Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''లౌకికతత్వం పెద్ద అబద్ధం.'' కమలనాథుల కొత్త పాట ఇది. దేశంలో హిందూ ఉగ్రవాదం తారాస్థాయికి చేరిందంటేనే మండిపడిన వాళ్లు, నేడు సెక్యులరిజంపైనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు. భారతీయ పునాదులనే పెకిలించ జూస్తున్నారు. ఏకంగా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే సవాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం. ''స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో లౌకికమనే పదమే పెద్ద అబద్ధం. ఇది దేశానికి తీవ్ర నష్టం. ఆ పదాన్ని ప్రచారంలోకి తెచ్చినవారు దేశానికి క్షమాపణ చెప్పాలి. ఏ వ్యవస్థా లౌకికతత్వాన్ని పాటించలేదు.'' ఇవీ రారుపూర్లోని ఓ కార్యక్రమంలో యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు. గత మూడున్నరేండ్లుగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఒక వ్యూహంలో భాగమేనని ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒక వైపు సామ్రాజ్యవాదానికి దాసోహమంటూనే, మరోవైపు దేశాన్ని మతరాజ్యంగా మార్చడమే లక్ష్యంగా సంఘ పరివారం పావులు కదుపుతున్నది. లౌకిక, ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్న వ్యక్తుల హత్యలు, దళితులూ మైనారిటీలపై దాడులు, విద్యాలయాల కాషాయీకరణ, మత వైషమ్యాలు, ప్రజల సాంస్కృతిక జీవితాన్ని నియంత్రించే ప్రయత్నాలు, దేశ వారసత్వ సంపదలైన నిర్మాణాలపై సృష్టిస్తున్న వివాదాలు వీటి కొనసాగింపుగా ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి.
భిన్న మతాలకు, జాతులకు, సంస్కృతులకు నిలయం మన భారతదేశం. ఏ మనిషీ తాను ఫలానా మతంలోనే పుట్టాలని కోరుకుని పుట్టడు. ఎవరేమతాన్ని నమ్మినా సహజీవనం అనివార్యం. అందుకే భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ ప్రత్యేకత. అటువంటి భారతీయతకే ముప్పుతెచ్చే వీరి ప్రయత్నాలు ప్రజాక్షేమానికి పెను ప్రమాదం. కుల మతాలకతీతమైన సహజీవనం, సమ భావనం భారతజాతికి రెండు కండ్లు. ఆ కన్నులు పొడిచే కుట్రలు ఏ ప్రయోజనాల కోసం..? ''లౌకికతత్వాన్ని పాటించడం ఏ వ్యవస్థకూ సాధ్యం కాదు'' అన్న సూత్రీకరణలోని ఆంతర్యమేమిటి? లౌకిక భావాలకు నిలయమైన ఈ దేశాన్ని హిందూ మతరాజ్యంగా మార్చడమేనా..? ఈ దేశంలో 'రాముడు' లేకుండా ఏ పనీ జరగదు అన్న వ్యాఖ్యల సారాంశమేమిటి..? ఇది శతాబ్దాలుగా కలిసి బతుకుతున్న ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడమే కదా..! ఏ మతమూ మరో మతాన్ని ద్వేషించమని చెప్పదు. ప్రతి మతగ్రంథమూ పరమత సహనాన్నే ప్రభోదిస్తుంది. హిందూమతమూ అదే చెపుతోంది. అయినప్పటికీ హిందూత్వం పేరుతో వీరు సృష్టిస్తున్న విద్వేషాలను భారత ప్రజలు ఎలా సహిస్తారు..? ప్రపంచం రోజు రోజుకూ అభ్యుదయంలోకి పురోగమిస్తున్న వేళ మేం దేశాన్ని మళ్లీ మధ్య యుగాలకు తీసుకెళ్తామంటే ఎలా..!? భారత రాజ్యాంగం ప్రకారం అధికారానికి వచ్చిన వాళ్ళు, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణం చేసినవాళ్లు ''లౌకికవాదం'' అనే రాజ్యాంగ మౌలిక సూత్రానికే విరుద్ధంగా వ్యవహరించడం ప్రమాదకరం.
పరిస్థితులు చూస్తుంటే కమలనాథులను భవిష్యత్తు కలవరపరుస్తున్నట్టున్నది. వారి అభివృద్ధి మంత్రాన్ని ప్రజలు నమ్మడం లేదని గుర్తించినట్టున్నారు. వారి విధానాల పట్ల ప్రజల్లోని వ్యతిరేకత తెలిసిపోతున్నట్టున్నది. గత ఎన్నికల సందర్భంలో భారత పాలకవర్గాలు, కార్పొరేట్ శక్తులు, వారి కనుసన్నల్లోని మీడియా సృష్టించిన మోడీ మానియా ప్రజలను ప్రభావితం చేసింది. దీనికి తోడు కాంగ్రెస్ వైఫల్యాలు ఉండనే ఉన్నాయి. మూడున్నరేండ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మోడీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలకు అనేక ఆశలూ నమ్మకాలూ ఉండేవి. ఆ నమ్మకంతోనే వీరికి తిరుగులేని అధికారాన్నిచ్చారు. ప్రజా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయనీ, కాంగ్రెస్ మార్కు అవినీతిమయమైన రాజకీయాలకు అవకాశం ఉండదనీ భావించారు. కానీ ఆ నమ్మకాలన్నీ వమ్ము అయిన వేళ, ప్రజలు భ్రమలు తొలగి వాస్తవాలను గ్రహిస్తున్న వేళ, అధికారపార్టీలో ఆందోళన మొదలయినట్టున్నది. అందుకే తిరిగి వారి ప్రధాన అస్త్రమైన మతోన్మాదానికి పదును పెడుతున్నారు. వైషమ్యాలు రగిలించి మెజారిటీ ప్రజలను తమ వెనుక సంఘటితం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకు వారికి సెక్యులరిజం ప్రధాన ఆటంకం. మనజాతి నిర్మాణంలోనే బలమైన సెక్యులర్ పునాదులున్నాయి. కాబట్టి ఆ పునాదులపైనే దాడులకు పూనుకుంటున్నారు. దబోల్కర్, గౌరీలంకేశ్ వంటి మేధావుల హత్యలు, కమల్హాసన్, ప్రకాశ్రాజ్ లాంటి వారిపై బెదిరింపులు, ఈ దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్న కమ్యూనిస్టుల కార్యాలయాలపై, ప్రభుత్వాలపై, అప్రజాస్వామికంగా విరుచుకుపడుతున్న తీరు తెన్నులూ ఇందుకు ప్రతీకలు. ఇది కేవలం ప్రజాస్వామ్య నియమాలు, లౌకిక సూత్రాలపైనే కాదు భారత రాజ్యాంగ వ్యవస్థపైనే దాడి... భారత రాజ్యాంగ స్థానంలో తిరిగి మనుధర్మాన్ని ఒక సామాజిక, రాజకీయ శాసనంగా ప్రతిష్టింపజేసే కుట్ర... అందుకు అవసరమైన భావవ్యాప్తికి ఎవరు అడ్డమొచ్చినా అది వ్యక్తులైనా, వ్యవస్థలైనా లెక్కచేయం అనడానికి సంకేతం... ఇది సహించడం భారతీయతకే ప్రమాదం. ప్రజలు ప్రతిఘటించాలి.