Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కౌలురైతుల హక్కులను మందబలంతో హరించింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టానికి సవరణలు చేయటం ద్వారా ఈ పని ముగించింది. శాసనసభ సాక్షిగా కౌలుదార్లకు వ్యతిరేక వైఖరిని రాష్ట్ర ప్రభుత్వాధినేత స్పష్టం చేసారు. కౌలు రైతులు తమ ప్రాధాన్యత కాదన్నారు. కౌల్దారీ చట్టం ప్రమాదకరమైనదనీ అన్నారు. రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. కోనేరు రంగారావు సిఫారసులు తెలంగాణకు వర్తించవన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు సహాయం ఎకరానికి, ఒక పంటకు రూ.4వేల చొప్పున రూ.8వేలు కేవలం రైతులకు మాత్రమే చెల్లిస్తామనీ, కౌలు రైతులతో తమకు సంబంధం లేదనీ స్పష్టం చేసింది. కౌలురైతుకు నగదు చెల్లించే విషయం కేవలం అది రైతుకు సంబంధించినదే.. అన్నారు. రైతుకూ, కౌలుదారులకూ మధ్య ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదనీ ప్రకటించారు.
ప్రభుత్వం ప్రకటించిన విధానం ద్వారా రైతులంటే ఎవరన్న ప్రశ్న ముందుకొచ్చింది. సాగుచేస్తున్న కౌలురైతును రైతుగా గుర్తించటం లేదు. వ్యవసాయేతర కార్యకలాపాలలో ఉంటూ, సాగుభూమిని ఇతరులకు కౌలుకిచ్చే వారిని మాత్రం రైతుగా గుర్తిస్తున్నది. కౌలురైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది. నగదు సహాయంగా పొందిన డబ్బు కౌలుదారుకు ఇచ్చుకోవల్సిన బాధ్యత రైతుదేనని ప్రకటించటం బాధ్యతా రాహిత్యం. చట్టబద్ధమైన హక్కులే అమలు కావటం కష్టమవుతున్న సమాజం మనది. చట్టపరమైన గుర్తింపు గానీ, హక్కుగానీ నిరాకరించిన తర్వాత దయతో కౌలుదార్లకు చెల్లించే వారు ఉంటారా? చట్టబద్ధమైన హక్కుగా ఉంటే కనీసం దాని అమలు కోసం పోరాడి ఎంతో కొంత లబ్దిపొందవచ్చు. హక్కు తొలగించి, అడుక్కోవాలన్న తర్వాత న్యాయం జరుగదు కదా! పైగా పర్మినెంట్ కౌలుదారులే లేరని కొట్టిపారేసారు. తెలంగాణలో 45శాతం సాగుభూమి కౌలుదారులే చేస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలవైపు మరలిన వారి భూములను దశాబ్దాలుగా కౌలుకు సాగుచేస్తున్న వారున్నారు. పట్టణాలలో స్థిరపడిన వారంతా గ్రామాలలోని తమ భూములు కౌలుకివ్వటం ఆనవాయితీగా వస్తున్నదే. పాలకులు ఈ మాత్రం తెలియనివారు కాదు. పైగా ప్రభుత్వం ప్రకటించిన నగదు సహాయంతో రైతులంతా ఇకనుండి తమ భూములు తామే సాగుచేసుకోవాలనుకుంటున్నారట. 95శాతం రైతులు సిద్ధంగా ఉన్నారనటం హాస్యాస్పదం. ఉద్యోగాలు, వ్యాపారాలు వదలుకుని ఈ ఎనిమిది వేల రూపాయల కోసం వ్యవసాయం వైపు మరలుతున్నారని ప్రకటించటం అర్థరహితం.
ప్రభుత్వం శాసనసభలో ప్రకటించిన విధానం కౌలురైతుల పాలిట శాపం. ఇప్పుడు కౌలు రైతులకు ఎకరాకు 8వేల ఆర్థిక సహాయం అందకపోవటమే కాదు, ప్రభుత్వరంగ బ్యాంకులు, సహకార సంస్థల నుండి అప్పులు దొరకవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే సబ్సిడీ పొందేందుకు అర్హత ఉండదు. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా వచ్చే నష్టపరిహారం అందదు. గుర్తింపు కార్డులకు కూడా నోచుకోరు. కౌలు హక్కులు గానీ, భూమి అమ్మకానికి పెట్టినప్పుడు ప్రాధాన్యత గానీ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే కౌలుదార్లను నట్టేట ముంచటమే. కౌలురైతులలో అత్యధికులు దళితులూ, వెనుకబడిన తరగతులకు చెందినవారే. ప్రభుత్వ నిర్ణయం సామాజిక న్యాయాన్నీ హరిస్తున్నది. ఇలాంటి తిరోగమన నిర్ణయాల ద్వారా కౌలు రైతులకు మేలు చేయకపోగా ఉన్న కొద్దిపాటి హక్కులను హరించింది. బాహాటంగా తమ భూస్వామ్య, ధనిక రైతుల అనుకూల విధానాలను ప్రకటించుకున్నది. తమ ప్రభుత్వం నయా ధనికుల పక్షమేనని స్పష్టంగా ప్రకటించి నట్టయ్యింది. దశాబ్దాల పోరాట ఫలితాలను గంగపాలు చేసింది. గ్రామీణ పేదలకు కనీస భద్రత లేకుండా చేసింది.
ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో అత్యధికులు కౌలురైతులే. పెట్టుబడి లేక రుణసదుపాయం లేక వడ్డీవ్యాపారుల బారిన పడుతున్నారు. పండిన పంటకు గిట్టుబాటు కాదు కదా కనీసం మద్దతుధర లేక దివాళా తీస్తున్నారు. కరువు కాటకాలు, అకాల వర్షాలు, కల్తీ విత్తనాల వంటి సమస్యలు అదనం. ఇది కేవలం కౌలు రైతుల సమస్యగా భావించలేం. ఇది ఇలాగే అమలు జరిగితే చిన్న, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతుల పట్ల కూడా ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో జరుగుతున్న తతంగంతో తమకు ఎంతోకొంత మేలు జరుగుతుందనుకున్న వారి నమ్మకాలు వమ్ము చేసిందీ ప్రభుత్వం. వాస్తవ సాగుదార్లను గుర్తించి, వారికి హక్కులు కల్పించటం ద్వారా ఆదుకుంటుందని ఆశించిన గ్రామీణ పేద రైతుల ఆశలమీద నీళ్ళు చల్లిందీ ప్రభుత్వం. సాదాబైనామాలకు కూడా పరిష్కారం గ్యారంటీ లేదు. పట్టాలున్న వారికి మాత్రమే హక్కులైనా, ప్రభుత్వ పథకాలైనా అని కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించింది. ప్రజాకోర్టులోనే న్యాయాన్యాయాలు తేలుతాయని ప్రకటించింది. రైతు సంఘాలూ, ప్రజాతంత్రవాదులూ కదలవల్సిన సమయమిది. రైతులు చైతన్యవంతంగా పోరుబాట పట్టడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.