట మీద ప్రజలు నిలబడ్డారు. కానీ ప్రజలకిచ్చిన మాట ప్రధాని నిలబెట్టుకున్నారా..? కానీ నిలబెట్టుకున్నాననే అంటున్నారాయన. ఇది అబద్ధాలపై స్వారీ చేయడమే.