Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట గ్రంథాలయోద్యమాలది ఘనమైన చరిత్ర. ఇవాళ గ్రంథాలయాలది దీనావస్థ. తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ గ్రంథాలయోద్యమాలకు వందేండ్ల పైబడిన చరిత్ర ఉంది. అయినప్పటికీ తెలుగువారు ఘనంగా చెప్పుకోదగిన గ్రంథాలయం ఒక్కటంటే ఒక్కటయినా లేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని కేంద్రీయ గ్రంథాలయం దుమ్మూ ధూళీలో కొట్టుమిట్టాడుతున్నది. కేంద్ర గ్రంథాలయం పరిస్థితి ఇలా వుంటే జిల్లాల్లో వున్న అయిదువందలకు పైబడిన లైబ్రరీలకు తగినంతమంది గ్రంథాలయాధికారులు లేరు. మూడేండ్లుగా కొత్త పుస్తకాలు కొనలేదు. విజ్ఞానకేంద్రాలుగా విలసిల్లాల్సిన గ్రంథాలయాలది విషాదకరమైన స్థితి. గ్రంథాలయాల ఉన్నతికి క్రియాశీలకంగా కృషి చేయాలన్న కనీస స్పృహ పాలకులకు లేదు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఏర్పడినా గ్రంథాలయాల ఉద్ధరణకీ, వికాసానికీ జరిగిన కృషి ఏమీ లేదు.
ఈ పూర్వరంగంలో ఈ నెల 14 నుంచి 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరగబోతున్నాయి. నేషనల్ లైబ్రరీ వీక్ను ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20 తేదీవరకు నిర్వహించే సంప్రదాయం 1968లో మొదలయింది. విద్యార్థుల్లో, యువతీ యువకుల్లో చదివే అలవాట్లను పెంపొందించడం ఈ వారోత్సవాల లక్ష్యం. అధ్యయనంపై వారు దృష్టి సారించేందుకు ఉపకరించేలా ఈ ఉత్సవాల్ని నిర్వహించేవారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్థానికంగా వున్న ప్రజల్ని శాఖా గ్రంథాలయాలకు రప్పించేవారు. ప్రజలలో అధ్యయన సంస్కృతి ప్రోది చేయడంలో ఈ వారోత్సవాల పాత్ర గణనీయమైంది. అనేక జిల్లాల్లో కవులుగా, రచయితలుగా, కళాకారులుగా ఎదిగివచ్చిన వారి తొలి యవ్వనప్రాయంపై గ్రంథాలయాల ప్రభావం అపారం.
దాదాపు వందేండ్ల కిందట తెలంగాణ సమాజంలో భాషా, సాహిత్య, సాంస్కృతిక చైతన్యం పాదుకొల్పడానికి దారులు వేసింది గ్రంథాలయాలే. 1905లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపన తెలంగాణ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ నేలమీద గ్రంథాలయాల ఏర్పాటుకు, గ్రంథాలయోద్యమ విస్తరణకు తోడ్పడింది ఈ భాషా నిలయం. అలాంటి ఉన్నతమైన చరిత్ర కలిగిన గ్రంథాలయం తన పూర్వవైభవాన్ని కోల్పోయింది. వరంగల్లోని వందేండ్లు రాజరాజనరేంద్ర భాషానిలయం చరిత్రని స్మరించేవారు కరువయ్యారు.
పుస్తకాల్ని విస్మరించిన జాతికి పురోగతి లేదు. అధ్యయనం కోల్పోయిన తరానికి సంస్కృతీ సంస్కారాలు ఉండవు. ఒక జాతి వికాసం, ఉన్నతమైన సంస్కారం అధ్యయనంతో ముడిపడివుంది. సమాజంలో మహిళల పట్ల గౌరవభావం, సాటివారిపై కరుణ, మానవీయ దృష్టి ఏర్పడటానికి అధ్యయనశీలత మంచి ఉపకరణం. పట్టణాల్లో, నగరాల్లో శాఖా గ్రంథాలయాలని నిర్వహించడమే కాదు, పాఠశాలల్లో, కళాశాలల్లోనూ గ్రంథాలయాలు ఉండాలి. పాఠ్యేతర పుస్తకాలు చదివే అలవాటుకు ఇవి పునాది వేస్తాయి. ఇలాంటి అనుభవాల నేపథ్యం లేకుండానే ఇవాళ పిల్లల, విద్యార్థుల బాల్యం, కౌమారం గడిచిపోతున్నాయి.
ప్రతి ఊళ్ళో బ్రాందీ షాపుల ఏర్పాటును ప్రోత్సహించే ప్రభుత్వానికి గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయాలన్న దృష్టి లేకపోవడం విడ్డూరం కాదు, విలాపం. ప్రజల పాలిటి విషాదం. ఉన్న గ్రంథాలయాల్ని సైతం భ్రష్టు పట్టిస్తున్న వైనం ఎల్లెడలా కనిపిస్తున్న వాస్తవం. అయినప్పటికీ గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణ ఓ ప్రహసనం కాబోతోంది. వందేండ్ల కిందటి మాదిరిలానే మరోసారి గ్రంథాలయోద్యమాల్ని నిర్మిస్తే తప్ప గ్రంథాలయాలు బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. కవులు, రచయితలు కొత్త పుస్తకాలు కొనడం లేదని వాపోతున్నారే గాని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదు. పుస్తకాలు కొనాలని, గ్రంథాలయాల్ని విజ్ఞానకేంద్రాలుగా మలిచే దిశగా చర్యలు తీసుకోవాలని సమిష్టిగా డిమాండ్ చేయాలి. గ్రామాల్లో, నగరాల్లో దేవాలయాలే కాదు గ్రంథాలయాలు ఉన్నప్పుడే శాస్త్రీయ దృక్పథం, వివేచన పరివ్యాప్తమవుతాయి. గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలు తెచ్చుకోడం ప్రజల జీవనశైలిలో అంతర్భాగమవుతుంది.
సృజనశీలుర్ని అవార్డులతో సత్కరిస్తే సరిపోదు, వారి పుస్తకాల్ని కొని పాఠకులకు అందుబాటులో ఉంచినప్పుడే వారి సృజనకు సిసలైన గౌరవం. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న మాటలు వినసొంపుగా ఉంటాయి. ఆ విశ్వనగరంలో ఘనమైన గ్రంథాలయాలకు చోటు ఉంటుందా అన్నదే ప్రశ్న. తెలంగాణ గౌరవప్రతిష్టలకు తగినట్టు ఒక మహోన్నతమైన గ్రంథాలయం ఏర్పడినప్పుడే తెలంగాణ భాషా సాహిత్యాలకు సార్థకత. తెలంగాణలోని 31 జిల్లాల్లో 31 జిల్లా కేంద్ర గ్రంథాలయాలు అత్యాధునిక సౌకర్యాలతో, కొత్త పుస్తకాలతో కొలువు తీరాలి. ఈ దిశగా చర్యలు తీసుకోడం పాలకుల బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుచేయాల్సిన కర్తవ్యం సృజనశీలురపై ఉంది. 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సంరంభం ఇందుకు ఉపయోగించుకోడానికి అనువైన సందర్భం.